ScienceAndTech

సరికొత్త గ్రహశకలంపై నాసా వ్యోమనౌక

సరికొత్త గ్రహశకలంపై నాసా వ్యోమనౌక

అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన ‘ఒసైరిస్‌-రెక్స్‌’ వ్యోమనౌక ‘బెన్ను’ అనే గ్రహశకలంపై విజయవంతంగా దిగింది. అన్ని అనుకున్నట్లుగానే జరిగినట్లు ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త లారేటా తెలిపారు. గ్రహశకలంపై దిగగానే ఒసైరిస్‌ నాసా కేంద్రానికి సంకేతాలు పంపినట్లు వెల్లడించారు. అయితే, ఆ గ్రహశకలపు నమూనాలను సేకరించే అసలు లక్ష్యాన్ని అది ఎంత వరకు పూర్తి చేసిందన్నది తెలియరాలేదు. ఇది తెలుసుకోవడానికి కనీసం వారం రోజుల సమయం పడుతుందన్నారు. ఒకవేళ నమూనాల్ని సేకరించలేదని తేలితే మరోసారి ల్యాండ్‌ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.. ఈ మేరకు ఇప్పటికే అన్ని ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. శకలంపై చిన్న రేణువులతో పాటు భారీ శిలలూ ఉన్నాయి. పైగా అక్కడ గురుత్వాకర్షణ చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ల్యాండింగ్‌ ప్రక్రియపై ఇప్పటి వరకు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏవైనా అనూహ్య పరిణామాలు ఎదురైతే తిరిగి గాల్లోకి దూసుకెళ్లేలా ఏర్పాట్లు చేసినప్పటికీ.. ఒసైరిస్‌కు ఆ అవసరం రాలేదు. అన్ని అడ్డంకుల్ని దాటుకొని‌ బెన్నుని తాకింది.