Business

న్యూస్‌క్లిక్‌ మనీలాండరింగ్‌ కేసు విచారణలో అమెరికన్‌ మిలియనీర్‌కు ఈడీ నోటీసులు

న్యూస్‌క్లిక్‌ మనీలాండరింగ్‌ కేసు విచారణలో అమెరికన్‌ మిలియనీర్‌కు ఈడీ నోటీసులు

భారత్‌కు చెందిన ఆన్‌లైన్ వార్తల పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌ (NewsClick) కేసులో అమెరికా మిలియనీర్‌ నెవిల్లే రాయ్‌ సింగం (Neville Roy Singham)కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) సమన్లు జారీ చేసింది. చైనాకు అనుకూలంగా కథనాలు రాసేందుకు న్యూస్‌క్లిక్‌కు బీజింగ్‌ నుంచి నిధులు అందుతున్నాయని ఈ ఏడాది ఆగస్టులో అమెరికా పత్రికలు కథనాలు వెలువరించాయి. నెవిల్లే రాయ్‌ సింగం, ఆయనకు చెందిన న్యూస్‌ క్లిక్‌ ప్రమాదకరమైనవి అందులో అభివర్ణించాయి. దీనిపై కేసు నమోదు చేసి, సోదాలు చేపట్టిన ఈడీ.. కొన్ని ఆస్తులను జప్తు చేసింది. తాజాగా మనీలాండరింగ్ చట్టం కింద భారత విదేశాంగ శాఖ ద్వారా చైనాలోని షాంఘైలో ఉన్న నెవిల్లే రాయ్‌ సింగంకు నోటీసులు పంపింది. ఆయన వాదనలు రికార్డు చేసేందుకు దిల్లీ కోర్టు అనుమతించిన నేపథ్యంలో ఈడీ రెండోసారి సమన్లు జారీ చేసింది. న్యూస్‌క్లిక్ వివాదంలో తనపై వచ్చిన ఆరోపణలను నెవిల్లే ఇప్పటికే ఖండించారు.

చైనా నుంచి నిధులు అందుతున్నాయనే ఆరోపణలతో 2021 సెప్టెంబరులో దిల్లీలోని న్యూస్‌క్లిక్ కార్యాలయంలో ఈడీ సోదాలు చేసింది. అనంతరం న్యూస్‌క్లిక్‌ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ ప్రబీర్‌ పురకాయస్థ సహా 25 మంది వాంగూల్మాన్ని నమోదు చేసింది. రెండు నెలల క్రితం ఈడీ ఇచ్చిన సమాచారంతో దిల్లీ పోలీసులు ఉగ్రవాద వ్యతిరేక చట్టం ఉపా కింద కేసు నమోదు చేశారు. అనంతరం ప్రబీర్‌ను అరెస్టు చేశారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) నిబంధనలను ఉల్లంఘించిందని సీబీఐ (CBI) కేసు నమోదు చేసి ప్రబీర్‌ నివాసం, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించి ఆస్తులను జప్తు చేసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z