Sports

పంజాబ్ కోచ్‌గా కుంబ్లే

Kumble To Coach Kings XI Punjab Team

టీమిండియా మాజీ కోచ్‌, స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే ఐపీఎల్‌లో కింగ్స్‌ XI పంజాబ్‌ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆ జట్టు యాజమాన్యంతో ప్రస్తుతం తుది విడత చర్చలు జరుపుతున్నాడని ఓ పత్రిక పేర్కొంది. పంజాబ్‌ జట్టు యాజమాన్యం త్వరలో నిర్వహించే సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కుంబ్లే గతంలో ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లకు మార్గదర్శిగా వ్యవహరించాడు. అలాగే భారత జట్టుకు ఏడాది పాటు ప్రధాన కోచ్‌గా కొనసాగాడు. కోహ్లీతో విభేదాల కారణంగా పదవి నుంచి తప్పుకొన్నాడు. కుంబ్లే నేతృత్వంలో టీమిండియా కరీబియన్‌ పర్యటనలో అద్భుతంగా రాణించడం విశేషం. అలాగే స్వదేశంలోనూ 2016-2017 సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో 2017 ఛాంపియన్స్‌ ట్రోఫి ఫైనల్లో పాక్‌ చేతిలో టీమిండియా ఓటమిపాలైన మరుసటి రోజే కుంబ్లే తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అదే సమయంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో బేధాభిప్రాయాలు రావడం చర్చనీయంశంగా మారింది.