Business

రుణం చెల్లించినా బ్యాంకులు పత్రాలు ఇవ్వట్లేదా?

RBI guidelines to deliver documents after loan repayment in full

రుణాలను పూర్తిగా చెల్లించిన తర్వాత 30 రోజుల్లోగా రుణగ్రహీతలకు అసలైన ఆస్తి పత్రాలను వెనక్కి ఇవ్వాల్సిందిగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) ఆదేశించింది. ఈ నిబంధనలను పాటించకపోతే, రుణగ్రహీతకు రోజుకు రూ.5,000 చొప్పున పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని బుధవారం ఒక నోటిఫికేషన్‌లో ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు 2023 డిసెంబరు 1 నుంచి అమలు చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. అంటే ఆ తేదీ లేదా తర్వాత ఆస్తి పత్రాలను విడుదల చేయాల్సిన అన్ని సందర్భాల్లోనూ ఈ నిబంధనలను పాటించాలని తెలిపింది. ఏదైనా రిజిస్ట్రీలో నమోదైన ఛార్జీలను కూడా తొలగించాలని సూచించింది. ఖాతాదారు తమ ఆస్తులను పూచీకత్తుగా పెట్టి తీసుకున్న రుణాలను పూర్తిగా చెల్లించిన తర్వాత కూడా కొన్ని ఆర్థిక సంస్థలు ఆ దస్తావేజులను విడుదల చేసే విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఆర్‌బీఐ ఈ మేరకు సర్క్యులర్‌ జారీచేసింది. దీని ప్రకారం..

* ఖాతాదారు తన రుణాన్ని పూర్తిగా చెల్లించిన/సెటిల్‌మెంట్‌ చేసుకున్న 30 రోజుల్లోపు వారికి సంబంధించిన ఒరిజినల్‌ స్థిర/చరాస్తుల దస్తావేజులు తిరిగి ఇచ్చేయాలి. వాటిని ఎక్కడ తీసుకోవాలన్న విషయాన్ని బ్యాంకులు/ఆర్థిక సంస్థలు రుణగ్రహీతకు స్పష్టంగా చెప్పాలి. రుణం ఇచ్చిన బ్యాంకు బ్రాంచిలోనా, లేదంటే ఇతరత్రా ఏదైనా ఆఫీసు నుంచి సేకరించుకోవాలా? అన్నది సూచించాలి. ఆ రెండింటిలో రుణగ్రహీత ఎంచుకున్న చోట వాటిని తిరిగి ఇచ్చేయాలి.

* రుణ మంజూరీ లేఖలోనే రుణం తిరిగి చెల్లించిన తర్వాత ఎన్ని రోజుల్లో, ఎక్కడ, ఏ సమయంలో ఆ డాక్యుమెంట్లను తిరిగి ఇచ్చేదీ స్పష్టంగా పేర్కొనాలి.

* ఒకవేళ రుణం తీసుకున్న వ్యక్తి/వ్యక్తులు చనిపోతే వారి చట్టబద్ధ వారసులకు ఆ పత్రాలను ఇవ్వడానికి అనుసరించే నిబంధన గురించి ఆర్థిక సంస్థ చెప్పాలి. ఆ విధానంతోపాటు, ఇతరత్రా నిబంధనల గురించి ఆర్థిక సంస్థలు, బ్యాంకులు తమ వెబ్‌సైట్‌లలో స్పష్టంగా పొందుపరచాలి.

* రుణ చెల్లింపు/సెటిల్‌మెంట్‌ జరిగిన 30 రోజుల తర్వాతకూడా ఖాతాదారుకి చెందిన స్థిర, చరాస్తుల దస్తావేజులు తిరిగి ఇవ్వలేనిపక్షంలో ఆ జాప్యానికి కారణాలను ఖాతాదారుకి చెప్పాలి. ఒక వేళ ఆ జాప్యానికి ఆర్థిక సంస్థ/బ్యాంకులు కారణమైతే రుణగ్రహీతకు ఆలస్యమైన ప్రతి రోజుకు రూ.5,000 చొప్పున పరిహారం చెల్లించాలి.

* ఖాతాదారుడు పూచీకత్తుగా ఉంచిన ఒరిజినల్‌ డాక్యుమెంట్లకు పూర్తిగాకానీ, పాక్షికంగాకానీ నష్టం జరిగితే వాటి డూప్లికేట్‌/సర్టిఫైడ్‌ కాపీలను పొందేందుకు రుణదాత సహకరించడంతోపాటు, అందుకు అయ్యే ఖర్చులన్నీ భరించాలి. ఇలాంటి సందర్భంలో రుణదాతలు డాక్యుమెంట్లు తిరిగి ఇవ్వడానికి మరో 30 రోజుల అదనపు సమయం తీసుకోవచ్చు. 60 రోజుల తర్వాత కూడా జాప్యం జరిగితే ఆ రోజు నుంచి రోజుకు రూ.5000 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

* ఖాతాదారుడికి ఇది కాకుండా చట్ట ప్రకారం ఇతరత్రా ఏదైనా పరిహారం పొందడానికి వీలుంటే దీనికి అదనంగా అదికూడా పొందొచ్చు.