DailyDose

టీవీ5 సాంబశివరావుపై మరో ఛీటింగ్ కేసు-CrimeNews-Mar 06 2024

టీవీ5 సాంబశివరావుపై మరో ఛీటింగ్ కేసు-CrimeNews-Mar 06 2024

* రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. అతడి మృతిని స్నేహితుడు తట్టుకోలేకపోయాడు. అక్కడే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ విషాద ఘటన స్థానికులను కలచివేసింది. (Man Dies By Suicide After Friend Killed) మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జాబువా జిల్లాలోని ఫుల్దాన్‌వాడికి చెందిన 29 ఏళ్ల నర్వే సింగ్, 28 ఏళ్ల కాంతి స్నేహితులు. మంగళవారం సాయంత్రం వీరిద్దరూ కలిసి బైక్‌పై ఉజ్జయినీ నుంచి సొంతూరుకు తిరిగి వస్తున్నారు. ఇండోర్‌-అహ్మదాబాద్‌ హైవేపై నల్‌ఖేడా వద్ద వేగంగా వచ్చిన మరో బైక్‌ వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్వే సింగ్‌ అక్కడికక్కడే చనిపోయాడు. కాగా, బైక్‌ ప్రమాదంలో గాయపడిన కాంతి, తన కళ్లేదుటే స్నేహితుడు నర్వే సింగ్‌ మరణించడాన్ని తట్టుకోలేకపోయాడు. ఫ్రెండ్‌ను కోల్పోయిన బాధతో తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని వీడియోలో రికార్డ్‌ చేశాడు. తన కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించవద్దని అందులో కోరాడు. ఈ వీడియోను తన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌కు షేర్‌ చేశాడు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

* సంగారెడ్డి జిల్లా నారాయ‌ణ‌ఖేడ్‌లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. కారు మెకానిక్ షెడ్డులో మంట‌లు అక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో అక్క‌డ ద‌ట్ట‌మైన పొగ‌లు క‌మ్ముకున్నాయి. ఈ ప్ర‌మాదంలో మూడు కార్లు పూర్తిగా ద‌గ్ధ‌మ‌య్యాయి.

* నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద హైవేపై లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. వీరిలో నవ దంపతులు ఉన్నారు. మృతులను హైదరాబాద్‌ వాసులుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన మంత్రి రవీందర్ తన కుటుంబంతో కలిసి కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అనంతరం తిరిగివస్తుండగా నల్లగట్ల హైవేపై నెమ్మదిగా వెళుతున్న లారీని వెనుకనుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో రవీందర్‌తో పాటు అతడి భార్య లక్ష్మి, కుమారుడు బాల కిరణ్, కోడలు కావ్య, మరో కుమారుడు ఉదయ్‌కిరణ్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. గత నెల 29న బాల కిరణ్‌కు కావ్యతో గుంటూరు జిల్లా తెనాలిలో వివాహం జరిపించారు. ఈనెల 3న శామీర్‌పేటలో ఘనంగా రిసెప్షన్ పూర్తి చేశారు. 4న నూతన దంపతులను తీసుకుని వెంకన్న దర్శనం కోసం తిరుమలకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది.

* చెప్పేవి నీతులు.. చేసేవి తప్పుడు పనులు.. నిత్యం టీవీ5 వేదికగా రాజకీయ ప్రవచనాలు వల్లించే సాంబశివరావుపై గచ్చిబౌలి పీఎస్‌లో మరో కేసు నమోదైంది. తమ కంపెనీనిలో సాంబశివరావు రియల్ ఎస్టేట్‌ బ్రోకర్‌గా పని చేస్తూ మోసం చేశాడంటూ సంధ్యా హోటల్స్ ప్రై.లిమిటెడ్ అకౌంటెంట్ ఫిర్యాదు చేశారు. కంపెనీ నిధులతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కారు కొనుగోలు చేశాడంటూ ఫిర్యాదు చేశారు. సంధ్యా హోటల్స్ అకౌంటెంట్ ఫిర్యాదుతో సాంబశివరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, గతంలోనూ గచ్చిబౌలి పెట్రోల్ బంక్ ల్యాండ్ విషయంలో ఫోర్జరీ కేసు నమోదైన విషయం తెలిసిందే. హిందుస్తాన్‌ పెట్రోలియం లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)కు, సంధ్య కన్‌స్ట్రక్షన్‌కు మధ్య జరిగిన పెట్రోల్‌ బంక్‌ ఒప్పందం వివాదంలో టీవీ–5 వైస్‌ ప్రెసిడెంట్‌ సాంబశివరావు అసలు వాస్తవాలను దాచి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని సంధ్య కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధినేత సరనాల శ్రీధర్‌రావు ఇటీవల ఆరోపించారు. స్థలం సాంబశివరావుది కాదు.. పెట్టుబడీ ఆయనది కాదు.. కానీ, పెట్రోల్‌ బంక్‌ డీలర్‌షిప్‌ మాత్రం ఆయన వాళ్ల పేరు మీద పెట్టుకుని బాగోతం నడిపారని విమర్శించారు.

* టాలీవుడ్ నటికి ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌తో వివాదం మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇప్పటికే ఈ సంఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సౌమ్య జాను రాంగ్‌ రూట్‌లో రావడంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ హౌంగార్డ్‌ ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తాజాగా ఈ కేసుపై నటి సౌమ్య జాను హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోకుండా స్టే విధించాలని కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం సౌమ్యకు సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. అంతే కాకుండా మార్చి 11 లోపు పోలీసుల ఎదుట హాజరు కావాలని సౌమ్యకు హైకోర్ట్ సూచించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z