ScienceAndTech

అవి నకిలీ వార్తలు…నమ్మకండి

అవి నకిలీ వార్తలు…నమ్మకండి

సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఓ నకిలీ వార్తపై ఇండియన్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పందించింది.

చైనాకు చెందిన కొన్ని మొబైల్‌ యాప్స్‌ను భారత్‌లో నిషేధిస్తున్నట్లు పేర్కొంటూ… వాటి పనితీరును పరిమితం చేయాలని టెక్ కంపెనీలకు ప్రభుత్వం సూచిస్తున్నట్లు ఉన్న ఉత్తర్వులు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతమవుతోంది.

యాపిల్‌, గూగుల్‌కు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, జాతీయ సమాచార కేంద్రం (ఎన్‌ఐసీ) ఉత్తర్వులు విడుదల చేసినట్లు ఆ పోస్టు సూచిస్తోంది.

భారతదేశంలో ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ స్మార్ట్‌ఫోన్లలో వినియోగంలో ఉన్న చైనాకు చెందిన 13 యాప్‌ల పనితీరును పరిమితం చేయాలని ఆ పోస్టులో పేర్కొన్నారు.

టిక్‌టాక్‌, లైవ్‌మి, బిగో లైవ్, విగో వీడియో, బ్యూటీ ప్లస్, కామ్‌స్కానర్, క్లాష్ ఆఫ్ కింగ్స్, మొబైల్ లెజెండ్స్, క్లబ్ ఫ్యాక్టరీ, షీన్, రోమ్‌వే, యాప్‌ లాక్, వీమేట్ అప్లికేషన్లను నిషేధిస్తున్నట్లు ఆ పోస్టులో ఉంది.

ఆ పోస్టులో ఉన్న ఉత్తర్వు నకిలీ అని పీఐబీ ట్వీట్‌ చేసింది.

ఆ నకిలీ పోస్టుపై ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో స్పందిస్తూ… ”వివిధ చైనా యాప్స్‌ను నిషేధించాలంటూ టెక్ కంపెనీలకు ఎన్‌ఐసీ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉన్న పోస్టు పూర్తిగా అసత్యం. వాటిని నెటిజన్లు నమ్మొద్దు.

ప్రభుత్వం, ఎన్ఐసీ కానీ ఇప్పటివరకు అలాంటి ఉత్తర్వులు విడుదల చేయలేదు” అని వెల్లడించింది.