DailyDose

30 ఏళ్లొచ్చినా పెళ్లికి యువత నో..నో.. తాజా రిపోర్ట్​ ఇదిగో..

30 ఏళ్లొచ్చినా పెళ్లికి యువత నో..నో.. తాజా రిపోర్ట్​ ఇదిగో..

ఉద్యోగంలో ఎదగాలనే సంకల్పం.. జీవితంలో స్థిరత్వం సాధించాలనే తపన.. కెరీర్‌పై దృష్టి.. తదితర కారణాలతో ఈ తరం యువతీ యువకులకు పెళ్లీడు దాటిపోతోంది. దేశం మొత్తమ్మీద ఇదే ధోరణి కొనసాగుతోంది. ‘భారత్‌లో యువత 2022’ పేరిట కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

జీవితంలో స్థిరపడే వరకు అబ్బాయిలు, అమ్మాయిలు ఎదురుచూసినా కల్యాణ గడియలు మాత్రం మూడు పదులలోపు మోగాల్సిందే అంటారు. కానీ నేటి యువత ఉద్యోగంలో ఎదగాలనే సంకల్పం.. జీవితంలో స్థిరత్వం సాధించాలనే తపన.. కెరీర్‌పై దృష్టి.. తదితర కారణాలతో ఈ తరం యువతీ యువకులకు పెళ్లీడు దాటిపోతోంది. 30 ఏళ్లు మీద పడినా వారు వివాహం వైపు దృష్టి సారించడం లేదు. దేశం మొత్తమ్మీద ఇదే ధోరణి కొనసాగుతోంది. భారత్‌లో 29 ఏళ్లు దాటాక కూడా పెళ్లి చేసుకోనివారు 2011లో 20.8 శాతం మంది నమోదు కాగా.. 2019లో ఇది 26.1 శాతానికి పెరిగింది. తెలంగాణలో గడచిన అయిదేళ్లతో పోల్చితే పెళ్లీడు దాటిపోయే వారి సంఖ్య దాదాపు 2 శాతం పెరిగింది.

2015లో రాష్ట్రంలో 30 ఏళ్లు దాటాక కూడా పెళ్లి చేసుకోని వారు 21.5 శాతం మంది ఉండగా.. 2019లో ఏకంగా 23.8 శాతానికి పెరిగారు. దేశంలో ప్రధానంగా జమ్మూ కశ్మీర్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఆలస్యంగా పెళ్లి చేసుకునేవారు అధికంగా నమోదయ్యారు. వయసు దాటిపోవడం వల్ల వైవాహిక జీవితంపై దుష్ప్రభావం పడడమే కాకుండా.. పుట్టే పిల్లల్లోనూ సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. ‘భారత్‌లో యువత 2022’ పేరిట కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో పలు అంశాలు వెల్లడయ్యాయి.నివేదికలోని ముఖ్యాంశాలివి..

* 2021లో 15-29 ఏళ్ల మధ్యవయస్కులు దేశజనాభా (136.3 కోట్లు)లో 27.3 శాతం మంది. 2036 నాటికి ఈ యువత శాతం 22.7కు తగ్గుతుందని నివేదిక చెబుతోంది. తెలంగాణలో ఇది 26.4 శాతం నుంచి 21.7 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది.

* 2021 గణాంకాల ప్రకారం.. దేశ సగటు యువత రేటుతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్‌, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో యువత రేటు తక్కువగా ఉంది.

* నెలసరి సమయంలో పరిశుభ్రమైన పద్ధతులను పాటిస్తున్న అమ్మాయిల సంఖ్య పెరిగింది. 15-24 ఏళ్ల వారిని పరిగణనలోకి తీసుకుంటే.. 2015-16లో 58 శాతం మంది ఈ పద్ధతులను అనుసరిస్తుండగా.. 2019-21లో ఆ శాతం 77.6కు పెరిగింది. గ్రామీణ భారతంలో వీరి శాతం 2015-16లో 48.2 కాగా, 2019-21లో 72.6 శాతానికి పెరిగింది.

* దేశంలో బాల్య వివాహాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 2005-06లో 11.9 శాతం మంది 15 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకోగా.. 2019-21లో వీరి సంఖ్య 1.7 శాతానికి తగ్గింది. బాల్య వివాహాల వల్ల అమ్మాయిల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతోంది. రక్తహీనత వేధిస్తోంది. పుట్టిన శిశువుల ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగానే ఉంటోందని నివేదిక వెల్లడించింది.

* 2016-17లో తెలంగాణలో కచ్చితంగా 18 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న అమ్మాయిలు 30.8 శాతం మంది, 21 ఏళ్లకే పెళ్లి చేసుకున్న అబ్బాయిలు 13.4 శాతం మంది. 2019-21లో 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్న అమ్మాయిలు 27.3 శాతానికి తగ్గగా.. 21కు వివాహమైన అబ్బాయిలు 12.9 శాతానికి తగ్గారు.

* తెలంగాణలో 2015లో 15-19 ఏళ్ల మధ్యవయస్కులు వెయ్యిమందిలో 0.7 మంది మృతిచెందగా.. 2019లోనూ అదే రీతి కొనసాగింది. 20-24 ఏళ్ల వారిలో 2015లో 0.9 మంది చనిపోగా.. 2019లో ఆ సంఖ్య 1.0కి స్వల్పంగా పెరిగింది. 25-29 ఏళ్ల వయస్కుల్లో 2015లో 1.5 మంది మృతిచెందగా.. 2019లో 1.0కి తగ్గింది.

* తెలంగాణలో 2014లో ఆసుపత్రుల్లో ప్రసవాలు 90.6 శాతం ఉండగా.. 2019లో 94.6 శాతానికి పెరిగాయి.

* 15-49 ఏళ్ల మహిళల్లో 43 శాతం మంది, పురుషుల్లో 39 శాతం మంది పోషకాహార సమస్యలతో బాధపడుతున్నారు. 59 శాతం మంది మహిళలు, 31 శాతం మంది పురుషులు రక్తహీనత బారినపడ్డారు.

* గత 48 ఏళ్లలో యువతలో మృతుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. భారత్‌లో 1971లో ప్రతి వెయ్యి మంది జనాభాలో 15-19 ఏళ్ల మధ్యవయస్కులు 2.4 మంది మృతిచెందగా.. 2019 నాటికి అది 0.7కి తగ్గింది. అదే 20-24 ఏళ్ల వయస్కుల్లో 3.6 నుంచి 1కి.. 25-29 ఏళ్ల వారిలో 3.7 నుంచి 1.2కు మృతుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.

* 2015-16లో 15-19 ఏళ్ల వయస్కుల్లో సంతానం కలిగిన వారు 7.7 శాతం మంది.. రెండోసారి గర్భం దాల్చిన వారు 2.9 శాతం మంది. 2019-21 నాటికి ఆ వయసులో సంతానం కలిగి ఉన్నవారు 3.3 శాతానికి తగ్గగా.. రెండోసారి గర్భం దాల్చిన వారు 2.4 శాతానికి తగ్గారు.