WorldWonders

రెండు అరటిపళ్ల ధరకు చుక్కలు

Rahul Bose Shocked With 443 Rupees Bill For Two Bananas

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. కానీ, అంతకంతకూ పెరుగుతున్న ధరల దెబ్బకు సామాన్యుడు వాటివంక కన్నెత్తి చూడాలంటేనే వణికిపోతున్నాడు. జేబుకు చిల్లు పడుతుందేమోనని జాగ్రత్త పడుతున్నాడు. సంపన్నులకు అలాంటిదేం ఉండదు. ఎంతంటే అంత పెట్టి కొంటారు. అయితే, బాలీవుడ్‌ నటుడు రాహుల్‌ బోస్‌కు మాత్రం ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. జిమ్‌ చేసిన అనంతరం రెండు అరటి పండ్లు ఆర్డర్‌ ఇచ్చిన అతను బిల్‌ చూసి కళ్లు తేలేశాడు. రెండు బనానాలకు ఏకంగా రూ.443 బిల్‌ చేశారు. ‘పండ్లు కూడా చెడు చేస్తాయనడానికి ఇదే ఉదాహరణ. ఇంత ధరపెట్టి కొంటే బాధగా ఉండదా..!’ అని ట్విటర్‌లో ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. వాటిపై జీఎస్‌టీ కూడా వేశారని పేర్కొన్నాడు.బోస్‌ ట్వీట్‌పై కొందరు కామెంట్లు చేశారు. తాజా పండ్లపై జీఎస్‌టీ వేయడం అన్యాయమని ఒకరు.. పట్టపగలే దోచేస్తున్నారని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అయినా, భారీ మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్న ఆ హోటల్‌ ఉండటమెందుకు.. వేరొక లగ్జరీ రూమ్‌లోకి షిఫ్ట్‌ కావొచ్చు కదా’ అని ఇంకొకరు బోస్‌కి సలహా ఇస్తున్నారు. ‘సినిమా హాళ్లలో కూడా అడ్డగోలుగా దోచుకుంటున్నారు. టికెట్లు, పాప్‌కార్న్‌కు భారీగా వసూలు చేస్తున్నారు. నువ్‌ మరో హోటల్‌కి మారడం మంచిది. అరటి పండ్లు బయట కూడా దొరుకుతాయి. అక్కడ కొనుక్కో’అని ఇంకో అభిమాని సూచించాడు. దిల్‌ దడ్కనే దో, మిస్టర్‌ అండ్‌ మిసెస్ అయ్యర్‌, ది జపనీస్‌ వైఫ్‌, విశ్వరూపం-2 సినిమాల్లో బోస్‌ నటించారు.