: ఈటల రాజేందర్ కు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పడటం లేదని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈటెల సింగిల్ గా అమిత్ షా వద్దకు కూడా వెళ్లారు. ఈ సంధర్భంగా అధ్యక్షుడి మార్పు గురించే ఈటెల చర్చించారని జోరుగా చర్చ జరిగింది. అయితే అధిష్టానం మాత్రం బండిని మార్చడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అధ్యక్షుడిని మారిస్తే పార్టీలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భావిస్తోందట.
అయితే ఈటెల మాత్రం పార్టీలో ఉండలేకపోతున్నారని ఆయన కొత్త పార్టీ ఆలోచనలో ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈటెల పొంగులేటి జూపల్లితో రహస్యంగా భేటీ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. గురువారం హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్ లో ఈటెల రాజేందర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశం జరుగుతున్న సమయంలో ఈటెల తన గన్ మెన్ లను కూడా లోనికి అనుమతించలేదని సమాచారం.
దాదాపు నాలుగు గంటల పాటూ ఈ సమావేశం కొనసాగినట్టు తెలుస్తోంది. దాంతో బీజేపీలో పొంగులేటి, జూపల్లి చేరిక గురించి ఈ సమావేశం జరగలేదని ఈటెల ఆధ్వర్యంలో కొత్త ఏర్పాటుకే జరిగిందని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన తరవాత పొంగులేటి జూపల్లి మరో పార్టీ చేరలేదు. కాంగ్రెస్ వీరిద్దనీ చేర్చుకునేందుకు ప్రయత్నించింది.
బీజేపీ కూడా వీరిని పార్టీలో చేర్చుకోవాలని శతవిధాలా ప్రయత్నించి విఫలం అయ్యింది. అయితే ఇప్పటికే పొంగులేటి ఖమ్మంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బీజేపీలో చేరితే ఖమ్మం లో సగం సీట్లు మాత్రమే గెలుస్తానని భహిరంగంగా ప్రకటించారు కూడా. కాంగ్రెస్ లో చేరేందుకు కూడా పాజిటివ్ గా స్పందించలేదు. కానీ పొంగులేటి ఇప్పటికే తెలంగాణ జనసమితి పేరుతో పార్టీ పేరును కూడా రిజిస్టర్ చేయించారని టాక్ ఉంది. దాంతో ఇప్పుడు అదే పార్టీని కూటమిగా నడిపిస్తారని అందుకోసమే ఈ సమావేశం అని కూడా చర్చజరుగుతోంది.