Agriculture

నారుమడులు వేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

How To Rise Paddy Seedlings Properly-Telugu Agriculture News Tips

యాసంగి సాగులో రైతులు ఎక్కువగా దొడ్డు గింజ రకాల సాగువైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టి లో ఉంచుకొని స్వల్పకాలిక రకాలైన (120-130 రోజుల పంట కాలం) కూనారం సన్నాలు (కేఎన్‌ఎం. 118), బతుకమ్మ (జేజీఎల్‌-18047), ఎంటీయూ 1010 (కాటన్‌దొర సన్నాలు), ఐఆర్‌-64, భద్రకాళి(డబ్ల్యుజీఎల్‌-3962) తెల్ల హంస వంటి రకాలను సాగు చేసుకోవచ్చని కూనారం వ్యవసాయ పరిశోధనా కేంద్రం వారు తెలిపారు. చలి ఉధృతిని బట్టి పంట కాలం 10 నుంచి 15 రోజుల వరకు పెరిగే అవకాశముంది. అందువల్ల చలి ప్రభావం నారుమళ్లపై పడకుండా ప్రత్యేక నారుమడి యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతులకు సూచిస్తున్నారు.
***తీసుకోవాల్సిన జాగ్రత్తలు
*రైతులు చలికి తట్టుకునే వరి వంగడాలను ఎంపిక చేసుకోవాలి.
*నారుమడిలో మండె కట్టిన విత్తనాలను వేయడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి
*నారుపోసుకునే ముందు నారు మడికి సరిపడా సుమారు 2 క్వింటాళ్లు బాగా మాగిన పశువుల ఎరువు/కోళ్ళ ఎరువు, కిలో జింక్‌ సల్ఫేట్‌ తప్పని సరిగా వేసుకోవాలి.
*భాస్వరాన్ని రెట్టింపు మెతాదులో వేసుకోవాలి.
*రాత్రిపూట నారుమడిలో నీళ్లు లేకుంటే చలి ప్రభావం మొక్కలపై తగ్గుతుంది. కాబట్టి ప్రతిరోజూ పొద్దుగాల, పగటిపూట వెచ్చని నీటిని పెట్టి సాయంత్రం తీసివేయాలి,
*చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నారుమడి చుట్టు ఒక అడుగు ఎత్తులో పలుచ ని పాలిథీన్‌ షీట్‌ లేదా ఖాళీ ఎరువుల సంచులతో కుట్టిన పట్టాలను సాయంత్రం వేలలో కప్పి ఉదయం పూట తీసివేయాలి.
*రాత్రి ఉష్ణోగ్రతలు 10డిగ్రీల కంటే తగ్గినప్పుడు చలి తీవ్రత పెరిగి నారు ఎర్రబడడం, సరిగ్గా ఎదగకపోవడం పంట కాలం పెరిగిపోవడం, పోషకలోపాలు ముఖ్యంగా జింక్‌ లోప లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నది.
*ఈ జింక్‌ లోపం వల్ల ఆకులపై తుప్పు మచ్చలు ఏర్పడుతాయి. ఈ లోప నివారణకుగాను లీటరు నీటికి 2గ్రాముల జింక్‌ సల్ఫేట్‌ కలిపి పిచికారీ చేసుకోవాలి.
*చలి తీవ్రత ఎక్కువగా ఉంటే స్వర్ణఫాల్‌/పార్ములా -4వంటి సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని 5రోజుల వ్యవధిలో 2సార్లు పిచికారీ చేసుకోవాలి.
*కాండం తొలిచే పురుగు బారి నుంచి నారును కాపాడుకునేందుకు, నారు తీయడానికి వారం రోజుల ముందు, 5సెంట్ల నారుమడికి 800గ్రాముల కార్బోఫ్యూరాన్‌ 3జి గుళికలు వేయాలి.
*చలి తీవ్రత ఎక్కువగా ఉంటే అగ్గితెగులు ఆశించే అవకాశం ఉన్నది. ముందు జాగ్రత్తగా లీటరు నీటికి 0.6గ్రాముల ట్రైసైక్లోజోల్‌ను కలిపి పిచికారీ చేయాలి.
*ఈపద్ధతులను రైతులు పాటిస్తే ఆరోగ్యవంతమైన నారు పెంచుకొని, తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.