Politics

కేటీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

కేటీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

టీపీసీసీ చీఫ్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ ను హైదరాబాద్ లో వర్షాల పరిస్థితిపై నిలదీస్తూ బహిరంగ లేఖ రాశారు. అందులో..‘గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరం విలవిలలాడుతోంది. గల్లీ ఏరైంది.. కాలనీ చెరువైంది.. రహదారి సాగరమైంది. రోడ్లన్నీ చెరువులుగా మారిపోయాయి. బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలి లోతున నీళ్లు నిలిచాయి. లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది.ఇటువంటి నేపథ్యంలో బాధ్యతయుతమైన పదవిలో ఉన్న మీరు ప్రజలను గోసను పట్టించుకోకుండా పత్తా లేకుండా పోయారు. పుట్టిన రోజులు చేసుకుంటూ ప్రజలను మీ చావు మీరు చావండి.. అని వారి మానానికి వారిని వదిలేసి నిసిగ్గుగా బాధ్యతల నుంచి పారిపోతున్నారు. ఫామ్ హౌస్లో మీ అయ్య, పార్టీల్లో మీరు సేదతీరుతూ ప్రజలను వరదల్లో ముంచేశారు.

సందర్భం వచ్చినప్పుడల్లా హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దామని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికి తండ్రి కొడుకులు పోటీ పడుతుంటారు. యావత్ ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తోందని ఉద్దెర ముచ్చట్లు చెబుతుంటారు. ప్రపంచ దేశాల సంగతేమో గానీ నగర ప్రజలే బయటకు రావడానికి ఒకటికి పదిసార్లు ఆలోచించుకునే దుస్థితిని హైదరాబాద్ కు కల్పించారు. ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో అని ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుంటూ తిరిగాల్సిన పరిస్థితిని కల్పించారు.

ఇవన్నీ చూస్తుంటే మీ అసమర్థత కారణంగా హైదరాబాద్ నగరం ఎలా అభివృద్ధి చెందిందో జనాలకు అర్థమైపోయింది. విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయింది. హైదరాబాద్ ను డల్లాస్, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని ప్రగల్బాలు పలికిన తండ్రి కొడుకులు హైదరాబాద్ నగరాన్ని నరక కూపంగా మార్చారు. గత 9 ఏళ్లుగా నగరంలో సౌకర్యాల కల్పన, ప్రజలకు మేలు జరిగే దిశగా ఒక్క చర్య చేపట్టలేదు. మీరు ప్రచారం చేసుకుంటున్నట్లుగా అన్ని జరిగితే ఐటీ కారిడార్ నుంచి హయత్ నగర్ దాకా ట్రాఫిక్ జామ్ లు ఎందుకు నిత్యకృత్యంగా మారుతాయి.ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు నానా యాతన పడుతున్నారు. పది నిమిషాల ప్రయాణానికి రెండు గంటల సమయం పడుతుంది. రహదారుల నిర్వహణ మీకు అప్రాధాన్యత అంశంగా మారింది. ఫ్లైఓవర్ల కింద అండర్ పాస్ లు నీళ్ళు నిండిపోయి వాహనాలు వెళ్ళలేక జనాలు ఇబ్బందిపడుతున్నారు. కొన్ని కాలనీల్లో ఫీట్ మేర గుంతలు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఈ విధంగా ఉంటే స్ట్రాటజిక్ రోడ్లు అంటూ మీరు చేసే హడావుడి అంతా ఉత్తి డొల్ల అని తేలిపోయింది.

ఇటువంటి భారీ వర్షాలకే హైదరాబాద్ నగరం అతలాకుతలంగా మారుతోంది. ముంబైలో మాదిరిగా కుండపోత పడితే పరిస్థితి ఏమిటో తలుచుకుంటేనే భయపడే స్థితి దాపురించింది. దీనికి కారణం కమీషన్లు, డబ్బు కక్కుర్తితో నిబంధనలకు విరుద్ధంగా భారీ భవనాలకు అనుమతిలవ్వడం, నాళాలు, చెరువులు కబ్జా. హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు యథేచ్ఛగా భూములు, చెరువులు కబ్జా చేస్తూ అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.మున్సిపల్ శాఖ మంత్రిగా అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన మీరు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం అనే స్లోగన్… మీ పార్టీకి చెందిన నాయకుల అక్రమ నిర్మాణాల విషయానికి వచ్చేసరికి ఉత్తుత్తి పాదంగా మారిపోతుంది.హైదరాబాద్ లో ఇటువంటి పరిస్థితి రాబోతుంది..నగరం కాంక్రీట్ జంగిల్ గా మారబోతుందనే విషయాన్ని కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర భారీ నిర్మాణాల మాటున దాగి ఉన్న అవినీతిని వెల్లడించే సమయంలో పత్రికాముఖంగా ప్రస్తావించాను.