NRI-NRT

ఖతార్ లో ఆర్పీ పట్నాయక్ సంగీత విభావరి…..

ఖతార్ లో ఆర్పీ పట్నాయక్ సంగీత విభావరి…..

ఆంధ్ర కళావేదిక జూన్ 9వ తేదీన దోహా, ఖతార్‌లోని అద్భుతమైన ప్రాంగణం “లా సిగాలే” హోటల్‌లోని అల్ వాజ్బా బాల్ రూమ్ లో వేసవి తాపాన్ని తీర్చే కార్యక్రమం “సమ్మర్ ఫీస్ట్”ను “రవి మెలోడీస్” ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో ఆద్యంతమూ ఆర్పీ పట్నాయక్ గారి గళం, అయన పంచుకున్న అనుభవాలు, ఓపికతో ఇచ్చిన ఫొటోల అనుమతి అందరిని మంత్ర ముగ్ధులను చేసాయి. “మనసంతా నువ్వే” అంటూ మదిలోని మధుర స్మృతులను కళ్ళముందుకి తెచ్చాయి. ఆర్పీ గారితో పాటుగా సత్య యామిని, జీవీ భాస్కర్, రవి పాటలు ప్రేక్షకులను సీట్లకు కట్టి పడేస్తే, తెలంగాణ సింగర్ లక్ష్మి పాటలతో హాలంతా కేరింతలు, ఈలలు డాన్సులతో దద్దరిల్లింది. ఆద్యంతమూ హుషారుగా సాగిన రమణీయమైన, మధురమైన పాటల పరంపర ఖతార్ తెలుగువారందరిని ఉర్రూతలూగించటమే కాక వారికి మరవలేని అనుభూతిని మిగిలింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప జిల్లా డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ భాష, కళా, సాంస్కృతిక, సేవా రంగాలలో చేస్తున్న కృషికి ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని వేనోళ్ల పొగిడారు. ఇలాగే కార్యక్రమాలు చేస్తూ ఉండాలని అభినందించారు.