DailyDose

జగన్‌పై జేసీ సంచలన ఆరోపణలు-తాజావార్తలు-11/07

JC Diwakar Reddy Slams Jagan-Telugu Breaking News Today-11/07

* మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని.. తాము పార్టీలో చేరితే కేసులుండవని చెబుతున్నారని ఆరోపించారు. కొందర్ని ఆర్థికంగా, మానసికంగా శిక్షిస్తున్నారని.. చింతమనేనిపై రోజుకో కేసు పెడుతున్నారని మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన జగన్‌పై ఆరోపణలు చేశారు.దివాకర్ ట్రావెల్స్ బస్సుల సీజ్‌పై కూడా జేసీ మండిపడ్డారు.
*బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుపాను తీవ్ర రూపం దాల్చనుంది. తూర్పు బంగాళాఖాతం దానికి అనుకోని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం పై తుపాను కేంద్రీకృతమైంది. పారాదీప్ కు దక్షిణ ఆగ్నేయంగా 750, సాగరదీవులు 860కిమీల దూరంలో ఉంది.
* ఆర్టీసీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు తప్పుడు సమాచారం ఇచ్చిందని.. ఈ అంశాన్ని తాము గతంలోనే చెప్పామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ అంశంలో అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ తాజాగా హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు.
* ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)కు ఆరంభం వేడుకలకు సంబంధించి భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఐపీఎల్‌ ఆరంభం వేడుకల్ని జరపకూడదని నిర్ణయించినట్లు సమాచారం. ప్రతీ ఏడాది ఘనంగా జరిగే ఈ వేడుకలకు సినీ సెలబ్రెటీలు హాజరవుతారు. బాలీవుడ్‌ తారల హంగామాతో సాగే ఆరంభ సంబరానికి సుమారు రూ. 30 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఫ్యాన్స్‌ కూడా పెద్దగా ఆసక్తి ప్రదర్శించకపోవడంతో వృథా ఖర్చును తగ్గించుకోవాలని ఐపీఎల్‌ పాలక వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.గత ఐపీఎల్‌ సీజన్‌కు సంబంధించిన ఓపెనింగ్ సెలబ్రేషన్స్‌ను బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన బాధితులకు సంతాపంగా వేడుకలను రద్దు చేసి.. ఆ నిధులను నిధులను ప్రభుత్వానికి అందించింది. అందులో రూ.11 కోట్లను భారత ఆర్మీకి, రూ.7 కోట్లు సీఆర్పీఎఫ్‌కు, రూ.1 కోటి చొప్పున నేవీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ కు అందజేసింది.
* పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో దాఖలైన పిటిషన్లపై ఇవాళ విచారణ జరిగింది. పోలవరం ప్రాజెక్టు వ్యర్థాల డంపింగ్‌పై పెంటపాటి పుల్లారావు పిటిషన్‌ దాఖలు చేయగాప్రాజెక్టు ముంపు ప్రాంతాల ప్రభావంపై పొంగులేటి సుధాకర్ రెడ్డి పిటిషన్‌ వేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి బీపీ పాండే ఇవాళ్టి విచారణకు హాజరయ్యారు
* వరుస ఓటముల తర్వాత సొంతగడ్డపై బోణీ కొట్టిన హైదరాబాద్‌ ఎఫ్‌సీ మళ్లీ పరాజయ బాట పట్టింది. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీ ఆరో సీజన్‌లో మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది.
* ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండో రోజు భారత షూటర్లు ఎనిమిది పతకాలు గెలిచారు. బుధవారం కైనన్‌ చెనాయ్‌, మానవ్‌జిత్‌ సంధు, పృథ్వీరాజ్‌లతో కూడిన పురుషుల ట్రాప్‌ జట్టు 357 స్కోరుతో రజతం గెలిచింది. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌లో అనిష్‌, భవేశ్‌, ఆదర్శ్‌లతో కూడిన జట్టు (1716) కాంస్యం గెలుచుకుంది.
* కర్నూలు జిల్లా నందికొట్కూరులో మంత్రి అనిల్‌కుమార్‌ను శ్రీశైలం ముంపు బాధితులు అడ్డుకున్నారు. శ్రీశైలం నుంచి కర్నూలుకు వస్తున్న మంత్రి అనిల్‌కుమార్‌ కాన్వాయ్‌ను ముంపు బాధితులు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బాధితులు మంత్రికి వినతిపత్రం సమర్పించారు
* హీరాగోల్డ్‌ కేసులో సీసీఎస్‌ పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్‌కు ముంబయిలో బినామీలు ఉన్నట్లు తాజాగా గుర్తించారు.
* జాసమస్యలను పరిష్కరిస్తాం రాష్ట్ర మంత్రి పేర్ని నాని జాయింట్ కలెక్టర్ మాధవిలతవార్డుల్లో అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.
* పెరిగిన ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు, అక్రమ నిల్వలను మార్కెట్‌లోకి తెచ్చేందుకు ఏపీ వ్యాప్తంగా విజిలెన్స్‌ అధికారులు ఏకకాలంలో ఆకస్మిక తనికీలు చేశారు. 70 ఉల్లి వ్యాపార సముదాయాలపై సోదాలు నిర్వహించారు.
* బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం 2019, నవంబర్ 06వ తేదీ బుధవారం తుఫాన్‌గా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్ 07వ తేదీ గురువారం మరింత తీవ్రమై పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌ల వైపు వెళుతుందని తెలిపింది.
