Health

వానాకాలం తేమ చాలా ప్రమాదకరం

Stay Away From Moisture During Rainy Season

వానలతో పాటు వ్యాధులూ వేధిస్తాయి. చల్లని వాతావరణంలో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేమిటంటే…..
*మర్దన!
ఆయుర్వేద క్యాలెండర్లో వర్ష రుతువు నాలుగోది. తడి వాతావరణం శరీరంలో అసమతుల్యతలను కలిగిస్తుంది. ఫలితంగా అజీర్తి, కీళ్ల నొప్పులు వేధిస్తాయి. ఈ ఇబ్బందులను అధిగమించాలంటే నూనెతో కూడిన మర్దనలను ఆశ్రయించాలి. మర్దన వల్ల కణాలు ఉత్తేజితమై, రక్తప్రసరణ మెరుగుపడి జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే నాడుల మూలాలూ ప్రేరేపితమవుతాయి. శిరోధార మర్దన వల్ల కళ్లు సేద తీరి చక్కని నిద్ర పడుతుంది. అయితే మర్దన కోసం వేర్వేరు నూనెలను కలిపి వాడాలి.
*వెచ్చగా, శుభ్రంగా!
తేమతో కూడిన చల్లని వాతావరణం పలు రకాల శ్వాసకోశ, వైరల్ ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది. కాబట్టి ఒంటిని వెచ్చగా ఉంచుకోవాలి. విటమిన్ ‘సి’ సప్లిమెంట్లు వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. అయితే వైద్యుల సూచన మేరకే వాటిని తీసుకోవాలి. తేమ వాతావరణంలో హెపటైటిస్, టైఫాయిడ్లు విజృంభిస్తాయి. కాబట్టి కాచి చల్లార్చిన నీళ్లు, వేడి పదార్థాలు తీసుకోవాలి. వానలో తడిచిన వెంటనే స్నానం చేయాలి.
*ఇవి తినాలి!
శరీర మెటబాలిజం (శక్తిని ఖర్చు చేసుకునే వేగం) ఈ కాలంలో తగ్గుతుంది. కాబట్టి మరీ వేడిగా లేదా మరీ చల్లగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి. ఇలాంటి ఆహారం జీర్ణశక్తిని కుంటుపరుస్తుంది. కాబట్టి వెచ్చగా ఉండే తాజా ఆహారాన్ని మితంగా తినాలి. తేలికగా అరిగే పదార్థాలే తినాలి. వేపుళ్లు, కారం, ఉప్పు, మసాలాలు తగ్గించాలి. ఈ కాలంలో ఆకుకూరల వాడకం తగ్గించడం మేలు. ఎండబెట్టిన ఉసిరి, పుసుపు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, కరివేపాకు వాడకం పెంచాలి. వీటితో రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
*వ్యాధినిరోధకశక్తి
వ్యాధినిరోధకశక్తిని పెంచడం కోసం శొంఠి పొడి, ధనియాల పొడి, ముతంగ, పతిముగం, కరింగాళిలను సమపాళ్లలో తీసుకుని ఒక లీటరు నీటిలో కలిపి పది నిమిషాల పాటు మరిగించాలి. చల్లారిన తర్వాత వడగట్టి రోజంతా నీటికి బదులుగా ఈ కషాయాన్ని తాగుతూ ఉండాలి.
*చర్మ సమస్యలు
ఐదు నిమ్మ ఆకులు, చెరొక టీస్పూను పసుపు, కనికొన్న బెరడు తీసుకుని బక్కెటు నీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేయాలి.