WorldWonders

న్యూజీల్యాండ్ ప్రధానికి $5 లంచం ఇచ్చిన 11ఏళ్ల బాలిక

11 Year Old Girl Bribes 5 Dollars To New Zealand Prime Minister

న్యూజిలాండ్‌లో ప్రధానికే లంచం ఇచ్చారు.. కానీ, ప్రధాని దానిని తిరిగిచ్చేశారు.  ఇంతకీ ఆ లంచం ఎంతో తెలుసా.. 5 న్యూజిలాండ్‌ డాలర్లు..! ఈ మొత్తాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా.. 11ఏళ్ల బాలిక. ఆ బాలిక ప్రధానికి లంచం ఎందుకిచ్చిందో మీరే చదవండి. న్యూజిలాండ్‌లో విక్టోరియా అనే  11 ఏళ్ల బాలిక డ్రాగన్లపై మనసు పడింది. వాటికి ఎలాగైన శిక్షకురాలిగా మారాలని భావించింది. కానీ, అవి ఎక్కడుంటాయో తెలియదు. అందుకే వాటి గురించి తెలుసుకొనేందుకు పరిశోధనలు చేయాలని భావించింది. దీంతో ప్రభుత్వాన్ని డ్రాగన్లపై పరిశోధనలు చేయాల్సిందిగా ఈ చిన్నారి కోరింది. ఈ మేరకు న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెన్‌కు ఓ లేఖ కూడా రాసింది. ప్రధానికి లంచంగా ఓ ఐదుడాలర్లను కూడా కవరులో పెట్టి పంపించింది. ఈ చిట్టి అభిమాని నుంచి వచ్చిన లేఖను న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఓపిగ్గా చదవి నవ్వుకొన్నారు. తర్వాత ఆ చిన్నారికి సమాధానం కూడా రాశారు. ‘‘ఇప్పటికైతే డ్రాగన్లు, ఫిజిక్స్‌పై ఎటువంటి పరిశోధనలు చేయడంలేదు’’ అని పేర్కొన్నారు. దీనిపై స్వదస్తూరితో సరదాగా కొన్ని వాక్యాలు కూడా రాశారు.‘‘పి.ఎస్‌. నేను డ్రాగాన్లు ఎక్కడైనా బయటకు వస్తాయేమో ఓ కన్నేసి పెడతాను. ఇంతకీ డ్రాగన్లు సూట్‌ వేసుకొంటాయా..?’’ అని ప్రశ్నించారు. ‘‘ఫిజిక్స్‌, డ్రాగన్ల విషయంలో మీ సూచనలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కానీ, దురదృష్టవశాత్తు మేము ఇప్పటి వరకు ఆ విభాగాల్లో ఎలాంటి పరిశోధనలు చేయడంలేదు. నేను నువ్వు ఇచ్చిన లంచం సొమ్మును తిరిగి ఇచ్చేస్తున్నాను. టెలికెన్సిస్‌, టెలిపతి, డ్రాగన్ల విషయంలో నీ అన్వేషణలో అంతా విజయం చేకూరాలని ఆశిస్తూన్నాను’’ అని పేర్కొన్నారు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ క్యూట్‌ ఘటన ఇటీవల ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. ప్రధాని రాసిన ఉత్తరాన్ని ఆ చిన్నారి సోదరుడు రెడిట్‌లో పోస్టు చేశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే ఒక సీ-ఫీ సిరీస్‌లోని స్ట్రాంగర్‌ థింగ్స్‌ను చూశాక తన చెల్లికి వీటిపై  ఆసక్తి పెరిగిందని పేర్కొన్నాడు. ఆ చిన్నారికి ప్రధాని లేఖ రాసిన విషయాన్ని న్యూజిలాండ్‌ పీఎంవో కూడా ధ్రువీకరించింది. ఏప్రిల్‌ 30 జెసిండా ఈ లేఖను రాసినట్లు పేర్కొంది