* అయోధ్య కేసు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో అనవసర వ్యాఖ్యలు చేయొద్దని కేంద్ర మంత్రులకు సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలో స్నేహపూర్వక, సామరస్య వాతావరణాన్ని కొనసాగించాలని పేర్కొన్నారు.
* పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు ఒప్పందం రద్దు విషయంలో… గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులను సింగిల్ జడ్జి ఎత్తివేయడాన్ని సవాలు చేస్తూ… నవయుగ హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్‌ చేసింది.
* భూముల్ని ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు కేటాయించేటప్పుడు ఎలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారో తెలియచేయాలంటూ… రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూ కేటాయింపులకు సంబంధించి నిబంధనలు ఏమిటన్న అంశంపై పూర్తిస్థాయి వివరాలు అవసరమని కోర్టు అభిప్రాయపడింది.
* మద్యం కొనుగోలు చేసిన వారికి ప్రింటెడ్‌ బిల్లులు ఇవ్వాలి :రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ ముడావత్‌ మల్లికార్జున నాయక్‌
గుంటూరు కార్పొరేషన్‌,:షాపులలో మద్యం కొనుగోలు చేసిన వారికి ప్రింటెడ్‌ బిల్లులు ఇవ్వాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ ముడావత్‌ మల్లికార్జున నాయక్‌ ఆదేశించారు.
*అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) రాత పరీక్ష ఈ నెల 17న నిర్వహిస్తున్నట్లు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ అమిత్ గార్గ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 పోస్టుల భర్తీకి 2,488 మంది దరఖాస్తు చేసుకున్నారు.
*బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న దేశాలు కలిసికట్టుగా అభివృద్ధి చెందడానికి అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవడానికి ఈ నెల 7, 8 తేదీల్లో విశాఖపట్నంలో పోర్టుల సదస్సును నిర్వహిస్తున్నారు. బిమ్స్టెక్ పోర్టుల సదస్సు పేరిట నిర్వహించనున్న ఈ సదస్సుకు విశాఖపట్నం పోర్టు తొలిసారిగా ఆతిథ్యం ఇస్తోంది.
*దేశంలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల సందర్శన ఇక సులభం కానుంది. ప్రత్యేకంగా పర్యాటక యాత్రలకు ఉద్దేశించిన ‘భారత్ దర్శన్ రైలు’ తెలుగు రాష్ట్రాల సొంతం అవుతోంది.
*ఎన్నో అడ్డంకులను అధిగమించి కాళేశ్వరం పథకాన్ని నిర్మించినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కాళేశ్వరం పథకంలో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మిస్తున్న అనంతగిరి జలాశయం వల్ల చిన్నకోడూరు మండలం చెల్కలపల్లి మధిర గ్రామం కొచ్చగుట్టపల్లి ముంపునకు గురవుతుండగా అక్కడి నిర్వాసితులకు సిద్దిపేట పట్టణంలోని లింగారెడ్డిపల్లిలో పునరావాస కాలనీ నిర్మించారు. దీనిని హరీశ్రావు బుధవారం ప్రారంభించారు.
*రబీ (యాసంగి) సీజన్ ప్రారంభమై నెల దాటినా పంటల సాగు పుంజుకోలేదు. బుధవారం నాటికి సాధారణం కంటే లక్షా 12 వేల ఎకరాలు తక్కువగా సాగైంది. వ్యవసాయశాఖ విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. గత నెల ఒకటిన రబీ సీజన్ ప్రారంభమయ్యాక..ఇప్పటిదాకా 3.65 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉంది. కానీ బుధవారం నాటికి 2.53 లక్షల ఎకరాల్లోనే పంటలు వేశారు.
*రాజరాజేశ్వర జలాశయం (మధ్యమానేరు) కట్ట మరమ్మతులు నాలుగు రోజుల్లో పూర్తి చేసి జలాశయంలో పూర్తి సామర్థ్యం 25.873 టీఎంసీల నీటిని నిల్వ చేస్తామని ప్రాజెక్టు ఈఎన్సీ అనిల్కుమార్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు జలాశయం రివర్స్లూయిస్ వద్ద సిమెంట్ తొలగింపు పనులను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జలాశయంలో 2.25 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు చెప్పారు.
*రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 39 మంది అధ్యాపకులను హేతుబద్ధీకరణ ద్వారా ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ బదిలీ చేశారు. రాష్ట్రంలో పనిభారం, అవసరం ప్రాతిపదికన అధ్యాపకుల హేతుబద్ధీకరణ చేయడం 2009 తర్వాత ఇదే మొదటిసారి.
*నల్లమలలో యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని, ఈ అంశంపై ప్రధాని మోదీ తన వైఖరి తెలపాలని అఖిల భారత విద్యార్థి, యువజన సంఘాల ఐకాస నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఐకాస ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ ఎదుట బుధవారం ఆందోళన నిర్వహించారు.
*విదేశాల్లోని ప్రవాస పారిశ్రామికవేత్తలు తెలంగాణలో ఐటీ పరిశ్రమలు స్థాపించి గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కోరారు. ఈ పరిశ్రమలకు ప్రభుత్వపరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
* తహసీల్దార్‌ విజయారెడ్డి హత్యకేసులో నిందితుడు సురేశ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు ఉస్మానియా ఆస్పత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ రఫి తెలిపారు.