Sports

జమ్ముకాశ్మీర్ క్రికెట్ అభివృద్ధికి నాది బాధ్యత

Ganguly Promises Jammu Kashmir Cricket Development

జమ్మూకశ్మీర్‌ క్రికెట్‌ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ హామీ ఇచ్చారు. ఆ సంఘం సీనియర్‌ అధికారితో పాటు కెప్టెన్‌ పర్వేజ్‌ రసూల్‌, మెంటార్‌ ఇర్ఫాన్‌ ఫఠాన్‌ సోమవారం ముంబయిలోని బీసీసీఐ కార్యాలయంలో గంగూలీని కలిశారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో క్రికెట్‌ అభివృద్ధికి సహకరించాలని కోరారు. సానూకూలంగా స్పందించిన దాదా అక్కడి అభివృద్ధికి పూర్తి భరోసానిచ్చారు. ‘మావాళ్లు చెప్పినవన్నీ గంగూలీ విన్నారు. స్థానిక క్రికెట్‌ అభివృద్ధికి సహకరిస్తామని భరోసా ఇచ్చారు. అలాగే జమ్మూకశ్మీర్‌లో క్రికెట్‌ నిర్వహణకు తగిన సదుపాయాలు కల్పించాలని కోరాము. మరోసారి జమ్మూలో స్థానిక మ్యాచ్‌లు ఆడాలని భావిస్తున్నాము. మాకు అక్కడ ఓ కళాశాల మైదానం ఉంది. దాన్ని అభివృద్ధి చేసి, సరైన సదుపాయాలు కల్పిస్తాం. తద్వారా ఫస్ట్‌ క్లాస్ మ్యాచ్‌లు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది’ అని భేటీ అనంతరం ఆ సంఘం అధికారి పేర్కొన్నాడు.ఇటీవల జమ్మూకశ్మీర్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో తలెత్తిన సంక్షోభంపై స్పందించిన ఆ అధికారి.. మరో నెలన్నర రోజుల్లో అంతా సద్దుమణిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని గంగూలీకి స్పష్టం చేశామని తెలిపాడు. కాగా, జమ్మూకశ్మీర్‌ సీనియర్ జట్టు ప్రస్తుతం సూరత్‌లో సయ్యద్‌ ముస్తక్‌ అలీ ట్రోఫీ ఆడుతోంది. కెప్టెన్‌ పర్వేజ్‌ రసూల్‌ అందుబాటులో లేకపోవడంతో శుభంపందిర్‌ ఆ జట్టును నడిపిస్తున్నాడు.