వందే భారత్ మిషన్లో భాగంగా అమెరికాలో చిక్కుకున్న 224 మంది భారతీయులు మరికొద్ది గంటల్లో భారత్కు చేరుకోనున్నారు.
వాషింగ్టన్ ఎయిర్పోర్ట్ నుంచి కొద్ది గంటల క్రితం ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి బయలుదేరింది.
ఈ విమానంలో పసిపిల్లలు కూడా ప్రయాణం చేస్తున్నట్టు ఇండియన్ ఎంబసి పేర్కొంది.
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్రం వందే భారత్ మిషన్ పేరిట స్వదేశానికి తీసుకొస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ మిషన్లో రెండు విడతలు పూర్తికాగా.. ప్రస్తుతం మూడో విడత నడుస్తోంది.
జూన్ 10న మొదలైన మూడో విడత జూన్ 30 వరకు కొనసాగనుంది.
ఈ విడతలో మొత్తంగా 550 విమానాల ద్వారా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు తమ మాతృభూమికి చేరుకోనున్నారు.
కాగా.. ఇప్పటివరకు విదేశాల్లో చిక్కుకున్న దాదాపు లక్షా 25 వేల మంది భారతీయులను ఈ మిషన్ కింద తీసుకొచ్చినట్టు మంగళవారం విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు.
మంగళవారం ఒక్కరోజే 6,037 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్టు ఆయన వెల్లడించారు.