Devotional

నేడు చుక్కల అమావాస్య

నేడు చుక్కల అమావాస్య

నేడు జూలై 17 సోమవారం చుక్కల అమావాస్య సందర్భంగా… ఆషాఢమాసంలోని అమావాస్యను చుక్కల అమావాస్య అని అంటారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈనాడు కొత్తగా పెళ్ళైన కోడళ్లు ‘చుక్కల అమావాస్య’ పేరుతో ఒక నోముని నోచుకుంటారు. ఈ వ్రతానికి ప్రధానదైవం గౌరీదేవి.

ఒకపీటపై సున్నంతో మొదటి సంవత్సరం వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను ఉంచుతారు. బియ్యం పిండితో చేసిన వంద చుక్కలను నివేదిస్తారు. ఈ సంఖ్య సంవత్సరానికో వంద చొప్పున పెరిగి ఐదో సంవత్సరం ఐదువందలకు చేరుతుంది. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకూ ధరిస్తారు. కొంతమంది నక్షత్ర దర్శనం అయ్యాకే భోజనం చేస్తారు.

ఐదు సంవత్సరాల వరకు ఆచరించే ఈ వ్రతంలో చివరి సంవత్సరం ఉద్యాపనగా స్తోమత ఉన్నవారు బంగారపు చుక్కలను కూడా దానం చేస్తారు. తమ మాంగళ్యం కళకాలం నిలచి ఉండాలని గౌరమ్మ ను వేడుతారు.ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిది. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణమాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లిళ్ళు, అనేక శుభకార్యా ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీ దేవిని పూజిస్తారు. పసుపు ముద్దని గౌరీదేవిగా భావించి కొలుచుకుంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు గౌరీపూజ చేసుకుని అమ్మవారి రక్షా కంకణాన్ని ధరించిన అవివాహితులు తమకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం పొందుతారు.

ఈనాడు దీపపూజ చేయడం కూడా కనిపిస్తుంది. అషాఢమాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రివేళలు పెరుగుతాయి, చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికీ, అనారోగ్యానికీ చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా దీపపూజని చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్కపలకలని శుభ్రంగా అలికి, వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను ఉంచుతారు. ఆ దీపాలకు పసుపుకుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. దీనిని దీపస్తంభ వ్రతమని అంటారు.

‘అమ’ అనే అవ్యయానికి ‘కలిసి (కూడి) ఉండటం’ అని అర్థం. అదే అమావాస్య. ‘ఎవరి కలయిక’ అంటే సూర్యుడు- చంద్రుడు ఎదురెదురుగా కాసేపు రావడం. దక్షణాయణంలోని ఈ ‘తొలి అమావాస్య’ వారికి ఆహ్వానం పలుకుతుంది. ఆరోజు వారికి తర్పణాలు సమర్పిస్తారు. ఇది మొదలు వారికి చేసే జపతపాలకు, పూజలకు విశేష ఫలితాలు కలుగుతాయని శాస్ర్తాలు చెబుతున్నాయి. కొందరు ‘అమావాస్య’ అంటేనే ఏదో అపవిత్రమని భయపడిపోతారు. కానీ, ఇది అత్యంత శక్తివంతమైన తిథి. ముఖ్యంగా చుక్కల అమావాస్య రోజు దానధర్మాలు చేయడం వల్ల పితృదేవతల ఆత్మలు శాంతించి, అనుగ్రహిస్తారన్న నమ్మకం బలంగా ఉంది.🙏

🪔🪔🪔🪔🪔🪔🪔🪔