Business

బిర్లా కొత్త రంగుల కంపెనీ-BusinessNews-Feb 22 2024

బిర్లా కొత్త రంగుల కంపెనీ-BusinessNews-Feb 22 2024

* ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (WhatsApp) మరో కొత్త అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. గ్రూపులు, ఇతరులకు పంపే టెక్ట్స్‌ను ఆకర్షణీయంగా మార్చేందుకు తాజాగా ఫార్మాటింగ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తన వాట్సప్‌ ఛానెల్ ద్వారా వెల్లడించారు. అధికారిక సమాచారం పంపిచాలనుకొనే వారికి ఈ ఆప్షన్లు ఉపయోగపడనున్నాయి. వాట్సప్‌లో ఎలాంటి సమాచారం పంపించాలన్నా సాధారణ టెక్ట్స్‌ రూపంలోనే పంపించాలి. వాటికి మెరుగులు దిద్దాలంటే కొన్ని ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. అదనపు హంగులు కావాలంటే మరో యాప్‌పై ఆధారపడాల్సి వచ్చేది. ఇకపై అలాంటి సమస్య ఉండదు. అధికారిక సమాచారం పంపించాలన్నా, సుదీర్ఘ టెక్ట్స్‌ని పంపే సమయంలో ముఖ్యమైన అంశాలను నంబరింగ్‌, ఇన్‌లైన్‌ కోడ్‌, బ్లాక్‌ కోట్‌, బుల్లెట్స్‌ రూపంలో మార్చడం ఇక సులువు.

* ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ పెయింట్స్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బిర్లా ఓపస్‌ (Birla Opus) పేరుతో ఉత్పత్తులను విక్రయించనుంది. ఇందుకోసం రూ.10 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లలో రూ.10 వేల కోట్ల ఆదాయం సాధనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ అందులో పేర్కొంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) గురువారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల మధ్య నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత కోలుకున్నాయి. టీసీఎస్‌, ఐటీసీ, రిలయన్స్ వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. కనిష్ఠాల నుంచి సెన్సెక్స్‌ 1100 పాయింట్లు పైకెగిసింది. సెన్సెక్స్‌ ఈ ఉదయం 72,677.51 వద్ద (క్రితం ముగింపు 72,623.09) ప్రారంభమై మెల్లగా నష్టాల్లోకి జారుకొంది. మధ్యాహ్నం 1 గంట వరకు నష్టాల్లో కొనసాగిన సూచీ.. కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్‌ ముగిసే సమయానికి భారీగా పుంజుకుంది. ఇంట్రాడేలో 73,256.39 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 535.15 పాయింట్ల లాభంతో 73,158.24 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 162.40 పాయింట్ల లాభంతో 22,217.45 వద్ద స్థిర పడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.84గా ముగిసింది.

* రాబోయే కొన్నేళ్లలో భారత్‌ 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా (Indian Economy) అవతరిస్తుందని ‘ప్రపంచ ఆర్థిక వేదిక (WEF)’ అధ్యక్షుడు బోర్గే బ్రెండే అంచనా వేశారు. ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానానికి చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్‌లో ఉన్న ఆశావహ దృక్పథం ప్రస్తుతానికి ప్రపంచంలో మరెక్కడా కనిపించడం లేదని గురువారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. సమయం వచ్చినప్పుడు భారత ప్రభుత్వ సహకారంతో డబ్ల్యూఈఎఫ్‌ ఇండియా సమ్మిట్‌ ద్వారా తిరిగి దేశానికి రావాలనుకుంటున్నట్లు బ్రెండే తెలిపారు. ఏటా జనవరిలో దావోస్‌ కేంద్రంగా జరిగే డబ్ల్యూఈఎఫ్‌ (WEF) సమావేశానికి ప్రధాని మోదీకి (PM Modi) ఎప్పటికీ ఆహ్వానం ఉంటుందని తెలిపారు. భారత్‌ కొన్నేళ్లపాటు ఏడు శాతం వార్షిక వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేశారు. గతకొంతకాలంగా దేశంలో కీలక సంస్కరణలు చోటుచేసుకున్నాయని తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) సైతం ఊపందుకున్నాయని పేర్కొన్నారు. తయారీ కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయన్నారు.

* గ‌త ఏడాది పెద్ద‌సంఖ్య‌లో ఉద్యోగుల‌ను తొల‌గించిన అనంత‌రం దేశీ ఐటీ దిగ్గ‌జం టీసీఎస్ టెకీల‌కు తీపిక‌బురు అందించింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఉద్యోగుల నియామ‌కాల‌ను పెంచాల‌ని టీసీఎస్ యోచిస్తోంది. నాస్కామ్ స‌ద‌స్సులో టీసీఎస్ హైరింగ్ ప్ర‌ణాళిక‌ల‌ను సీఈవో కే కృతివాస‌న్ వెల్ల‌డించారు. రిక్రూట్‌మెంట్ ప్ర్రక్రియ‌ను నిలువ‌రించే ప్ర‌ణాళిక‌లేమీ లేవ‌ని స్ప‌ష్టం చేశారు. టీసీఎస్ త‌న హైరింగ్ ఆలోచ‌న‌ల‌కు క‌ట్టుబ‌డి ఉంద‌ని, రిక్రూట్‌మెంట్ విష‌యంలో కుదింపులు ఏమీ ఉండ‌వ‌ని తేల్చిచెప్పారు. ఇక టీసీఎస్‌లో ఇంటి నుంచి ప‌నిచేసే ప‌ద్ధ‌తికి స్వ‌స్తి ప‌లుకుతామ‌ని పేర్కొన్నారు. కార్యాల‌య వాతావ‌ర‌ణం, ముఖాముఖి సంప్ర‌దింపుల‌తోనే విలువైన విష‌యాలు నేర్చుకోగ‌లుగుతార‌ని రిమోట్, హైబ్రిడ్ వ‌ర్క్ మోడ‌ల్స్ గురించి ప్ర‌స్తావిస్తూ వ్యాఖ్యానించారు. సంస్ధాగ‌త క‌ల్చ‌ర్‌, విలువ‌ల మెరుగుద‌ల‌కు ఈ మోడ‌ల్స్ స‌రైన‌వి కాద‌ని స్ప‌ష్టం చేశారు. ఏఐపై అతిగా ఆధార‌ప‌డ‌కుండా చూసుకోవాల‌ని, ప‌ని ప్ర‌దేశాల్లో జ‌న‌రేటివ్ ఏఐతో మాన‌వ సామ‌ర్ధ్యాలు మెరుగవుతాయ‌ని పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z