DailyDose

శంషాబాద్‌లో దోపిడీ దొంగల హల్ చల్- నేర వార్తలు

శంషాబాద్‌లో దోపిడీ దొంగల హల్ చల్- నేర వార్తలు

* బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో దారుణం

బిహార్‌లోని (Bihar) గోపాల్‌గంజ్‌లో (Gopalganj) దారుణం చోటు చేసుకుంది. స్థానిక దేవాలయంలో పూజారిగా పని చేస్తున్న మనోజ్‌ కుమార్‌ (32)ని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. స్థానికులు సమాచారమివ్వడంతో శనివారం సాయంత్రం దేవాలయం సమీపంలోని పొదల నుంచి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహంపై గాయాలను గుర్తించారు. హత్య విషయం తెలుసుకున్న దానాపుర్‌ గ్రామస్థులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఈ దారుణానికి పోలీసుల వైఫల్యమే కారణమంటూ నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిని నిర్బంధించారు. అక్కడికి వచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వారు. వాళ్ల వాహనానికి నిప్పుపెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది.మనోజ్‌కుమార్‌ కనిపించడం లేదంటూ ఆయన కుటుంబ సభ్యులు మంగళవారమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే, హత్య ఎప్పుడు జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. మనోజ్‌కుమార్‌ సోదరుడు గతంలో భాజపా కార్యకర్తగా పని చేశారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గోపాల్‌గంజ్‌లో పరిస్థితులు ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. గ్రామంలో అదనపు బలగాలను మోహరించామన్నారు.

శంషాబాద్‌లో దోపిడీ దొంగల హల్ చల్

రోడ్డు పై వెళ్తున్న మినీ డీసీఎంని గుర్తు తెలియని దుండగులు అడ్డగించి డ్రైవర్, క్లీనర్ లపై దాడి చేసి నగదుతో పరారైన ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లూరు ఎక్స్ రోడ్ పై జరిగింది. శంషాబాద్ సీఐ శ్రీధర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వనపర్తికి చెందిన అశోక్, రాములు ఇద్దరు (TS 32 T 5986) అనే అశోక్ లేల్యాండ్ మినీ డీసీఎంలో గొర్రెలను తీసుకొని వరంగల్ స్టేషన్ గన్ పూర్ లో అమ్మాడు.తిరిగి ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద దిగి వనపర్తి వెళ్లేందుకు పాలమాకుల వైపు వస్తుండగా గొల్లూర్ ఎక్స్ రోడ్డు వద్దకు రాగానే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి డీసీఎం ని అడ్డగించి కత్తులతో బెదిరించారు. డీసీఎంలో ఉన్న అశోక్, రాములు పై దాడి చేసి అందులో ఉన్న 1.35 లక్షల నగదును గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ కుమార్ తెలిపారు.

సుక్మాలో ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఆదివారం నక్సలైట్లు, బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్‌కు చెందిన 165వ బెటాలియన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌రెడ్డి వీరమరణం పొందారు. మరో కానిస్టేబుల్‌ రాముకు గాలయ్యాయి. గాయపడ్డ రాముకు ప్రథమి చికిత్స అందించి.. చికిత్స నిమిత్తం ఆసుప్రతికి తరలించారు. ఇదిలా ఉండగా.. నలుగురు అనుమానితులను బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.సంఘటనా స్థలంలో సీఆర్పీఎఫ్‌, కోబ్రా, జిల్లా పోలీస్‌ బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి. సుక్మా జిల్లా జాగర్‌గుండలో సీఆర్పీఎఫ్ 165వ బెటాలియన్‌కు చెందిన మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన సబ్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి నివాళులర్పించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన జవాన్ రాముకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు.

నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి మృతి

బీచ్‌లో స్నానానికి వెళ్లి నూజివీడు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి మృతి చెందాడు. ఆదివారం ఉదయం మచిలీపట్నం తాళ్లపాలెం బీచ్‌ వద్దకు ఐదుగురు విద్యార్థులు స్నానానికి వెళ్లారు. భారీ అలల తాకిడికి గురై వీరంతా కొట్టుకుపోయారు. వీరిలో నలుగురిని మెరైన్ పోలీసులు రక్షించారు. గల్లంతైన విద్యార్థి అఖిల్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించి వెలికి తీశారు.

బస్సు వెనుక చక్రాలు లేకుండా పరుగులు తీయడంతో కలకలం

 సేలం సమీపంలో రోడ్డుపై వెళ్తున్న బస్సు వెనుక చక్రాలు లేకుండా పరుగులు తీయడంతో కలకలం రేపింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.సేలం ఎడప్పాడి సమీపంలోని వెల్లండి వలసకు చెందిన విజయన్‌ ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను గురువారం సాయంత్రం సేలం కొత్త బస్‌ స్టేషన్‌ నుంచి ఎడప్పాడికి ప్రయాణికులను తీసుకెళ్తుండగా బస్సులో కండక్టర్‌ కదిర్‌తో సహా చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు అరియలూర్‌ సమీపంలో ప్రయాణిస్తున్నప్పుడు, బస్సు ముందు భాగం ఒక్కసారిగా పేలిపోవడంతో బస్సు అదుపుతప్పి పరుగెత్తింది.ఈ పరిస్థితిలో క్షణాల్లోనే బస్సు వెనుక యాక్సిల్‌ విరిగిపోవడంతో వెనుక చక్రాలు బస్సు నుంచి విడిపోవడంతో వెనుక టైర్లు లేకుండానే బస్సు కొద్ది దూరం వెళ్లింది. భయంకరమైన శబ్ధం చేస్తూ బస్సు వేగంగా రోడ్డుపైకి దూసుకెళ్లడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై కేకలు పెట్టారు. వెంటనే డ్రైవర్‌ చాకచక్యంగా బస్సును నిలిపివేశాడు. దీంతో ప్రయాణీకులు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

మహారాష్ట్రలోని ఓ సోలార్‌ కంపెనీలో పేలుడు 

మహారాష్ట్రలోని ఓ సోలార్‌ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. నాగ్‌పుర్‌ బజార్‌గాన్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్యాస్ట్‌ బూస్టర్‌ ప్లాంట్‌లో ప్యాకింగ్‌ సమయంలో పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z