Politics

అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ

అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సుమారు 45 నిమిషాల పాటు ఈ భేటీ సాగింది. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై కేంద్ర మంత్రితో జగన్ అమిత్ షాతో చర్చించారని సమాచారం. ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. మోడీతో సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర ఆర్ధిక మంత్రితో కూడ జగన్ భేటీ అవుతారు. రేపు మరికొందరు కేంద్ర మంత్రులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.ఇవాళ ఉదయమే ఏపీ సీఎం వైఎస్ జగన్ అమరావతి నుండి న్యూఢిల్లీకి బయలు దేరారు.

ఇవాళ మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు జగన్ న్యూఢిల్లీకి చేరుకున్నారు. న్యూఢిల్లీకి చేరుకున్నవెంటనే ఆయన అమిత్ షా తో చర్చించారు. యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుకు మద్దతివ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ను బీజేపీ కోరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ఈ విషయమై కూడ చర్చ జరిగే అవకాశం లేకపోలేదనే చెబుతున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన సమయంలో ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదు. పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని అమిత్ షా ను జగన్ కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల విషయమై కూడ కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం జగన్ కోరనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన సమయంలో ఈ నిధుల గురించి జగన్ ప్రస్తావించే అవకాశం ఉంది.