NRI-NRT

అమెరికాలో తొలిరోజు మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న విజయవంతం

అమెరికాలో తొలిరోజు మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న విజయవంతం

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కే తారకరామారావు పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ లైఫ్ సైన్సెస్ కంపెనీ కెమ్ వేద ముందుకు వచ్చింది. శాండియాగో లోని సంస్థ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేసింది.లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రముఖ పరిశోధన సంస్థగా కెమ్ వేద కంపెనీకి పేరుంది. ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ, ఆగ్రో కెమికల్, పరిశ్రమలకు ఈ సంస్థ సేవలు అందిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మరింతగా విస్తరించేందుకు 150 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్టు సంస్థ తెలిపింది. కేవలం 45 మంది ఉద్యోగుల‌తో ప్రారంభమైన కంపెనీ ఈ రోజు 450 మందికి చేరిందని, దీనిని మరింతగా విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్‌కు తెలిపింది. 8 ఎకరాల్లో రెండు చోట్ల తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, తమ కంపెనీని ఇంత భారీగా విస్తరించేందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాలసీలు, అక్కడ ఉన్న నాణ్యమైన మానవ వనరులు ప్రధాన కారణాలని తెలిపింది.

*పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్థానంగా హైద‌రాబాద్‌: మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్ నగరం దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఫార్మా, లైఫ్ సైన్సెస్‌ల‌కు ఆకర్షణీయ పెట్టుబడుల గమ్యస్థానంగా ఉందని కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్న కెమ్ వేద లైఫ్ సైన్సెస్ కంపెనీ కి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఫార్మా లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టంలో ఉన్న మానవ వనరులు, అవకాశాలను ఉపయోగించుకొని ప్రత్యేకంగా రీసెర్చ్ అండ్ డెవల‌ప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కంపెనీ కార్యకలాపాలకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ఫార్మా లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ ఈకో సిస్టంను ఈ డెవలప్‌మెంట్ సెంటర్ మరింత బలోపేతం చేస్తుంది అని కేటీఆర్ అన్నారు.

*హైద‌రాబాద్‌లో కంపెనీ వేగంగా విస్త‌రిస్తున్న‌ది..: సీఈవో బీమారావు
హైదరాబాద్ నగరంలో తమ కంపెనీ వేగంగా విస్తరిస్తున్న‌దని, ఫార్మా, లైఫ్ సైన్సెస్ వృద్ధిలో
భాగస్వామ్యం తమకు అత్యంత సంతోషాన్ని ఇస్తున్న‌ద‌ని కంపెనీ అధ్యక్షుడు, సీఈఓ బీమారావు పారసెల్లి తెలిపారు. అంతర్జాతీయ‌స్థాయి ప్రమాణాలతో కూడిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ సెంటర్ సుమారు రెండు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అత్యంత నైపుణ్యం కలిగిన 500 మంది నిపుణులకు పరిశోధన అవకాశాలు లభిస్తాయని వెల్ల‌డించారు. భవిష్యత్తులో తమ కంపెనీని మరింత విస్తరించనున్నట్లు ఆయన ప్ర‌క‌టించారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌తోపాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ , డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ శక్తి నాగప్పన్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

*శాన్‌డియాగోలో మంత్రి కేటీఆర్‌కు ఘ‌న స్వాగ‌తం
తన పర్యటనలో భాగంగా తొలి రోజు సమావేశాల కోసం అమెరికాలోని శాన్ డియాగో లో అడుగు పెట్టిన మంత్రి కే తారకరామారావుకు స్థానికంగా ఉన్న తెలుగు ఎన్నారైలు ఘ‌న‌ స్వాగతం పలికారు. శాన్‌డియాగోలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాల గురించి వారిని మంత్రి కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. మంత్రి కేటీఆర్ తమ నగరంలో పర్యటించడం పట్ల ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు.