NRI-NRT

అమరావతి ఉద్యమానికి ₹7లక్షలు అందించిన న్యూజెర్సీ ప్రవాసులు

New Jersey Amaravati JAC Sends 7Lakhs To Protests For Capital

రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న దీక్షలకు సంఘీభావంగా అమెరికా న్యూజెర్సీలోని ప్రవాసాంధ్రులు ఆర్థిక సాయం ప్రకటించారు. ‘న్యూజెర్సీ అమరావతి పరిరక్షణ ఐకాస’ తరఫున నాట్స్‌ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన కృష్ణ రూ.7,76,022 మొత్తానికి సంబంధించిన చెక్‌ను తెదేపా అధినేత చంద్రబాబు చేతులు మీదుగా అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నాయకులకు అందజేశారు. ఐకాస అధ్యక్షుడు శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతిరావు, అధికార ప్రతినిధి ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు, సోషల్ మీడియా విభాగాధిపతి పి.కిరణ్ హాజరై ఈ చెక్‌ అందుకుని ఐకాస తరఫున ప్రవాసాంధ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. అమరావతి కోసం ఐకాస చేస్తున్న పోరాటం మరింత ఉద్ధృతం చేయాలని మన్నవ మోహన్‌ కృష్ణ ఈ సందర్భంగా కోరారు. రాజధాని పోరులో న్యాయపరమైన, చట్టపరమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రతాప్ చింతపల్లి అన్నారు. రాజధాని పోరాటానికి ప్రవాసాంధ్రులు వెన్నంటి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూజెర్సీ అమరావతి ఐకాస తరఫున కొసరాజు విజయబాబు, చింతపల్లి ప్రవీణ్, రవి తదితరులు పాల్గొన్నారు.