WorldWonders

యువతనే ఎక్కువగా కాటేస్తున్న కరోనా

యువతనే ఎక్కువగా కాటేస్తున్న కరోనా

యువతపై కరోనా పంజా

40 ఏళ్లలోపు ఉన్న బాధితులు 55.33 శాతం

నిర్లక్ష్యమే వారి ప్రధాన శత్రువు

వైరస్‌ ఏమీ చేయదన్న ధీమా వద్దంటున్న వైద్యులు

కుటుంబీకుల గురించి ఆలోచించాలని సూచన

యువతపై కరోనా పంజా విసురుతోంది. వైరస్‌ సోకినా ఏమీ కాదన్న నిర్లక్ష్య ధోరణి వారిని బాధితులను చేస్తోంది. ఫలితంగా వారి కుటుంబీకులు, సన్నిహితులు కూడా మహమ్మారి బారిన పడుతున్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత యువత విచ్చలవిడిగా తిరగడం, మాస్కులు లేకుండా వాహనాలపై ముగ్గురేసి ప్రయాణించడం వ్యాధి విస్తృతికి కారణమవుతోంది. ఇంటినుంచి బయటకు వెళ్లడంపై మధ్యవయస్కులు, వృద్ధులు విముఖంగానే ఉంటున్నారు. కొందరు యువకులు మాత్రం పట్టపగ్గాల్లేకుండా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత నెలలో నమోదైన 2,94,930 మంది బాధితుల్లో 40 ఏళ్లలోపు ఉన్నవారు 55.33% మంది ఉన్నారు. ముఖ్యంగా 21 నుంచి 30 ఏళ్ల మధ్య వారు ఎక్కువగా బాధితులవుతున్నారు. యువకులకు వైరస్‌ సోకితే వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు వివరాలను సేకరించడం కూడా కష్టమవుతోంది. వారు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తేనే వ్యాధిని కొంతవరకైనా నియంత్రించవచ్చని వైద్య నిపుణులు వివరిస్తున్నారు.