Politics

కొండాకు కాంగ్రెస్ అండ!

రాష్ట్ర పార్టీలో మహిళా నాయకత్వానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. త్వరలో జరగనున్న టీపీసీసీ సంస్థాగత మార్పుల్లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మహిళా నాయకురాలికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. దీని కోసం వెనుకబడిన వర్గాలకు చెందిన మాజీ మంత్రి కొండా సురేఖ పేరును అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన బీసీ సామాజిక వర్గాల్లో మంచి సంబంధాలు, మంత్రిగా పనిచేసిన అనుభవం, వాక్పటిమ లాంటివి సురేఖకు అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది. పార్టీలో కీలక పదవులు చేపట్టి వెళ్లిపోయిన డీకే అరుణ, విజయశాంతిలకు దీటుగా మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత ఎమ్మెల్యే, ఆదివాసీ నాయకురాలు సీతక్కకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించడంతో పాటు కీలక కమిటీల్లో ఆమె పేరు చేరుస్తారనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన సీతక్క రెండోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే మహిళా కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. మంచి పోరాట పటిమ ఉన్న నేతగా గుర్తింపు పొందిన సీతక్క.. రాష్ట్రంలోని మహిళల సమస్యలపై మరింత క్రియాశీలకంగా పని చేస్తారనే ఆలోచనతో కాంగ్రెస్‌ అధిష్టానం ఆమెను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.

వీహెచ్‌ వ్యాఖ్యలపై మల్లు రవి శనివారం స్పందించారు. మాణిక్యం ఠాగూర్‌ సహా ఇతర కాంగ్రెస్‌ నేతలపై హనుమంతారావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వైద్య విద్యలో ఉన్నత చదువులు చదివి సమాజంలో మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని, తనకు ఎవరికీ చెంచాగిరీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తమ ప్రాంతవాసుడైన రేవంత్‌రెడ్డి పార్టీ ఎంపీ, వర్కింగ్ ప్రసిడెంట్‌గా ఉన్నారని, ఆయనకు పీసీసీ పదవి ఇవ్వాలని తాను బహిరంగంగానే మీడియాకు చెప్పినట్లు పేర్కొన్నారు.