తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ‘తలైవి’ చిత్రంలో తాను ఓ కీలకపాత్రలో కనిపించనున్నానని అలనాటి తార భాగ్యశ్రీ చెప్పారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో కూడా పాల్గొన్నానని.. ఈ విషయాన్ని చిత్రబృందం కావాలనే బయటపెట్టలేదని ఆమె అన్నారు. ఇటీవల ఓ మీడియాకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు.
‘గతేడాది సెప్టెంబర్ నుంచి నేను ‘తలైవి’ షూటింగ్లో పాల్గొంటున్నాను. మైసూర్, చెన్నై, హైదరాబాద్లలో జరిగిన షెడ్యూల్స్లో పలు సన్నివేశాలను నాపై చిత్రీకరించారు. ఈ చిత్రంలో నేను భాగమయ్యాననే విషయాన్ని బయటకు చెప్పని మాట వాస్తవమే..కానీ ఏప్రిల్ నెలలో ఈ విషయాన్ని రివీల్ చేయాలని చిత్రబృందం భావించింది. ఈలోపే లాక్డౌన్ విధించారు. అయితే ఇప్పుడు చిత్రబృందం అనుమతితోనే నేడు ఈ విషయాన్ని బయటపెడుతున్నాను.’ అని భాగ్యశ్రీ తెలిపారు.
అనంతరం ‘తలైవి’ చిత్రంలో తన పాత్ర గురించి స్పందిస్తూ.. ‘ఈ సినిమాలో నేను చాలా కీలక పాత్ర పోషిస్తున్నాను. ‘తలైవి’ జీవితం ఓ ముఖ్యమైన మలుపు తీసుకోవడానికి నా పాత్ర కారణమవుతుంది. పలు సన్నివేశాల కోసం నేనూ, కంగన కలిసి నటించాం. మా ఇద్దరి మధ్య ఉన్న ఆన్స్ర్కీన్ కెమిస్ట్రీ చూసి చిత్రబృందం మురిసిపోయింది. కంగనతో కలిసి పనిచేయడం ఎంతో ఫన్గా అనిపించింది. తను ఒక గొప్ప నటి. చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి చిత్రంతో సెట్లోకి అడుగుపెట్టడం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఈ చిత్రంలో నేను విభిన్నమైన లుక్లో కనిపిస్తాను. ఇప్పటివరకూ నన్ను అలా చూసి ఉండరు.’ అని ఆమె వివరించారు. సల్మాన్ఖాన్తో నటించిన ‘మైనే ప్యార్కియా’ సినిమా భాగ్యశ్రీకి ఎంతో గుర్తింపు తీసుకువచ్చిన విషయం తెలిసిందే.