“కార్తికేయ-2’ కథ చెప్పినప్పుడే అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా కృష్ణతత్వ నేపథ్యం బాగా నచ్చింది’ అని చెప్పింది అనుపమ పరమేశ్వరన్. ఆమె నిఖిల్ సరసన కథానాయికగా నటించిన ‘కార్తికేయ-2’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. చందు మొండేటి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ పాత్రికేయులతో మాట్లాడుతూ ‘నేను ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను.పాత్రలపరంగా సవాళ్లను స్వీకరించడానికి సదా సిద్ధంగా ఉంటా. ‘కార్తికేయ-2’ సినిమాలోని దైవిక, థ్రిల్లింగ్ అంశాలు బాగా ఆకట్టుకున్నాయి. కంటెంట్ బాగుంటే విజయం తథ్యమని ఈ సినిమా నిరూపించింది. ఈ సినిమాలో నా పాత్ర కొన్ని చోట్ల హీరోను డామినేట్ చేసే విధంగా ఉందని అంటున్నారు. కథానుగుణంగా అలా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం సినిమాల విషయంలో భాషా పరమైన హద్దులు చెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్నది. నేను నటిస్తున్న రెండు తెలుగు చిత్రాలు సెట్స్మీదున్నాయి. మరో రెండు సినిమాల కోసం చర్చలు జరుగుతున్నాయి’ అని చెప్పింది