Editorials

అదే సోది

అదే సోది

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. కశ్మీర్‌ అంశాన్ని మరోసారి లేవనెత్తారు. తాను కశ్మీర్‌ గొంతుకై ఐక్యరాజ్యసమితి సహా.. ప్రతి అంతర్జాతీయ వేదికపైనా తన గళాన్ని వినిపిస్తానని ప్రతిజ్ఞ చేశారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 రద్దు, రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై అంతర్జాతీయ సమాజం పట్టించుకోకపోవడంపైనా అసహనం వ్యక్తంచేశారు. ‘రెండు దేశాల మధ్య యుద్ధం సంభవిస్తే అందుకు వారిదే బాధ్యత’ అని వ్యాఖ్యానించారు. పాక్‌ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌ అసెంబ్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇమ్రాన్‌ ప్రసంగించారు. కశ్మీర్‌ విషయంలో ప్రతి అంతర్జాతీయ వేదికపైనా తాను ఒక రాయబారిగా వ్యవహరించి గళమెత్తుతానని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని తొలగించడం భారత్‌ చేసిన వ్యూహాత్మక తప్పిదమని ఆరోపించారు. ‘‘ఈ విషయంలో మోదీ వ్యూహాత్మకంగా తప్పిదం చేశారు. మోదీ చివరి కార్డ్‌ను వినియోగించారు. దీనికి మోదీ, భాజపా మూల్యం చెల్లించక తప్పదు. కశ్మీర్‌ అంశాన్ని వారు అంతర్జాతీయం చేయడమే ఇందుకు కారణం’’ అని ఇమ్రాన్‌ అన్నారు. ఒకవేళ తమ దేశం జోలికి భారత్‌ వస్తే అందుకు తగిన విధంగా బుద్ధి చెబుతామని ఇమ్రాన్‌ అన్నారు. అందుకు తమ సైనిక బలగం మొత్తం వినియోగిస్తామని చెప్పారు. తమపై దాడికి ఇప్పటికే భారత్‌ ప్రణాళిక రచించిందని అన్నారు. ‘‘ఒకవేళ ఎలాంటి చర్యలకు పాల్పడినా ప్రతి ఇటుకకూ ఒక్కో రాయితో సమాధానం చెబుతాం’’ అని ఇమ్రాన్‌ వ్యాఖ్యానించారు. భారత్‌లో ముస్లింలే లక్ష్యంగా మూక దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.