Agriculture

11లక్షల రైతులకు జగన్ సర్కార్ సాయం-NewsRoundup-Mar 06 2024

11లక్షల రైతులకు జగన్ సర్కార్ సాయం-NewsRoundup-Mar 06 2024

* తిరుమల శ్రీవారిని నటి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి మహేశ్వరితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

* తెలుగు చిత్ర పరిశ్రమలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ (Allu Arjun), స్నేహ రెడ్డిల జంటకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ జంట సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా వీరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా అల్లు అర్జున్ తన భార్యకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘‘మన పెళ్లై 13 ఏళ్లు అయిపోయాయి. నీ వల్లే ఈ ప్రయాణం సంతోషంగా సాగుతోంది. నువ్వు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ నాకు శక్తి ఇస్తున్నావు. చివరివరకూ మన ప్రేమ ఇలానే కొనసాగాలి. హ్యాపీ యానివర్సిరీ క్యూటీ’’ అని అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. వీరి సోషల్‌మీడియా వేదికగా అభిమానులు యానివర్సిరీ విషెస్‌ తెలియజేస్తున్నారు.

* ‘విశాఖ విజన్‌’ పేరుతో సీఎం జగన్‌ (YS Jagan) చేసిన ప్రకటనపై ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల (YS Sharmila) స్పందించారు. పరిపాలనా రాజధానిలో ఇన్నాళ్లూ పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు పదేళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు.

* వందరోజుల పాలన చూసి ఓటేయాలని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నాయని.. ఈ వంద రోజుల పాలనలో ఏముందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆయన బుధవారం మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలనలో పెన్నులు గన్నులయ్యాయని.. తాము అధికారంలో ఉన్న సమయంలో ఉన్నప్పుడు పరిస్థితి ఇలా ఉండేదా? అంటూ ప్రశ్నించారు. జర్నలిస్టులు సచివాలయంలో అన్ని ఫోర్లు స్వేచ్ఛగా తిరిగేవారని.. ప్రస్తుతం సచివాలయంలో విలేకరులకు ఎందుకు స్వేచ్ఛ లేదని హరీశ్‌రావు నిలదీశారు. నిధుల దుర్వినియోగమని చెప్పినవారు ఆరుగురిని పీఆర్వోలుగా ఎందుకు పెట్టుకున్నారన్నారు.

* సైనిక సంపత్తిపరంగా రష్యాతో పోల్చితే ఉక్రెయిన్ శక్తి నామమాత్రమే. అయినా రష్యాతో పోరులో ఆ దేశం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. అనతికాలంలోనే కొత్త ఆయుధాల రూపకల్పన, తయారీతో తన రక్షణ వ్యవస్థను ఉక్రెయిన్ పటిష్ఠం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే సముద్ర డ్రోన్-సీ బేబీని రూపొందించింది. తాజాగా వాటిని అప్‌గ్రేడ్ చేస్తూ నూతన మోడల్‌ను విధుల్లోకి చేర్చింది. ఈ డ్రోన్లు ఇప్పటికే రష్యా యుద్ధనౌకల పాలిట యమపాశాలుగా మారాయి.

* బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో దర్యాప్తును ఎన్‌ఐఏ (NIA) వేగవంతం చేసింది. ఇందులోభాగంగా బుధవారం కీలక ప్రకటన చేసింది. నిందితుడి ఫొటోను విడుదల చేసిన అధికారులు.. అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షల నగదు రివార్డును ప్రకటించారు. ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేసింది. సమాచారం చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపింది. ఈ కింది పేర్కొన్న అడ్రస్‌/ఫోన్‌ నంబర్‌కు సమాచారం చెప్పాలని కోరింది.

* సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. లహరి ఏసీ స్లీపర్‌, ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సుల్లో బెర్తులపై 10 శాతం రాయితీని ప్రకటించింది. ఈ సర్వీసులు తిరిగే అన్ని రూట్లలోనూ ఈ రాయితీ వర్తిస్తుందని సంస్థ ఎండీ సజ్జనార్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా వెల్లడించారు. ఏప్రిల్‌ 30 వరకు డిస్కౌంట్‌ అమల్లో ఉంటుందని తెలిపారు.

* తెలంగాణలో ప్రభుత్వ కొలువుల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న గ్రూప్‌- 1 గ్రూప్‌-2, గ్రూప్‌- 3 పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ (TSPSC) బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. 563 ఉద్యోగాల భర్తీకి ఇటీవల విడుదల చేసిన గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌కు సంబంధించి జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ.. అక్టోబర్‌ 21 నుంచి గ్రూప్‌ -1 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు తాజాగా వెల్లడించింది.

* అగ్రరాజ్య (USA) అధికార పీఠం కోసం జరిగే ఎన్నికల్లో మరోసారి అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ప్రత్యర్థులుగా ఉండటం దాదాపు ఖాయమైనట్లే కన్పిస్తోంది. రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలగాలని భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ (Nikki Haley) నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది గంటల్లో దీనిపై ఆమె ప్రకటన చేయనున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.

