DailyDose

అమెరికాకు హువావే షాక్-వాణిజ్య–06/14

Huawei shocks the US - June 14 2019 - Daily Business News

* అమెరికా బెదిరింపులకు, ఆంక్షలకు ధీటుగా సమాధానం చెప్పిన చైనా మొబైల్‌ తయారీ దిగ్గజ సంస్థ హువావే కీలక విషయాన్ని ప్రకటించింది. తన సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌ ను తొందరలోనే లాంచ్‌ చేయనున్నామని గురువారం ప్రకటించింది. మమ్మల్ని తక్కువగా అంచని వేయొద్దని ప్రకటించిన హువావే ఆండ్రాయిడ్‌కు ప్రత్యామ్నాయంగా ‘హాంగ్‌మెంగ్’ పేరుతో కొత్త ఓఎస్‌ను లాంచ్‌ చేయనుంది. తద్వారా అమెరికా టెక్‌ దిగ్గజాలు గూగుల్‌, ఆపిల్‌కు పెద్ద షాక్‌ ఇస్తోంది.
* ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ జేవీసీ ఇండియన్ మార్కెట్లో మరో ఆరు కొత్త స్మార్ట్ ఎల్ఈడీ టీవీలను లాంచ్‌ చేసింది. వీటి ధరలు రూ.7499 నుంచి ప్రారంభం కానున్నాయి. 24 నుంచి 39 అంగుళాల మధ్య టీవీల స్క్రీన్ సైజ్ ఉండేలా ఈ స్మార్ట్‌ఎల్‌ఈడీ టీవీలను ఆవిష్కరించింది. ఈకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఇది అందుబాటులో ఉంటాయి. జేవీసీ 32 అంగుళాల ఎల్ఈడీ స్మార్ట్ టీవీ టీవీ ధర రూ.11,999గా ఉంది. ఒక సంవత్సరం వారంటీ కూడా ఉంది.
* వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.32,750, విశాఖపట్నంలో రూ.33,750, ప్రొద్దుటూరులో రూ.33,530, చెన్నైలో రూ.32,780గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,190, విశాఖపట్నంలో రూ.31,050, ప్రొద్దుటూరులో రూ.31,070, చెన్నైలో రూ.31,220గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.36,800, విశాఖపట్నంలో రూ.37,900, ప్రొద్దుటూరులో రూ.37,800, చెన్నైలో రూ.39,900 వద్ద ముగిసింది.
*భారత్‌ డైనమిక్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) రూ.1,187.82 కోట్ల భారీ ఆర్డరును చేజిక్కించుకుంది. భారత నౌకాదళానికి అధిక బరువు ఉన్న టోర్పెడోలను సరఫరా చేసేందుకు కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇది లభించింది.
*భారత్‌లో ఈ ఏడాది వ్యాపార ప్రకటనల వ్యయాలు 11.4 శాతం పెరిగి రూ.69,700 కోట్లకు చేరొచ్చని అంచనా. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌ కప్‌తో పాటు ఇటీవలి సాధారణ ఎన్నికలు ఇందుకు దోహదం చేయొచ్చని డెన్సు ఏజిస్‌ నెట్‌వర్క్‌(డీఏఎన్‌) తన నివేదికలో వెల్లడించింది.
*గిరిజనుల ఆందోళనలతో గత కొద్ది రోజులుగా గనుల తవ్వకం పనులు నిలిచిపోయిన చత్తీస్‌గఢ్‌ లోని బైలదిల్లాలో మళ్లీ తవ్వకం పనులు ప్రారంభించినట్లు ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ వెల్లడించింది.
*ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌కు ఉపశమనం లభించింది. సంస్థ యాజమాన్యం ప్రజా నిధులను దుర్వినియోగం చేసిందంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌ను పిటిషనర్‌ ఉపసంహరించుకున్నారని ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది.
*బహుళ జాతి ఔషధ సంస్థ అబాట్‌తో కలిసి హృద్రోగ సమాచార పట్టిక (కార్డియాక్‌ రిజిస్ట్రీ)ను నిర్వహించేందుకు అపోలో హాస్పిటల్స్‌ సన్నాహాలు చేస్తోంది. ఇటువంటి ప్రయత్నం జరగటం దేశంలో ఇదే మొదటి సారి.
*స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ (సీజీఎం)గా ఓం ప్రకాశ్‌ మిశ్రా గురువారం బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఇక్కడ సీజీఎంగా బాధ్యతలు నిర్వహించిన జె.స్వామినాథన్‌ పదోన్నతిపై బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఓం ప్రకాశ్‌ మిశ్రా నియమితులైనట్లు ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
*క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలకు వెల్లడి నిబంధనల వ్యవస్థను కఠినతరం చేస్తూ సెబీ గురువారం నిర్ణయం తీసుకుంది. వివిధ రేటింగ్‌ ఉన్న బాండ్లు, ఇష్యూలు ఎగవేతకు గురయ్యే అవకాశాలను సైతం ఇవి ప్రకటించాల్సి ఉంటుంది.
*ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వచ్చే వడ్డీని ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్మలా సీతారామన్‌ను అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) కోరింది.