Politics

ప్లీజ్…ఒక్కసారి ఎన్నికలకు వెళ్దాం…తర్వాత మాట్లాడం!

ప్లీజ్…ఒక్కసారి ఎన్నికలకు వెళ్దాం…తర్వాత మాట్లాడం!

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మూడు రాజధానులకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించారు. గతంలో అమరావతే రాజధాని అని మాట్లాడిన వైసీపీ నేతలకు ఇప్పుడేమైందని ప్రశ్నించారు. రాజధాని అనేది తన ఒక్కడి సమస్య కాదని, 5 కోట్ల ప్రజలకు సంబంధించిన అంశం అని స్పష్టం చేశారు.

“రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎంతో బాధపడ్డాం. కాంగ్రెస్ పార్టీకి నాడు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు వైసీపీ అదే రీతిలో ఇష్టానుసారం ప్రవర్తిస్తోంది. ఎన్నికల ముందు మీరేం చెప్పారు, ఎన్నికల తర్వాత మీరేం చేస్తున్నారు. ఎన్నికల ముందు రాజధాని గురించి ఏమీ చెప్పకుండా ప్రజల్ని మభ్యపెట్టి, ఎన్నికల తర్వాత మూడు రాజధానులు చేస్తామంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేసే అధికారం మీకు లేదు. సీఎం జగన్ కు 48 గంటలు సమయం ఇస్తున్నాం… మీ నిర్ణయానికి ప్రజల్లో మద్దతు ఉందని భావిస్తే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళదాం. మీరు గనుక గెలిస్తే ఇక మేం మాట్లాడం. అమరావతి అంశంలో మీరు ఏంచేసినా మేం నోరెత్తం. కానీ ప్రజలకు చెప్పకుండా ఇలా రాజధానిపై నిర్ణయం తీసుకుంటే మాత్రం అది నమ్మించి మోసం చేసినట్టవుతుంది.

మాట మీద నిలబడతాం అని చెప్పుకునే మీరు వీటికి సమాధానం చెప్పండి. 2014 సెప్టెంబరు 4న ప్రతిపక్ష నాయకుడి హోదాలో మీరేం చెప్పారు? “అధ్యక్షా, విజయవాడలో రాజధాని ఏర్పాటు చేయడాన్ని మేం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కారణం ఏంటంటే, మన రాష్ట్రం 13 జిల్లాల చిన్నరాష్ట్రంగా మారింది. ఇంత చిన్న రాష్ట్రంలో ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి మధ్య చిచ్చుపెట్టడం ఇష్టంలేక, రాజధాని నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రాజధాని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోండి కానీ కనీసం 30 ఎకరాలైనా ఉండేట్టు చూడండి” అని చెప్పింది ఎవరు? మీరు కాదా? ఇప్పుడేమైనా మనది పెద్ద రాష్ట్రంగా మారిపోయిందా? ఇవాళ ఏమొచ్చిందని రాజధానిపై నిర్ణయం తీసుకున్నారు? ఇది ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం కాదా?” అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.