Health

వేసవిలో పానీయం సేవయామి

That mint water on push carts in India during summer

వేసవి వచ్చేసింది. శరీరానికి నీరు చాలా అవసరం. కానీ మంచినీళ్లు ఎన్నని తాగ్గలం. అప్పుడప్పుడూ షర్బత్‌లు తాగితే హాయిగా ఉంటుందనుకునేవారు ఎక్కువమందే ఉంటారు. పల్చటి మజ్జిగలో కాస్తంత కరివేపాకు, అల్లం ముక్కలు వేసుకుని తాగిగా దాహం తీరుతుంది. మరి కాస్తంత శరీరానికి పోషకాలు అందాలంటే రకరకాల షర్బత్‌లను ప్రయత్నించాలి. శరీరానికి అవసరమైన పోషకాలు షర్బత్‌తో లభిస్తాయి. ఒక్కోచోట ఒక్కో ఫ్లేవర్‌తో దొరికే షర్బత్‌లు నోరూరిస్తాయి.
**పానకం:
పానకం అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీరామనవమే. ఆ రోజున చలువ పందిళ్ల దగ్గర ఒక చేతిలో పానకం గ్లాసు, మరో చేతిలో వడపప్పుతో కనిపించే తెలుగు వాళ్లే ఎక్కువ. పానకం కూడా షర్బత్ కేటగిరీలోకే వస్తుంది. వేసవిలో శరీరానికి కావాల్సిన ఖనిజాల్ని అందిస్తుంది. పానకం అంటే సంస్కృతంలో తియ్యని పానీయం అని అర్థం. బెల్లం, నిమ్మరసం, మిరియాలు, యాలకులు కలిపి చేసే పానకాన్ని తాగితే శరీరంలోని వేడి మాయమవ్వాల్సిందే. చక్కెర స్థాయిని సమస్థితిలో ఉంచుతుంది. ఎండ దెబ్బకి చెమట రూపంలో బయటికి పోయిన ఖనిజాలను తిరిగి శరీరానికి పానకం ద్వారా అందించొచ్చు. వేసవిలో రోజూ పానకం తాగినా మంచిదే. పిల్లలకు సాయంత్రం పాలకు బదులు పానకం ఇవ్వడం ఉత్తమం.
**అమ్సులచా
మరాఠీ ప్రజలకు ఇష్టమైన షర్బత్ అమ్సులచా. అమ్సుల్ ఒక పండు పేరు. దీన్ని కొకుమ్ అని కూడా పిలుస్తారు. సిట్రస్ జాతికి చెందిన ఈ పండు చూడడానికి పండు మిరపలా కనిపిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. వాంతులు, వికారపు లక్షణాలను పోగొడుతుంది. ఈ పండుతో చేసే షర్బత్ పేరే అమ్సులచా. అమ్సుల్ పండును మెత్తటి గుజ్జులా చేసి, అందులో మూడు కప్పుల నీళ్లు, చిటికెడు ఉప్పు, చెంచాడు పంచదార కలిపి గిలక్కొడితే షర్బత్ రెడీ. ఎండలో వచ్చిన వారికి చిన్న ఐసుముక్క వేసి అందిస్తే అలసట మాయమౌతుంది.
**సోల్కధి
మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతానికి చెందిన రిఫ్రెష్‌మెంట్ డ్రింక్ ‘ సోల్కధి’. మండే ఎండల్లో శరీరాన్ని చలువ చేసే ద్రావకం ఇది. ఇందులో అమ్సుల్ ( కొకుమ్) పండు నుంచి తీసిన గుజ్జు, కొబ్బరిపాలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేస్తారు. కొంకణి తీరంలో కొబ్బరి పాలు విరివిగా దొరుకుతాయి కాబట్టి ఇదిక్కడ ప్రాచుర్యం పొందింది.
**గోందోరాజ్ గోల్
బెంగాలీల ఔషధ షర్బత్ ఇది. దీని తయారీలో ముఖ్యమైనది ‘గోందోరాజ్ లెబు’… అంటే నిమ్మలో పెద్దన్న. దీనినే మోసంబీ లెబు అని కూడా పిలుస్తారక్కడ. మంచి సువాసన వెదజల్లే ఈ నిమ్మని అనేక వంటకాల్లో వాడతారు. పెరుగు, కొంచెం నీళ్లు, గోందోరాజ్ నిమ్మకాయ రసం, ఉప్పు, పంచదార కలిపి షర్బత్ తయారు చేస్తారు. ఈ షర్బత్ శరీరంపై మంచి ప్రభావాన్ని చూపిస్తుందని వైద్యులు కూడా తేల్చారు. వేసవిలో బెంగాల్ నిండా ఈ షర్బతే దర్శనమిస్తుంది. నోటికి రుచిగా ఉంటూ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందీ పానీయం.
**జిగర్తాండా
వేసవిలో మధురైలో దొరికే ప్రత్యేక పానీయం జిగర్తాండా. ఈ శీతల పానీయాల్ని అమ్మేందుకు ఎన్నో చిల్లర దుకాణాలు, తోపుడు బండ్లు సిద్ధమైపోతుంటాయి. ఇందులో సర్సపరిల్లా అనే మొక్క వేళ్లను వాడతారు. ఈ మొక్క ఔషధ గుణాలు ఉన్నది. మొక్క వేళ్లలో ఆరోగ్యానికి మేలు చేసే లక్షణాలెన్నో ఉన్నాయి. పాలు, బాదం పొడి, నన్నారి అని పిలిచే సర్సపరిల్లా వేరు నుంచి తీసిన సిరప్ వేసి తయారు చేస్తారు. ఈ పానీయాన్ని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందంటారు.