Politics

ఫిబ్రవరిలోనే షెడ్యూల్‌

ఫిబ్రవరిలోనే షెడ్యూల్‌

ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన రాష్ర్టాలను గెలుచుకున్న బీజేపీ అదే ఊపు మీద లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుత లోక్‌సభ గడువు ముగియడానికి ఒక నెలన్నర రోజుల ముందే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్‌ 16 వరకు ఉన్నది. ఆ లోగా షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ మే నెలల మధ్యలో ఎన్నికలు నిర్వహించాలి. కానీ ఎన్నికల ప్రక్రియను మార్చి ఏప్రిల్‌ నెలల్లోనే ముగించి మే మొదటి వారంలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరే విధంగా బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి మొదటివారంలోనే పార్లమెంట్‌లో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, అదే నెల 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నారని చెప్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా రాష్ర్టాల అసెంబ్లీల గడువు కూడా 2024 జూన్‌ వరకు ఉన్నది. సార్వత్రిక ఎన్నికలతో పాటే ఈ రాష్ర్టాలకు కూడా ఎన్నికలు జరిపే అవకాశం ఉంది. ఈ అంచనాలతోనే ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్మోహన్‌రెడ్డి ముందస్తు ఎన్నికలపై తన క్యాబినెట్‌ సహచరులకు హింట్‌ ఇచ్చి ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణాదిలోని తెలంగాణ మినహా ఉత్తరాదిలోని రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించింది. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ గ్రాఫ్‌ పడిపోయింది. బీజేపీ పట్ల సానుకూల పవనాలు వీస్తున్న ప్రస్తుత తరుణంలోనే లోక్‌సభ ఎన్నికలను కూడా ముగించాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం. గడువు ప్రకారం ఏప్రిల్‌-మే వరకు ఆగితే.. ఇప్పటి ఊపు తగ్గే ప్రమాదం ఉంటుందని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌, అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడటం లోక్‌సభ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

మరోవైపు ఇండియా కూటమిలో లుకలుకలు సైతం తమకు కలిసి వస్తాయని భావిస్తున్నట్టు తెలిసింది. మధ్యప్రదేశ్‌లో సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్‌- సమాజ్‌వాదీపార్టీకి మధ్య విభేదాలు తలెత్తాయి. కాంగ్రెస్‌ ఒంటెత్తు పోకడల పట్ల ఇండియా కూటమిలోని మిగతా పార్టీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఇప్పటికే కేరళలో సీపీఎంతో, ఢిల్లీ, పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్‌కు పొసగడం లేదు. కూటమి ఏర్పాటుకు కృషి చేసిన బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ ఈ మధ్య అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కూటమి మళ్లీ ఐక్యతా రాగం వినిపించకముందే ఆయా పార్టీలను ఎన్నికల రంగంలోకి దించాలన్నది బీజేపీ వ్యూహంగా ఉన్నట్టు తెలుస్తున్నది.

హింట్‌ ఇచ్చిన ఏపీ సీఎం జగన్‌…..‘గతంలో కంటే ఈ సారి 20 రోజుల ముందుగానే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావొచ్చు’ అని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి హింట్‌ ఇవ్వడంతో ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు జగన్‌ వ్యాఖ్యానించారు. అన్ని కార్యక్రమాలు ఫిబ్రవరి మొదటి వారంలోగా పూర్తి చేయాలని మంత్రులను ఆదేశించారు. కేంద్రంలోని బీజేపీతో జగన్‌కు ఉన్న సత్సంబంధాలరీత్యా సార్వత్రిక ఎన్నికల ముందస్తుపై ఆయనకు కచ్చితమైన సమాచారం ఉండే ఉంటుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఏపీ క్యాబినెట్‌ సమావేశంలో 46 కీలక అంశాలపై చర్చించారు. సామాజిక పెన్షన్‌ను రూ.2,750 నుంచి 3 వేలకు పెంచడానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నది. ఈ పెంపు ఈ నెల 18 నుంచి అమలులోకి తీసుకురావాలని, ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకున్న రోగులకు మందులను డోర్‌ డెలివరీ చేయాలని నిర్ణయించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z