* బలిజ కులానికి చెందిన తనకు వైకాపాలో గడచిన అయిదేళ్లలో అనేక అవమానాలు ఎదురయ్యాయని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపాలో కాపులకు జరుగుతున్న వివక్షను చూసి విసిగిపోయి పార్టీ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గురువారం పవన్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు.

* ఏ విషయంలోనైనా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలియజేస్తారు నటి కంగనా రనౌత్ (Kangana Ranaut). తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. తనను తాను లతా మంగేష్కర్‌తో పోల్చుకున్న కంగనా.. డబ్బు కంటే ఆత్మగౌరవం ముఖ్యమన్నారు. ‘‘గాయని లతా మంగేష్కర్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎంత డబ్బిచ్చినా పెళ్లిళ్లలో పాడను అని చెప్పారు. నేను అదే ఫాలో అవుతాను. నా జీవితంలో ఇప్పటివరకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా. కానీ, లతాజీ చెప్పిన ఆ మాటను మాత్రం నేను పాటిస్తూనే ఉన్నా. ఎన్ని ఆఫర్లు వచ్చినా పెళ్లిళ్లలో డ్యాన్స్ వేయలేదు. భారీ రెమ్యూనరేషన్‌ ఇస్తాం ఐటెమ్‌ సాంగ్స్‌ చేయమంటూ వచ్చిన అవకాశాలను కూడా తిరస్కరించాను. అవార్డు వేడుకలకు కూడా దూరంగా ఉండాలనుకుంటున్నా. డబ్బు కంటే ఆత్మగౌరవం ముఖ్యం. అడ్డదారుల్లో డబ్బు సంపాదించకూడదని యువతరం అర్థం చేసుకోవాలి’’ అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌కు పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు మాత్రం కంగనాను తప్పుపడుతున్నారు.

* భారత్‌ (India)తో దౌత్య విభేదాలు కొనసాగుతున్న వేళ మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu) మరోసారి కవ్వింపు వ్యాఖ్యలు చేశారు. హైడ్రోగ్రాఫిక్‌ సర్వేల కోసం న్యూదిల్లీతో ఉన్న ఒప్పందాన్ని పునరుద్ధరించుకోబోమని ప్రకటించారు. ఆ సర్వేలను తాము సొంతంగా చేపట్టగలమన్నారు. సైనిక సహకారంపై మాల్దీవులు-చైనాల మధ్య ఒప్పందం జరిగిన కొన్ని రోజుల వ్యవధిలోనే ముయిజ్జు ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

* వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌–2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు రబీ సీజన్‌ ఆరంభంలో గతేడాది డిసెంబర్‌లో సంభవించిన మిచాంగ్‌ తుపాన్‌ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీ(పంట నష్టపరిహారం)ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ. 1,294.58 కోట్ల పరిహారాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ, ఖరీఫ్‌ వర్షాభావం వల్ల, మిచాంగ్‌ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు సీజన్‌ మగిసేలోగా రైతన్నలకు తోడుగా, అండగా ప్రభుత్వం ఉంటుందనే భరోసాను కల్పిస్తూ అడుగులు ముందుకేస్తున్నామన్నారు. రైతులకు నష్టం జరిగితే ప్రభుత్వాలు ఇంత క్రమం తప్పకుండా, పారదర్శకంగా చేయాల్సిన మంచి రాష్ట్రంలో ఎప్పుడూ చేయలేదు. మొట్టమొదటి సారిగా పరిస్థితులు మార్చాం. గ్రామస్థాయిలో ఆర్బీకేలు, సచివాలయాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

* లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రులు, బీజేపీ అగ్ర నేతలు తెలంగాణపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణలో​ పర్యటించనున్నారు. దీంతో, రాష్ట్రంలో రాజకీయంగా మరోసారి ఆసక్తికరంగా మారింది. వివరాల ప్రకారం.. తెలంగాణలో మెజార్టీ లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ భారీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ తెలంగాణలో​ పర్యటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా తెలంగాణకు రానున్నారు. ఈనెల 12వ తేదీన అమిత్‌ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా బీజేపీ బూత్‌ కమిటీ అధ్యక్షులు, ఆపై స్థాయి కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు నగరంలోని ఎల్బీ స్టేడియంలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.

* కర్ణాటక రాజధాని బెంగళూరును నీటి సంక్షోభం వేధిస్తోంది. వేసవికాలం ప్రారంభంలోనే నీటి కొరత నగర వాసులకు చుక్కలు చూపిస్తోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో నీటి సమస్యతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కుళాయిలు, బోర్ల నుంచి నీరు రాకపోవడంతో ట్యాంకర్ల నుంచి నీటిని సరఫరా చేసుకుంటున్నారు. తాజాగా బెంగళూరులో నీటి ఎద్దడిపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ స్పందించారు. నగరంలో రోజురోజుకీ నీటి కొరత తీవ్రతర అవుతుందని, దాదాపు 3000 పైగా బోరు బావులు ఎండిపోయాయని తెలిపారు.తన ఇంటి వద్ద ఉన్న బోరు బావి కూడా ఎండిపోయిందని తెలిపారు. నీటి సమస్యను తీర్చడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని చెప్పారు. సంబంధిత అధికారులతో ఇప్పటికే చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z