కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ), దేశవ్యాప్తంగా గోదాము సదుపాయాల విస్తరణకు ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గుర్తించిన గోదాము స్థలాల మార్కెటింగ్ బాధ్యతలను స్థిరాస్తి కన్సల్టింగ్ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా చేపట్టనుంది. ఈ మేరకు సీడబ్ల్యూసీతో అవగాహనా ఒప్పందం కుదర్చుకున్నట్లు నైట్ ఫ్రాంక్ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో పెదకాకాని, రాయనపాడు, అనకాపల్లి, నెల్లూరుల్లో గోదాములు నిర్మించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. ఇందుకు స్థలాలను ఎంపిక చేసింది. ఈ గోదాముల ప్రాజెక్టు వ్యయం రూ.181.33 కోట్లు.
రూ.71.16 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణలో వరంగల్, నాంపల్లి (హైదరాబాద్) లో కొత్త గోదాములు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. గోదాములను నిర్మించి, నిర్వహించాలనుకునే స్థిరాస్తి డెవలపర్లకు ఇది మంచి అవకాశమని నైట్ ఫ్రాంక్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గులామ్ జియా పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –