Politics

ముగిసిన నామినేషన్ల స్వీకరణ గడువు-NewsRoundup-Apr 25 2024

ముగిసిన నామినేషన్ల స్వీకరణ గడువు-NewsRoundup-Apr 25 2024

* లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ (PM Modi), కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. విద్వేష ప్రసంగాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని వీరిపై ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission:).. కోడ్‌ ఉల్లంఘన కింద భాజపా (BJP), కాంగ్రెస్‌ (Congress) అధ్యక్షులకు నోటీసులు జారీ చేసింది.

* ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తనతో మాట్లాడుతున్నాడని నమ్మిన ఓ మహిళ నిట్టనిలువునా మునిగింది. మస్క్‌నంటూ నమ్మబలికిన కేటుగాడి మాయలో పడి రూ.లక్షల్లో నష్టపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?(Cyber crime) అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. దక్షిణ కొరియాకు చెందిన జియోంగ్ జిసన్‌ సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. అందుకు డీప్‌ఫేక్ వీడియో కారణమైంది.

* ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3గంటలతో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల కు నామినేషన్ల గడువు ముగిసిందని అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 175 శాసనసభ నియోజకవర్గాలకు 4,210 మంది నామినేషన్లు వేశారు.

* ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లకు ప్రాధాన్యం లేని రోజుల్లో డెలివరీలు చాలా త్వరగా అందేవి. రానురానూ వీటికి ఆదరణ పెరుగుతోంది. దీంతో ఆర్డర్‌ చేతికందాలంటే కాస్త ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తోంది. ఈనేపథ్యంలో ప్రముఖ ఆహార సేవల సంస్థ జొమాటో (Zomato) ఫుడ్‌ ఆర్డర్లను మరింత వేగంగా కస్టమర్లకు చేర్చేందుకు సిద్ధమవుతోంది.

* అమెరికా (USA) అధ్యక్ష ఎన్నికల ప్రచారం వాడీవేడీగా కొనసాగుతోంది. అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) పరస్పరం వ్యక్తిగత విమర్శలు చేయడానికి కూడా సంకోచించడంలేదు. తాజాగా ట్రంప్‌ జట్టును ఉద్దేశించి బైడెన్ వ్యంగ్యంగా మాట్లాడారు.

* మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడాన్ని బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కూడా వ్యతిరేకించారని.. కానీ, కాంగ్రెస్‌ మాత్రం వక్రమార్గంలో వాటిని అమలుచేసి ఆయనకు వెన్నుపోటు పొడిచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తనను దుర్భాషలాడుతూ రాహుల్‌ గాంధీ ఆనందిస్తున్నారని.. అయినప్పటికీ ఆయనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయకూడదన్నారు.

* కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. పోలవరం పూర్తి, రాజధాని నిర్మాణం సహా అన్ని సమస్యలకూ కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే పరిష్కారం లభిస్తుందని చెప్పారు. కులమతాలకు అతీతంగా అందరినీ అక్కునే చేర్చుకునే పార్టీ తమదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలోని కృష్ణలంక రాణిగారితోటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.

* భారాస హయాంలో మెదక్‌కు రైలు తీసుకువచ్చినట్లు మాజీ మంత్రి, భారాస నేత హరీశ్‌రావు అన్నారు. మెదక్‌లో నిర్వహించిన భారాస ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘‘ వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ నేతలు బాండ్‌ పేపర్‌ రాసిచ్చారు. గతంలో బాండ్‌ పేపర్‌కు విలువ ఉండేది.. సీఎం రేవంత్‌ మోసంతో దాని విలువ పోయింది’’ అని విమర్శించారు.

* బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ ఎన్డీయే కూటమి అభ్యర్థి, ఎం.ఎం. కొండయ్య గురువారం అట్టహాసంగా నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయనకు మద్దతుగా సినీనటుడు నిఖిల్‌ సిద్దార్థ (Nikhil), తెదేపా, భాజపా, జనసేన శ్రేణులు భారీగా పాల్గొన్నారు. నిఖిల్‌కు ఎం.ఎం. కొండయ్య.. మామయ్య అన్న విషయం తెలిసిందే. మాట్లాడుతూ.. చిరు నవ్వుల చీరాల కావాలంటే కొండయ్యకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు.

