Movies

తాప్సీ ఢిల్లీ లొల్లి

Tapsee Pannu Slaps Netizen Over Citizenship And Residence

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బాలీవుడ్‌ నటి తాప్సీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అయితే, ముంబయిలో నటిగా పనిచేస్తున్న తాప్సీకి దిల్లీలో ఓటెందుకు? ఆమె తన ఓటును ముంబయికి మార్చుకోవాలంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ‘‘ముంబయిలో నివాసం ఉంటున్న మీరెందుకు మా భవితవ్యాన్ని నిర్ణయిస్తున్నారు? తాప్సీ చాలా కాలం నుంచి ముంబయిలోనే ఉంటున్నప్పటికీ ఆమె తన ఓటును ఎందుకు అక్కడికి మార్చుకోలేదు. ఆమె తన ఓటును ముంబయికి బదిలీ చేసుకోవాలి’’ అని నెటిజన్‌ పేర్కొన్నాడు. దీనికి తాప్సీ ఘాటుగా స్పందిస్తూ తన పౌరసత్వం గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు. తాను ముంబయి కంటే దిల్లీలోనే ఎక్కువగా ఉంటున్నట్టు స్పష్టంచేశారు. తన ఆదాయపు పన్ను కూడా దిల్లీలోనే చెల్లిస్తున్నట్టు చెప్పిన నటి.. ‘‘దయచేసి నా పౌరసత్వం గురించి ప్రశ్నించొద్దు. మీ గురించి.. మీరు అందిస్తున్న సేవల గురించి ఆలోచించుకోండి. ఒక అమ్మాయిని దిల్లీ నుంచి బయటకు తీసుకురావొచ్చు.. కానీ ఆ అమ్మాయి నుంచి దిల్లీని విడదీయలేరు. నేను ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పాల్సింది మీరు కాదు. నాకు దిల్లీతో ఉన్న బంధం ఎలాంటిదో చెప్పేందుకు ఈ సమాధానం సరిపోతుందనుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తప్పడ్‌’. అనుభవ్‌ సిన్హా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భర్తను, కుటుంబాన్ని చక్కగా చూసుకునే ఇల్లాలి పాత్రలో తాప్సీ కనిపించనున్నారు. ఈ చిత్రంలో తాప్సీ భర్తగా పవైల్‌ గులాటి నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.