Movies

ఇప్పుడు మేం ముగ్గురం

ఇప్పుడు మేం ముగ్గురం

మోడలింగ్‌ నుండి సినిమా ఫీల్డ్‌కు వచ్చి తమ అందచందాలతో అదరగొట్టిన భామల్లో బిపాస బసు ఒకరు. ఆమె ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికి 21 ఏళ్లు అయింది. 2001లో వచ్చిన ‘అజ్‌నబీ’ ఆమె తొలి సినిమా. ‘ధూమ్‌ 2’, ‘జిస్మ్‌’, ‘ఫిర్‌ హేరా ఫేరి’, ‘దమ్‌ ఆరో దమ్‌’ వంటి చిత్రాల్లో నటించి తన ప్రత్యేకత చాటుకున్నారు. తెలుగులో మహేశ్‌ నటించిన ‘టక్కరి దొంగ’లో కూడా కథానాయికగా నటించారు. 2015 లో వచ్చిన ‘ఎలోన్‌’ చిత్రంలో కలసి నటించిన కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌తో 2016లో బిపాస వివాహం జరిగింది. పెళ్లి తర్వాత బిపాసకు సంబంధించిన న్యూస్‌ పెద్దగా వినిపించలేదు. ఆ మధ్య బిపాస తల్లి కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని కన్‌ఫర్మ్‌ చేస్తూ తను తల్లిని కాబోతున్న విషయాన్ని మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా బిపాస వెల్లడించారు. బేబీ బంప్‌తో ఉన్న తన ఫొటోను ఆమె షేర్‌ చేశారు. ఈ ఫొటోలో ఆమె భర్త కరణ్‌సింగ్‌ కూడా ఉన్నారు. ‘ఒంటరిగా జీవితాన్ని ప్రారంభించి, మేం ఒకరినొకరం కలుసుకొని ఇద్దరమయ్యాం. ఇప్పుడు మూడో వ్యక్తి మా జీవితంలోకి ప్రవేశిస్తున్నారు. మీ ప్రేమ, ఆశీస్సులు, అభిమానం ఎప్పటికీ మాకు ఉండాలనీ కోరుకుంటున్నాం’ అని భావోద్వేగంతో ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు బిపాస.