* ఫ్లిప్ కార్ట్ కీలక నిర్ణయం
ప్రముఖ దేశీయ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యవసర వస్తువుల డెలివరీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ‘బిగ్ బిలియన్ డేస్’ పేరుతో ఫ్లిప్కార్ట్ అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 15 వరకు ప్రత్యేక సేల్ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ తరుణంలో మంగళవారం (అక్టోబర్10)న ఫ్లిప్కార్ట్ పోర్టల్కు యూజర్లు పోటెత్తారు. దీంతో ఫ్లిప్కార్ట్ సైట్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ సైట్లో నిత్యవసర వస్తువుల్ని బుక్ చేసుకునేందుకు ప్రయత్నించిన యూజర్లకు ఫ్లిప్కార్ట్ గ్రోసరీ సెగ్మెంట్లో చిన్న బ్యానర్ను డిస్ప్లే కనిపించింది. రేపటి నుంచి సరుకుల్ని బుక్ చేసుకోండనేది ఆ బ్యానర్ సారాంశం. అసలే పండగ సీజన్, పైగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంది. ఈ సమయంలో గ్రోసరీ షాపింగ్ చేసే సమయంలో సమస్య తలెత్తుతుందంటూ కొనుగోలు దారులు ఫ్లిప్ కార్ట్కు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించారు. బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ప్రారంభమైన మొదటి రెండు రోజులు ఊహించని విధంగా ఆర్డర్లు వచ్చాయి. అన్నీ కేటగిరీల్లో కస్టమర్లకు కావాల్సిన వస్తువుల్ని అందించడమే మా లక్క్ష్యం. అయితే, కొత్త ఆర్డర్లను అక్టోబర్ 11 మిడ్ నైట్ 12 గంటల నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. పండగ సీజన్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్లు ఆన్ లైన్ విక్రయాలు ఎంత మేర జరిగే అవకాశం ఉందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్సీర్ ఓ నివేదికను విడుదల చేసింది. ‘రెడ్సీర్ సస్టట్రాటజీ కన్సల్టెంట్స్’ రిపోర్ట్ ప్రకారం.. ఆన్లైన్ విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 18 నుంచి 20 శాతం మేర పెరిగి రూ.90 వేల కోట్లు జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. గత ఏడాది రూ.76,000 కోట్ల ఆన్లైన్ విక్రయాలు జరిగాయి.
* ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ‘దసరా’ ఆఫర్
ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు టీఎస్ఆర్టీసీ(TSRTC) వినూత్న ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల రాఖీపౌర్ణమికి నిర్వహించిన లక్కీడ్రాకు విశేష స్పందన రావడంతో దసరాకు సైతం అదే తరహా ఏర్పాట్లు చేస్తోంది. దసరాకు 5వేలకు పైగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన TSRTC సంస్థ.. తమ బస్సుల్లో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు నగదు బహుమతులు గెలుచుకొనే ఛాన్స్ కల్పిస్తోంది. ఈ లక్కీ డ్రా(TSRTC Dasara lucky Draw) ద్వారా రూ. 11 లక్షల నగదు బహుమతులను ప్రయాణికులకు అందించే అద్భుత అవకాశాన్ని అందిస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇందుకోసం ప్రయాణికులు తమ ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనుక తమ పూర్తి పేరు, ఫోన్ నంబర్ను రాసి బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ల్లో వేయాలని సూచించారు. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల నగదు బహుమతులు అందించనున్నట్టు సజ్జనార్ తెలిపారు. ప్రతి రీజియన్కు ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు చొప్పున మొత్తం 110 మందికి ఒక్కొక్కరికి రూ.9900 చొప్పున నగదు బహుమతులను ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. అక్టోబర్ 21 నుంచి 23 తేదీ వరకు, మళ్లీ 28 నుంచి 30 తేదీల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చన్నారు. బతుకమ్మ, దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీఎస్ఆర్టీసీ 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బస్టాండ్లు, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో పురుషులు, మహిళలకు వేర్వేరుగా డ్రాప్ బాక్ష్లను ఏర్పాటు చేస్తారు. లక్కీ డ్రా అనంతరం డ్రాప్ బాక్స్లను సంబంధిత ఆర్ఎం కార్యాలయాలకు చేర్చి.. ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి 10 మంది చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారు. మొత్తం 11 రీజియన్లలో కలిపి 110 విజేతలను ఎంపిక చేసి వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా నగదు బహుమతులను అందజేస్తారు. దసరా లక్కీ డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సజ్జనార్ సూచించారు.
* ఆనంద్ మహీంద్రను అధిగమించిన రతన్ టాటా
పారిశ్రామికవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. వ్యాపార దక్షతతో మాత్రమే కాదు, తనదైన వ్యక్తిత్వం, దాతృత్వంతో ఆయన ప్రత్యేకతే వేరు. అందుకే సోషల్ మీడియాలో ఆయనకున్న ఫాలోయింగ్ మామూలుది కాదు. ఇదే విషయాన్నిమరోసారి నిరూపించుకున్నారు రతన్ టాటా. మహీంద్ర అండ్ మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్రను అధిగమించి మరీ నెటిజన్లు అభిమానాన్ని దోచుకున్నారు. భారతీయ సోషల్ మీడియాలో 360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 జాబితాలో టాప్లో ప్లేస్ కొట్టేశారు.హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం మైక్రోబ్లాగింగ్ సైట్లో ఎక్స్( ట్విటర్) ఎక్కువ మంది ఫాలోవర్లతో వార్తల్లో నిలిచారు. 12.6 మిలియన్లతో భారతీయ సోషల్ మీడియాలో అత్యంత విస్తృతంగా అనుసరించే వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందారు. ఒక ఏడాదిలో ఆయన ఫాలోవర్లు సంఖ్య 8 లక్షలకు పైగా పెరిగారు. ఆ తరువాతి స్థానంలో 10.8 మిలియన్ల మంది ఫాలోవర్లతో ఆనంద్ మహీంద్రా నిలిచారు.ఈ జాబితాలో టాప్ టెన్లో పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ, గూగుల్ అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ సత్య నాదెళ్ల, వ్యాపార వేత్తలు నందన్ నీలేకని, రోణీ స్క్రూవాలా, హర్ష వర్థన్ గోయింగా, కిరణ్ మజుందార్ షా, ఉదయకోటక్ నిలిచారు.దీంతో పాటు, భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తుల 12వ వార్షిక లిస్ట్ను కూడా హురున్ వెల్లడించింది. వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక కారణంగా సంపదలో గణనీయమైన క్షీణతను ఎదుర్కొన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీని అధిగమించి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ టాప్లోకి దూసుకొచ్చారు. గౌతమ్ అదానీ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అంబానీ సంపద ఈ కాలంలో భారీగా పుంజుకుని దాదాపు రూ.8,08,700 కోట్లకు చేరింది. గౌతమ్ అదానీ రూ.474,800 కోట్ల సంపదతో రెండో స్థానానికి పడిపోయారు. సీరం ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ ఎస్ పూనావల్లా రూ. 2,78,500 కోట్ల మొత్తం సంపదతో మూడో స్థానంలోఉన్నారు.ఈ జాబితాలో రూ.2,28,900 కోట్ల సంపదతో శివ నాడార్ నాల్గవ స్థానంలో ఉన్నారు, గోపీచంద్ హిందూజా , అతని కుటుంబం రూ.1,76,500 కోట్లతో 5వ స్థానంలో ఉన్నారు. 1,64,300 కోట్ల సంపదతో దిలీప్ షాంఘ్వీ ఆరో స్థానంలో ఉన్నారు.
* నేడు పెరిగిన బంగారం ధరలు
మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొనుగోలు చేస్తారు. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో ధరలు చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.200 కు పెరిగి రూ. 53,350 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.220 కు పెరిగి రూ.58,200 గా ఉంది.నేటి బంగారం ధర హైదరాబాద్ లో ఎంతంటే,22 క్యారెట్ల బంగారం ధర – రూ 53,350,24 క్యారెట్ల బంగారం ధర – రూ 58,200.నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే,22 క్యారెట్ల బంగారం ధర – రూ 52,350,24 క్యారెట్ల బంగారం ధర – రూ 58,200.