* సీఎం జగన్‌కు బ్యాండేజ్‌ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్‌ అవుతుందని వైఎస్‌ వివేకా కుమార్తె సునీత అన్నారు. వైద్యులు సరైన సలహా ఇవ్వలేదన్న ఆమె.. జగన్‌ త్వరగా బ్యాండేజ్‌ తీయాలని ఒక డాక్టర్‌గా సలహా ఇస్తున్నట్టు చెప్పారు. గాలి తగిలితేనే గాయం త్వరగా మానుతుందన్నారు. నామినేషన్‌ సందర్భంగా సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై సునీత స్పందించారు. పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘ ఇవాళ జగన్‌ చేసిన వ్యాఖ్యల్లో వివేకాపై ద్వేషం కనిపిస్తోంది. ఏం పాపం చేశారని ఆయనపై మీకు ఇంత ద్వేషం. మీ కోసం త్యాగం చేశారు కాబట్టే.. వివేకాపై కోపమా? సీఎం జగన్‌కు న్యాయవ్యవస్థ, సీబీఐపై నమ్మకం లేదు. ఏ వ్యవస్థపై నమ్మకం ఉందో చెప్పాలి. హత్యపై మాట్లాడవద్దంటూ కోర్టు ఆర్డర్‌ తెచ్చిన వాళ్లే మాట్లాడుతున్నారు. సీబీఐ నిందితులు అని చెప్పిన వాళ్లకు ఓట్లు వేయవద్దు. తప్పు చేసి ఉంటే నాకైనా, నా భర్తకైనా శిక్ష పడాల్సిందే. అవినాష్‌రెడ్డి చిన్న పిల్లోడని చెబుతున్నారు.. ఎంపీ పదవులు పిల్లలకు ఇస్తారా? సీబీఐ నిందితులు అన్న వాళ్లను జగన్‌ ప్రోత్సహిస్తున్నారు. ఐదేళ్లుగా నా తండ్రి హత్యపై పోరాడుతుంటే రాజకీయాలు అంటగడుతున్నారు. సీఎంను ప్రాధేయపడుతున్నా.. ఇప్పటికైనా నా పోరాటానికి సహాయం చేయండి’’ అని విజ్ఞప్తి చేశారు.

* జింబాబ్వేకు చెందిన ఓ మాజీ క్రికెటర్‌పై చిరుత దాడి చేయగా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని పెంపుడు శునకం కాపాడింది. ఈ ఘటనను వివరిస్తూ ఇటీవల ఆయన సతీమణీ సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. జింబాబ్వే (Zimbabwe)కి చెందిన 51 ఏళ్ల మాజీ ఆల్‌ రౌండర్‌ గై విట్టాల్‌ (Guy Whittall) ఇటీవల హ్యూమని ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. తనతో పాటు పెంపుడు శునకం చికారాను కూడా తీసుకెళ్లాడు. పర్వతారోహణ సమయంలో హఠాత్తుగా ఓ చిరుత విట్టాల్‌పై దాడి చేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన చికారా యజమానిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో అది కూడా తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్నా పోరాడి విట్టాల్‌ను రక్షించింది. చిరుతను తరిమికొట్టింది. ఈ ఘటనలో విట్టాల్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

* ప్రజాస్వామ్య పండగగా భావించే సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) సమరంలో వివిధ రూపాల్లో రూ.వేల కోట్లు ఖర్చవుతుంది. నిపుణుల అంచనా ప్రకారం.. 2024 లోక్‌సభ ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే అత్యధికంగా రూ.1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు అంచనా. అమెరికాకు చెందిన ఓపెన్‌సీక్రెట్స్‌ సంస్థ ప్రకారం 2020 అమెరికా ఎన్నికల వ్యయం (రూ.1.2 లక్షల కోట్లు)ను ఇది దాటిపోనుంది. దేశంలో మొత్తం ఓటర్లు 96.6 కోట్ల మంది కాగా.. ఒక్కో ఓటరుకు రూ.1,400 ఖర్చు చేస్తున్నారన్నమాట. అంతేకాకుండా 2019లో అయిన రూ.60 వేల కోట్లతో పోలిస్తే ఈసారి రెట్టింపు కంటే ఎక్కువ కానుండటం గమనార్హం. ఎన్నికల వ్యయానికి సంబంధించిన అంశాలను సెంటర్‌ ఫర్ మీడియా స్టడీస్‌ (CMS) అనే స్వచ్ఛందసంస్థ.. గత 35 ఏళ్లుగా నిశితంగా పరిశీలిస్తోంది. ఈక్రమంలో 2024 ఎన్నికల్లో భారీ ఖర్చు అవనున్నట్లు సంస్థ ఛైర్మన్‌ భాస్కర్‌ రావు అంచనా వేశారు. ఈ సమగ్ర వ్యయంలో ఎన్నికల సంఘంతోపాటు ప్రభుత్వాలు, అభ్యర్థులు, పలు సంస్థలు, రాజకీయ పార్టీలు చేసే అన్ని రకాల ఎన్నికల సంబంధిత ఖర్చులు ఉంటాయన్నారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎంఎస్‌ ఛైర్మన్‌ భాస్కర్‌రావు ఈ వివరాలు వెల్లడించారు.

* ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధానికి (Israel- Hamas War) దాదాపు ఏడు నెలలవుతోంది. ఇప్పటికీ అనేకమంది బందీలు ఉగ్ర చెరలోనే ఉన్నారు. మరోవైపు టెల్‌అవీవ్‌ భీకర దాడులు.. గాజాను మరుభూమిగా మారుస్తున్నాయి. ఇప్పటికే 34 వేల మందికి పైగా మృతి చెందారు. ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ చర్చలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా మారాయి. ఈ పరిణామాల నడుమ హమాస్‌ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్‌ అల్‌-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. 1967కు ముందునాటి సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే.. ఇజ్రాయెల్‌తో ఐదేళ్లు, అంతకంటే ఎక్కువకాలం సంధికి సిద్ధంగా ఉన్నామన్నారు. అదేవిధంగా ఆయుధాలు వీడి.. గాజా, వెస్ట్ బ్యాంక్‌లో ఏకీకృత ప్రభుత్వ ఏర్పాటుకు ‘పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌’లో చేరాలనుకుంటున్నట్లు ఓ వార్తాసంస్థతో తెలిపారు.

* పదునైన మాటలతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాజీ క్రికెటర్లలో వీరేంద్ర సెహ్వాగ్‌ (Virender Sehwag) ఒకరు. క్రికెట్ వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా తనదైన శైలిలో స్పందించడం సెహ్వాగ్‌కు అలవాటు. తాజాగా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో సాగిన చర్చా కార్యక్రమంలో సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రముఖ ఇంగ్లిష్‌ బ్రాడ్‌కాస్టర్ స్కై స్పోర్ట్స్‌ నుంచి వచ్చిన ఆఫర్‌పైనా, బిగ్‌బాష్‌ లీగ్‌లో భారత క్రికెటర్లు ఆడకపోవడానికి గల కారణాలపైనా మాట్లాడాడు. ‘‘నాకు ఒకసారి స్కై స్పోర్ట్స్‌ నుంచి కాల్ వచ్చింది. వారి ప్యానెల్‌లో ఉండాలని కోరింది. అయితే, మీరు నన్ను భరించలేరు అని చెప్పా. ‘అలా కాదు. మీ ధర ఎంతో చెప్పండి’ అని సంస్థ అడిగింది. అయితే, నాకు రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని అడిగా. దానికి ‘అవును మీరు చెప్పింది నిజమే. మేం తట్టుకోలేం’ అని సమాధానం వచ్చింది’’ అని సెహ్వాగ్ తెలిపాడు.

* టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీ ఆదేశించింది. అనకాపల్లి జిల్లా కలెక్టర్‌కు సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌పై అనుచిత, నిరాధార వ్యాఖ్యలు చేసిన అయ్యన్న పాత్రుడిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. మల్లాది విష్ణు ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు.

* పొట్టి క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. మహిళల టీ20ల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇండోనేషియా బౌలర్‌ రొహ్మాలియా రొహ్మాలియా పరుగులేమీ ఇవ్వకుండా ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టింది. అంతర్జాతీయ టీ20ల్లో (పురుషులు, మహిళలు) ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఐసీసీ గుర్తింపు పొందిన ఏ జట్టు తరఫున ఇలాంటి గణాంకాలు నమోదు కాలేదు. పురుషుల క్రికెట్‌లో (టీ20ల్లో) అత్యుత్తమ గణాంకాలు స్యాజ్రుల్‌ ఇద్రుస్‌ (4-1-8-7) పేరిట ఉండగా.. మహిళల క్రికెట్‌లో రొహ్మాలియాకు ముందు ఈ రికార్డు నెదర్లాండ్స్‌ క్రికెటర్‌ ఫ్రెడ్రిక్‌ ఓవర్డిక్‌ (4-2-3-7) పేరిట ఉండింది. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటివరకు ఏ బౌలర్‌ పరుగులేమీ ఇవ్వకుండా 7 వికెట్లు తీసిన దాఖలాలు లేవు. రొహ్మాలియా తన కెరీర్‌లో రెండో టీ20 మ్యాచ్‌లోనే ఎవరికీ సాధ్యంకాని గణాంకాలు నమోదు చేయడం మరో విశేషం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z