Business

హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు శుభవార్త

Hitech City-Rayadurgam Metro Inaugurated By KTR

హైదరాబాద్‌ మెట్రోరైలులో మరో మార్గం అందుబాటులోకి వచ్చింది. హైటెక్‌సిటీ-రాయదుర్గం మార్గాన్ని మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌ జెండా ఊపి ప్రారంభించారు. మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌, మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం వరకు మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌ ప్రయాణించారు. 1.5కి.మీ పొడవున్న ఈ మార్గంలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాధారణ ప్రయాణికులను అనుమతించనున్నారు. 2017, నవంబర్‌ 28న నాగోల్‌-అమీర్‌పేట్‌- మియాపూర్‌ మార్గంలో 30కి.మీ మెట్రోను ప్రధాని మోదీ ప్రారంభించారు. సెప్టెంబర్‌ 24న అమీర్‌పేట్‌-ఎల్బీనగర్‌ మధ్య 16 కి.మీ మార్గాన్ని అప్పటి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభించారు. ఈ ఏడాది మార్చి 20న అమీర్‌పేట్-హైటెక్‌సిటీ మధ్య 10 కి.మీ మార్గాన్ని నరసింహన్‌ ప్రారంభించారు. నగరం మొత్తంలో 56 కి.మీ మార్గంలో మెట్రో సేవలు అందిస్తోంది. ప్రతిరోజూ సరాసరి 4 లక్షలమంది ప్రాయాణికులు గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. రోజూ 780 ట్రిప్పుల్లో 18,000కి.మీ మెట్రోరైళ్లు ప్రయాణిస్తున్నాయి.