Business

సెర్బియాలో అరెస్ట్ అయిన నిమ్మగడ్డ

సెర్బియాలో అరెస్ట్ అయిన నిమ్మగడ్డ - Nimmagadda Prasad Arrested In Serbia

ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వాన్‌పిక్‌ వ్యవహారంలో రస్‌అల్‌ఖైమా ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వాన్‌పిక్‌ ప్రాజెక్టు కోసం రస్‌అల్‌ ఖైమా సుమారు రూ.750కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ సంస్థతో పాటు నిమ్మగడ్డ ప్రసాద్‌ నేతృత్వంలోని కొన్ని సంస్థలు ఆ రెండు జిల్లాల్లో దాదాపు 11వేల ఎకరాల భూమిని కొనుగోలు చేశాయి. పోర్టు నిర్మాణంతో పాటు ఆయా భూముల్లో పరిశ్రమలు నెలకొల్పాలని అప్పట్లో ప్రణాళికలు రూపొందించారు. ఈ క్రమంలో కేసులు, అరెస్టులతో ఆ ప్రాజెక్టులు వివాదాల్లో చిక్కుకున్నాయి. ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో భాగంగా వాన్‌పిక్‌ భూముల వ్యవహారంపైనా గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో నిమ్మగడ్డ ప్రసాద్‌ అరెస్టయ్యారు. దీంతో ఈడీ ఆ భూములను స్వాధీనం చేసుకోవడంతో రస్‌అల్‌ఖైమా పెట్టిన పెట్టుబడులు స్తంభించిపోయాయి. ఈ ప్రాజెక్టులపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సహకరించడం వల్లే జగన్‌ సంస్థల్లో నిమ్మగడ్డ కంపెనీలు పెట్టుబడులు పెట్టినట్లు దర్యాప్తు సంస్థలు అభియోగాలు నమోదు చేశాయి. దీనివల్ల మొత్తం వ్యవహారం వివాదంలో చిక్కుకుంది. వ్యాపార విస్తరణలో భాగంగా నిమ్మగడ్డ ప్రసాద్‌ ఇటీవల సెర్బియా వెళ్లినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అప్పటికే రస్‌అల్‌ఖైమా సంస్థ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండటంతో నిమ్మగడ్డను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.