Devotional

ఇంతపెద్ద హోమం నిర్వహించడం భూమండలంలోనే తొలిసారి!

ఇంతపెద్ద హోమం నిర్వహించడం భూమండలంలోనే తొలిసారి!

వేద పండితుల శ్రీమన్నారాయణ నామస్మరణతో మొదలైన శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు తొలిరోజు వైభవంగా జరిగాయి. పెరుమాళ్ల శోభాయాత్ర, విశ్వక్ సేనుడి ఆరాధన, వాస్తుశాంతి శోభాయమానంగా నిర్వహించే వేడుకలకు అంకురార్పణ చేసిన చినజీయర్ స్వామి.. నేడు అగ్నిహోత్రం ఆవిష్కరణతో యాగశాలలో 1035 కుండలాల్లో హోమం నిర్వహిస్తున్నారు. ఇంత పెద్ద హోమం చేయడం భూమండలంలోనే తొలిసారని వేదపండితులు అన్నారు. ‘ఇంతపెద్ద హోమం నిర్వహించడం భూమండలంలోనే తొలిసారి!’

** సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు హైదరాబాద్ శివారు ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజుల ఈ మహాక్రతువులో తొలిరోజు శోభాయమానంగా జరిగింది. వేడుకల్లో అతి ప్రధానమైన అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. పుట్టమన్ను తెచ్చి నవధాన్యాలతో కలిపి ఘటిక, పాలికలో ఉంచి క్రతువుగా తయారైంది. రుత్వికవరణంలో భాగంగా యజ్ఞాల్లో పాల్గొనే రుత్వికులకు కంకణ ధారణ, దీక్షా వస్త్రాలు సమర్పించారు. మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావు దంపతులు యజ్ఞం ద్వారా నిర్వహించే శ్రీనివాసాచార్యులు, మధుసూధనాచార్యులకు వస్త్రాలు సమర్పించారు.

** 12 రోజుల మహాక్రతువు..
అంతకుముందు 12 రోజుల మహాకత్రువు ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగాలని ప్రార్థిస్తూ విశ్వక్సేనుడి ఆరాధన, వాస్తుశాంతి పూజ శాస్త్రోక్తంగా జరిగింది. పల్లకిలో పెరమాళ్లను యాగశాలకు శోభాయాత్రగా తీసుకొచ్చారు. వేద పండితులు, రుత్వికులు, వాలంటీర్లు, ఆశ్రమ విద్యార్థుల శ్రీమన్నారాయణ స్మరణతో శోభాయాత్ర వైభవంగా జరిగింది. రాహుకాలం ముగిశాక త్రిదండి చినజీయర్ స్వామితోపాటు ఏడుగురు ఆచార్యులు అహోబిలం జీయర్ స్వామి, దేవనాథ జీయర్ స్వామి, వ్రతధర జీయర్ స్వామి, అష్టాక్షరీ సంపత్ కుమార జీయర్ స్వామి, శ్రీరామచంద్ర జీయర్ స్వామి, ముక్తినాథ జీయర్ స్వామి హాజరై పుణ్యవచనాలిచ్చారు. చిన్నజీయర్ స్వామి వాస్తుశాంతి పూజ నిర్వహించి దాని ప్రాధాన్యత, విశిష్టతను భక్తులకు వివరించారు.

**1035 కుండలాలు.. 5వేల మంది రుత్వికులు..
రెండోరోజు ఉత్సవాల్లో భాగంగా ఇవాళ మహా యజ్ఞాన్ని నిర్వహించనున్నారు. యాగశాలలో ఏర్పాటు చేసిన 1035 కుండలాల్లో ఏకకాలంలో 5 వేల మంది రుత్వికులు హోమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న హోమంలో తొలుత అగ్నిహోత్రాన్ని ఆవిష్కరించనున్నారు. మంత్రపూర్వకంగా శమి, రావి కర్రలను పెరుగు చిలికినట్లు చిలుకుతుంటారు. భక్తులు.. భగవన్నామస్మరణ చేస్తే రెండు కర్రల రాపిడికి అగ్నిహోత్రం పుడుతుంది. ఆ అగ్నిని 1035 కుండలాల్లో పోసి హోమాన్ని నిర్వహిస్తున్నారు.

**భూమండలంలోనే ఇంతపెద్ద హోమం తొలిసారి..!
ఇంత పెద్ద ఎత్తున హోమాన్ని నిర్వహించడం భూమండలంలోనే తొలిసారని అహోబిలం జీయర్ స్వామి అన్నారు. గతంలో పెద్దజీయర్ స్వామి ఆధ్వర్యంలో 1972లో, చినజీయర్ స్వామి సమక్షంలో 1980, 1994లో మూడుసార్లు తిరుమల కొండపై యాగాలు చేసినట్లు గుర్తుచేశారు. అయితే తిరుమలను కలియుగ వైకుంఠంగా భావిస్తున్నామని, ఇప్పుడు శ్రీరామనగరంలో నేలపై 5 వేల మంది రుత్వికులతో యాగం చేయడం తొలిసారని అహోబిలం జీయర్ స్వామి వివరించారు. యాగం వల్ల వెలువడే పొగ.. కార్బన్ డైయాక్సైడ్, మన చుట్టూ ఉండే కాలుష్యాన్ని, వ్యాధి కారకాలను తొలగించే పరమార్థమే ఈ మహాయాగమని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు.

**నేటి కార్యక్రమాలు..
అంకురార్పణ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి ఎర్రబెల్లి, స్పీకర్ శ్రీనివాసరెడ్డి కొనసాగుతున్నారు. ఏపీ ప్రభుత్వం కోసం వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ఆ తర్వాత 4 గంటల నుంచి ఐదున్నర గంటల వరకు హోమం చేయనున్నారు. అనంతరం ఇష్టశాలల వద్ద దుష్టనివారణకు శ్రీ సుదర్శనేష్టి, సర్వాభీష్ట సిద్ధికి శ్రీవాసుదేవేష్టిని చేస్తారు. ఆ తర్వాత గంటన్నరపాటు ఆ లక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామ పూజ, ప్రవచనాలు జరగనున్నాయి.