ScienceAndTech

భారత యువశక్తికి సువర్ణవకాశం

Indian Army To Allow Regular Citizens To Serve The Nation

స్వతంత్ర భారతావని చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచే అవకాశాలు కనిపిస్తున్నాయి! యువత సహా ఔత్సాహిక పౌరులెవరినైనాసరే మూడేళ్ల స్వల్ప కాలానికి సర్వీసులో చేర్చుకునే విప్లవాత్మక ప్రతిపాదనను సైన్యం పరిశీలిస్తోంది. పోరాట విధులు సహా అన్ని విభాగాల్లో వారికి బాధ్యతలు అప్పగించడంపై సమాలోచనలు జరుపుతోంది. పారామిలటరీ బలగాలు, కేంద్ర సాయుధ దళాల సిబ్బందిని ఏడేళ్ల కాలానికి సైన్యంలో చేర్చుకునే అంశమూ సైన్యం పరిశీలనలో ఉంది. నిర్ణీత వ్యవధి పూర్తయిన తర్వాత మాతృ సంస్థకు వారిని బదిలీ చేసే అవకాశముందని ఉన్నత స్థాయి సైనికవర్గాల సమాచారం. పౌరులకు సైన్యంలో అవకాశం కల్పించాలన్న ప్రతిపాదన ఆమోదం పొందితే.. ప్రయోగాత్మకంగా తొలుత 100 మంది అధికారులు, వెయ్యిమంది జవాన్ల నియామకాలు చేపట్టాలని భావిస్తున్నట్లు సైన్యం అధికార ప్రతినిధి కర్నల్‌ అమన్‌ ఆనంద్‌ తెలిపారు. స్వచ్ఛందంగానే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. ఎంపిక అర్హతలు, ప్రమాణాల్లో మాత్రం రాజీపడబోమని స్పష్టం చేశారు. వయసు, ఫిట్‌నెస్‌ స్థాయికి ప్రాధాన్యమిస్తామన్నారు. ‘విధుల పర్యటన(టీవోడీ)’ లేదా ‘మూడేళ్ల స్వల్ప సర్వీసు’ పథకం కింద ఈ నియామకాలు చేపట్టే అవకాశముంది. సైన్యంలో పనిచేసే అవకాశంతోపాటు అనుభవాన్ని సాధారణ పౌరులకు కల్పించడమే లక్ష్యంగా తాజా ప్రతిపాదన తెరపైకి వచ్చిందని సైనికాధికారి ఒకరు తెలిపారు. ‘‘దేశ పౌరుల్లో జాతీయవాదం, దేశభక్తి గణనీయంగా పెరిగాయి. సైన్యంలో దీర్ఘకాలం సేవలందించాలని భావించనప్పటికీ, ఆ జీవితాన్ని కొన్నాళ్లు ఆస్వాదించాలని కోరుకునే యువ కోసమే ఈ ప్రతిపాదన’’ అని పేర్కొన్నారు. అగ్రశ్రేణి సైనిక కమాండర్ల సదస్సులో త్వరలో దీనిపై చర్చ జరగనుంది. టీవోడీలో భాగంగా ఏడాదిపాటు శిక్షణ, అనంతరం మూడేళ్లపాటు సర్వీసు ఉంటుంది. ఇప్పటికే ఇతర విధుల్లో ఉన్న యువతను కూడా సైన్యంలో చేరేందుకు అనుమతిస్తారు.

*** ఆర్థికంగా ప్రయోజనకరం
తాజా ప్రతిపాదన సైన్యానికి ఆర్థికంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రాట్యుటీ, సెలవుల నగదీకరణ, పింఛను, ఇతర ప్యాకేజీల విషయంలో భారీగా నిధులు మిగులుతాయి. వాటిని సాయుధ బలగాల ఆధునికీకరణకు ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం సైన్యం షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ కింద యువతను తొలుత పదేళ్ల కాలానికి విధుల్లోకి తీసుకుంటోంది. తర్వాత వారి సర్వీసును మరో నాలుగేళ్ల వరకు పొడిగించేందుకు వీలుంటుంది. పదేళ్లు సైన్యంలో విధులు నిర్వర్తించే ఒక్కో అధికారిపై శిక్షణ, వేతనం, ఇతర ఖర్చుల కింద సగటున రూ.5.12 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. 14 ఏళ్ల కాలానికైతే ఆ మొత్తం రూ.6.83 కోట్లుగా ఉంటోంది. మూడేళ్లలోనే విధులు పూర్తయితే ఆ ఖర్చు రూ.80-85 లక్షలకు పరిమితమవుతుంది. అదే తరహాలో 17 ఏళ్లపాటు సేవలందించే జవానుపై ఖర్చు చేసే మొత్తంతో పోలిస్తే టీవోడీ కింద మూడేళ్లపాటు ఒక్కో జవానుపై చేసే వ్యయం చాలా చాలా తక్కువ. కేవలం వెయ్యిమంది జవాన్లపైనే టీవోడీ ద్వారా దాదాపు రూ.11 వేల కోట్లను ఆదా చేసుకోవచ్చని అంచనా. నెలవారీ వేతనంతోపాటు, టీవోడీ సర్వీసు ముగిశాక అధికారులకు రూ.6 లక్షలు, సిపాయిలకు రూ.3 లక్షలు ఇచ్చే అవకాశముంది. ప్రస్తుతం దేశ రక్షణ బడ్జెట్‌లో 60% వరకు నిధులను వేతనాలు, పింఛన్లకే కేటాయించాల్సి వస్తున్న సంగతి గమనార్హం.

*** కార్పొరేట్‌ కొలువుల్లో ప్రాధాన్యత!
సైన్యంలో శిక్షణ, విధుల అనంతరం వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం, జవాబుదారీతనం, ఒత్తిడిని అధిగమించడం, బృందంగా పనిచేయడం వంటి నైపుణ్యాలు గణనీయంగా పెరుగుతాయని సైనికాధికారి ఒకరు తెలిపారు. 22-23 ఏళ్ల వయసులో నేరుగా కళాశాలల నుంచి యువతను ఉద్యోగాల్లోకి తీసుకోవడం కంటే.. సైన్యంలో విధులు నిర్వర్తించిన తర్వాత 26-27 ఏళ్ల వయసులో వారికి కొలువులిచ్చేందుకు కార్పొరేట్‌ సంస్థలు ప్రాధాన్యమిస్తాయని అంతర్గత సర్వేలో తేలిందని పేర్కొన్నారు. మరోవైపు, త్రివిధ దళాల్లో పదవీ విరమణ వయసును పెంచే యోచన ఉన్నట్లు త్రిదళాధిపతి(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు.