NRI-NRT

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో శ్రీరామాయణ జయమంత్ర దీక్ష

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో శ్రీరామాయణ జయమంత్ర దీక్ష

సింగపూర్ తెలుగు సమాజం సింగపూర్, మలేషియా తెలుగు సంఘం మలేషియా, శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పి.జి.కళాశాల తిరుపతి వారి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ రామాయణ జయ మంత్రదీక్ష కార్యక్రమం శ్రీరామనవమి నాడు వైభవంగా నిర్వహించారు.

ఇండోనేషియా ప్రవాసాంధ్రుడు హరినాథరెడ్డి ఈ జయ మంత్ర దీక్షను వీక్షకులకు అందించారు. వీరు ప్రసంగిస్తూ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో హనుమంతుడు సీతాదేవి అన్వేషణలో ఉపాసించిన జయ మంత్రం అత్యంత శక్తివంతమైనదన్నారు. వ్యక్తులు తాము అనుకున్న పనులు నెరవేరాలంటే ఈ దీక్షను 48 రోజులపాటు పాటించాలన్నారు. జయ మంత్ర ఉపాసన మనిషికి ధైర్యాన్నిస్తుందన్నారు. ఈ మంత్రం అజాత శత్రువులను చేస్తుందన్నారు. ఆశావాద దృక్పథాన్ని పెంచుతుందని, ఆయుష్షును వృద్ధి చేస్తుందన్నారు.

సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి మూలం రామాయణమన్నారు. ప్రతి ఒక్కరు జయ మంత్ర దీక్ష తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపడానికి ముందుకు వచ్చిన హరినాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులయిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షులు జ్యోతీశ్వర్ రెడ్డి ప్రసంగిస్తూ జయ మంత్రం మన అందరినీ విజయ బాటలో నడిపిస్తుందన్నారు. పెద్దసంఖ్యలో ప్రవాసులు ఈ కార్యక్రమాన్ని సింగపూర్,మలేషియా,ఆస్ట్రేలియా,ఇండోనేషియా, ఫిలిపైన్స్,న్యూజిలాండ్ తదితర దేశాల నుండి అంతర్జాలంలో వీక్షించారు. మలేషియా తెలుగు సంఘము ఉపాధ్యక్షులు సూర్యనారాయణ మాట్లాడుతూ హనుమంతుడు ఆచరించిన జయమంత్రాన్ని ప్రజలకు తెలియజేసి, రామాయణ హరినాథ రెడ్డి సమాజానికి మహోపకారం చేశారన్నారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పి.జి. కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ శ్రీరామనవమి రోజు రెండు మహాకార్యాలను నిర్వహించుకున్నామన్నారు. మొదటిది తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమలలోని అంజనాద్రి పర్వతంపై హనుమంతుడు జన్మించారనే విషయాన్ని నిరూపించడం. రెండవది ఈ జయమంత్ర దీక్షను తీసుకోవటమన్నారు. తరువాత రామాయణంలోని సందేహాలను డా.సునీత, ఉషారాణి, డా.అరుణకుమారి తదితరులు ప్రస్తావించగా హరినాథ్ రెడ్డి సమాధానాలిచ్చారు.