WorldWonders

చిన్నబాలుడు ఢిల్లీ నుండి బెంగుళూరు వచ్చేశాడు

Small Boy Travels Alone From Delhi To Bangalore Due To Corona

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా ప్రజా రవాణా లేక ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్‌ 4.0లో భాగంగా నిబంధనల మేరకు ప్రజా రవాణకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే రైళ్లు, బస్సులు నడుస్తుండగా, సోమవారం నుంచి దేశీయంగా విమాన ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తన తల్లిని కలుసుకునేందుకు ఐదేళ్ల బాలుడు ఒంటరిగా దిల్లీ నుంచి బెంగళూరు విమాన ప్రయాణం చేశాడు. సోమవారం దిల్లీ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల్లో ఐదేళ్ల బాలుడు విహాన్‌ శర్మ కూడా ఉన్నాడు. మూడు నెలల క్రితం దిల్లీ వెళ్లిన విహాన్‌ లాక్‌డౌన్‌ కారణంగా అక్కడ చిక్కుకుపోయాడు. దీంతో సోమవారం విమానాలు పునః ప్రారంభంకావడంతో తన తల్లిని కలుసుకునేందుకు బెంగళూరు చేరుకున్నాడు. ప్రత్యేక కేటగిరీ ప్రయాణికుడిగా విహాన్‌కు అధికారులు అనుమతి ఇచ్చారు. విహాన్‌ బెంగళూరు చేరుకున్న సందర్భంగా అతడి తల్లి ఆనందంతో అక్కున చేర్చుకుంది. మరోవైపు కరోనా అత్యధిక ప్రభావిత ప్రాంతాలైన మహారాష్ట్ర, గుజరాత్‌, దిల్లీ, తమిళనాడు, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి కర్ణాటక వచ్చే ప్రయాణికులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఆ రాష్ట్రాల నుంచి వచ్చిన వారంతా ఏడురోజులు తప్పనిసరిగా వ్యవస్థాగత క్వారంటైన్‌లో ఉండాలి. అయితే, గర్భిణులు, పదేళ్లలోపు చిన్నారులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం హోం క్వారంటైన్‌కు తప్పక వెళ్లాలి.