* వివో మనీలాండరింగ్ కేసు
మనీలాండరింగ్ కార్యకలాపాలపై కొనసాగుతున్న విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED).. చైనా మొబైల్ తయారీదారు వివో మొబైల్స్ ఇండియాకు చెందిన నలుగురు ఎగ్జిక్యూటివ్లను అరెస్టు చేసింది. ఇందులో ఒక చైనా పౌరుడు కూడా ఉన్నారు. లావా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు హరి ఓం రాయ్ కూడా ఈడీ అరెస్టు చేసిన వ్యక్తుల్లో ఒకరు. అయితే అతని ప్రమేయంపై అధికారులు మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.గ్రాండ్ ప్రాస్పెక్ట్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్ (GPICPL)తో సహా వివో మొబైల్స్ ఇండియా, 23 అనుబంధ కంపెనీలను కలిగి ఉన్న 48 స్థానాల్లో ఈడీ వరుస దాడులు నిర్వహించింది. ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను ప్రకారం, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్ఎల్ఎ) కింద ఈడీ దర్యాప్తు ఫిబ్రవరి 3, 2022న ప్రారంభమైంది. GPICPL చీటింగ్, మోసం, నేరపూరిత కుట్రకు పాల్పడిందని ఆరోపిస్తూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్ఐఆర్(FIR) నమోదైంది.అక్రమంగా చైనాకు నిధులను బదిలీ చేయడమే ప్రధాన ఉద్దేశ్యంగా భారత్లో బహుళ కంపెనీలను విలీనం చేశారని ఈడీ ఆరోపించింది. వివో మొబైల్స్ ఇండియా గణనీయమైన మొత్తాన్ని బదిలీ చేసిందని దర్యాప్తు వెల్లడించింది. దాని అమ్మకాల ఆదాయంలో దాదాపు సగం అంటే రూ. 1.25 లక్షల కోట్లు, చైనాకు, భారత్లో పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
* ఎల్ఐసీ మార్కెట్ షేర్ తగ్గుముఖం
ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) మార్కెట్ వాటా క్షీణించింది. జీవిత బీమా రంగంలో తనకు ఎదురులేదంటూ ఇన్నాళ్లు నిరూపించుకుంటూ వచ్చిన ఆ సంస్థ.. మార్కెట్ వాటా (LIC market share) సెప్టెంబర్ నెలలో తగ్గుముఖం పట్టింది. ఎల్ఐసీ కొత్త బిజినెస్ ప్రీమియం వసూళ్లు దాదాపు 10 శాతం మేర తగ్గాయి. గతేడాది ఇదే సమయంలో 68.25 శాతంగా ఉన్న ఎల్ఐసీ మార్కెట్ వాటా.. ఈ ఏడాది 58.50 శాతానికి తగ్గింది. అదే సమయంలో ప్రైవేటు సంస్థల మార్కెట్ వాటా స్వల్పంగా పెరగడం గమనార్హం. అయితే, ప్రైవేటు సంస్థల అన్నింటి వాటా కలిపినా ఎల్ఐసీ మార్కెట్ వాటాకు ఇంకా చాలా దూరంలో ఉండడం గమనార్హం.ఎల్ఐసీ సహా వివిధ జీవిత బీమా సంస్థల సెప్టెంబర్ నెల వ్యాపార సరళికి సంబంధించిన డేటాను లైఫ్ ఇన్సురెన్స్ కౌన్సిల్ తాజాగా వెల్లడించింది. సెప్టెంబర్ నెలలో రూ.92,462 కోట్ల విలువైన కొత్త పాలసీలను ఎల్ఐసీ విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో రూ.1.25 లక్షల కోట్ల విలువైన ప్రీమియంలను ఎల్ఐసీ విక్రయించడం గమనార్హం. పార్టిసిపేటింగ్ ప్రొడక్ట్లు తక్కువగా అమ్ముడవ్వడం, నాన్ పార్టిసిపేటింగ్ ప్రొడక్ట్లు తగినంత లేకపోవడం, కొన్ని బీమా ప్లాన్ల ఫీచర్లు, ధరల్లో మార్పులు వంటివి ఎల్ఐసీ మార్కెట్ క్షీణతకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.అదే సమయంలో ప్రైవేటు ఇన్సురెన్స్ సంస్థల మార్కెట్ వాటా పుంజుకోవడం గమనార్హం. 2022 సెప్టెంబర్లో 31.75 శాతంగా ఉన్న వీటి వాటా.. ఈ ఏడాది 41.50 శాతానికి పెరిగింది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సురెన్స్నే తీసుకుంటే.. సెప్టెంబర్లో మార్కెట్ వాటా 6.07 శాతం నుంచి 8.31 శాతానికి పెరిగింది. ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ వాటా 7.19 శాతం నుంచి 10.27 శాతానికి పెరిగింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సురెన్స్, బజాజ్ అలియాన్జ్ లైఫ్ ఇన్సురెన్స్, మ్యాక్స్ లైఫ్ ఇన్సురెన్స్ మార్కెట్ వాటా సైతం ఒక్కో శాతం మేర పెరగడం గమనార్హం.మరోవైపు ఇప్పటికీ ఏజెంట్ల నెట్వర్క్పైనే ఎల్ఐసీ ఎక్కువగా ఆధారపడుతోందని అనలిస్టులు చెబుతున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జరిగిన వ్యాపారంలో 96 శాతం కొత్త పాలసీలు.. ఏజెంట్లు, ఇన్సురెన్స్ అడ్వైజర్ల రూపంలో వచ్చినవే. అదే సమయంలో ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ 18, హెచ్డీఎఫ్సీ 20 శాతం పాలసీలు మాత్రమే ఏజెంట్ల నుంచి రావడం గమనార్హం. ప్రైవేటు కంపెనీలు ప్రధానంగా డిజిటల్ బాట పడుతుండగా.. ఎల్ఐసీ మాత్రం ఇంకా ఏజెంట్లపైనే ఆధారపడుతోందని పేర్కొంటున్నారు. యువత ఎక్కువగా డిజిటల్ సర్వీసులను కోరుకుంటున్నారని, ఏదైనా సమస్య ఎదురైతే పరిష్కారానికి కూడా ఆన్లైన్పైనే ఆధారపడుతున్నారని చెబుతున్నారు. ప్రైవేటు సంస్థలు డిజిటల్ విషయంలో ముందంజలో ఉన్నాయని పేర్కొంటున్నారు.
* నేడు గ్యాస్ సిలిండర్ ధరలు
నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను మాత్రం అమాంతం పెంచేశారు. అయితే ఇటీవల చాలా రోజు తర్వాత గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ రేట్లను తగ్గించి సామాన్యులకు కాస్త ఊరటనిచ్చారు. హైదరాబాద్: రూ. 966,వరంగల్: రూ. 974,విశాఖపట్నం: రూ. 912
విజయవాడ: రూ. 927,గుంటూర్: రూ. 944.
* హైదరాబాద్లో జీ-షాక్ స్టోర్
జపాన్ కంపెనీ క్యాసియో హైదరాబాద్లో తన మొదటి జీ-షాక్ స్టోర్ను ప్రారంభించింది. దీనిని కూకట్పల్లిలో ఏర్పాటు చేసింది. అందరి అభిరుచులకు తగిన వాచీలు ఇక్కడ ఉంటాయని క్యాసియో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హిడెకి ఇమై చెప్పారు. జీషాక్ వాచీలు ఎక్కువ కాలం మన్నుతాయని అన్నారు.
* నేడు పెట్రోల్ డీజిల్ ధరలు
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల ;పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ ధరలు కొంత కాలం నుంచి స్థిరంగా ఉంటున్నాయి. ఒకటో తేదీన ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.109 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే..హైదరాబాద్:లీటర్ పెట్రోల్ ధర రూ.109.66.లీటర్ డీజిల్ ధర రూ.98.31.విశాఖపట్నం:లీటర్ పెట్రోల్ ధర రూ. 110.48,లీటర్ డీజిల్ ధర రూ. 98.విజయవాడ:లీటర్ పెట్రోల్ ధర రూ. 111.76,లీటర్ డీజిల్ ధర రూ. 99.
👉 – Please join our whatsapp channel here
<a href=”https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z”>https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z</a>