DailyDose

ఇండియాకు రష్యా యుద్ధవిమానాలు-తాజావార్తలు

ఇండియాకు రష్యా యుద్ధవిమానాలు-తాజావార్తలు

* సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సైన్యం తన అస్త్రాలను మెరుగుపరుచుకుంటోంది. ఈ చర్యల్లో భాగంగా రష్యా నుంచి 33 యుద్ధ విమానాల కొనుగోలుకు రక్షణశాఖ పచ్చజెండా ఊపింది. యుద్ధ విమానాల్లో సుఖోయ్‌ ఎస్‌యూ -30 ఎంకేఐ ఫైటర్లు 12, మిగ్‌ -29 ఫైటర్లు 21 ఉన్నాయి. వీటితో పాటు మరో 59 మిగ్‌-29 యుద్ధ విమానాల ఆధునీకరణకు కూడా అనుమతినిచ్చింది. ఈ ప్రాజెక్టు మొత్తంవిలువ రూ. 18148 కోట్లుగా స్పష్టంచేసింది. వీటితో పాటు గగనతలం నుంచి గగనతలంలో లక్ష్యాలను కూల్చగలిగే 248 అస్త్ర బియాండ్‌ విజువల్‌ రేంజ్‌ క్షిపణులు వాయుసేన, నౌకాదళం కోసం సమీకరిస్తోంది. అంతేకాకుండా వెయ్యి కి.మీల దూరంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణుల తయారీకి డీఆర్‌డీవోకి రక్షణశాఖ పచ్చజెండా ఊపింది. మొత్తంగా దేశీయ రక్షణ సంస్థలకు సంబంధించిన రూ.38900 కోట్ల విలువైన ప్రతిపాదనల్లో దాదాపు రూ.31,130 కోట్లకు రక్షణశాఖ సమీకరణ మండలి ఆమోదం తెలిపింది.

* కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది. అంతేకాకుండా కోవిడ్‌ బాధితులు, స్వీయ నిర్బంధంలో ఉన్నవారికి సైతం ఈ‌ అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ ఏడాది చివరిలో బిహార్‌ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా బారినపడి చికిత్స పొందుతున్న వారు బయటకువచ్చి ఓటు వేయడం ద్వారా ఇతరులకు వైరస్‌ సోకే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా సీఈసీ అభిప్రాయపడింది.

* తాను అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే.. హెచ్-‌1బీ వీసాల జారీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తానని అమెరికా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ ప్రకటించారు. అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు, నైపుణ్యం గల వారికి మాత్రమే తమ దేశంలో స్థానం కల్పించేందుకు వీలుగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఈ వీసాల జారీని ఈ ఏడాది చివరి వరకు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం భారతీయ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

* యాప్‌లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చైనా విలవిల్లాడుతోంది. మింగలేక కక్కలేక బాధపడుతోంది. డబ్లూటీసీ నియమాలకు విరుద్ధమని డొల్ల మాటలు చెబుతోంది. అయితే, యాప్‌ల నిషేధంతో డ్రాగన్‌ కంపెనీలపై దెబ్బ బాగానే పడిందని తెలిసింది. నిషేధం వల్ల టిక్‌టాక్‌, హెలో యాప్‌ల మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ ఏకంగా రూ.45వేల కోట్లు (6 బిలియన్‌ డాలర్లు) నష్టపోనుందని చైనా అధికార మీడియా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది.

* కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు మేలు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం లేదని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘లాక్‌డౌన్‌ పెట్టిన తర్వాత ఏపీకి రూ.8వేల కోట్లు ఇచ్చామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఆనిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వినియోగించలేదు. ప్రతి కుటుంబానికి కనీసం రూ.5వేలు చొప్పున ఇవ్వాలని కోరినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. కరోనా కిట్లు, బ్లీచింగ్‌ కొనుగోలులో అవీనితికి పాల్పడ్డారు’’ అని చంద్రబాబు అన్నారు.

* మయన్మార్‌లోని కాచిన్‌ రాష్ట్రంలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. జాడె అనే ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడి 113 మంది కార్మికులు మృతిచెందారు. వందలాది మంది గనుల్లో పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 14,285 మంది నమూనాలు పరీక్షించగా 845 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలకు చెందిన నాలుగు, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 29 కేసులు ఉండగా.. రాష్ట్రంలో 812 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 16,907 కేసులు నమోదయ్యాయి.

* కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేసింది. ఆ సమయంలో డబ్బులేకపోవడంతో చాలామంది ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌) నుంచి డబ్బులు ఉపసంహరించుకున్నారు. ఏప్రిల్‌ నుంచి 55లక్షలకు పైగా చందాదారులు రూ.15,000 కోట్లు వెనక్కి తీసుకున్నారు. అయితే, ఇది ఆదాయపన్ను పరిధిలోకి వస్తుందో రాదో చూసుకోవడం ముఖ్యమని ఆర్థికనిపుణులు సూచిస్తున్నారు.

* ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలోనూ దుందుడుకు చైనాకు చుక్కెదురైంది! అమెరికా, జర్మనీ ఆ దేశంపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఊహించని విధంగా భారత్‌కు నిశ్శబ్దంగా మద్దతు ప్రకటించాయి.

* చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాన్ని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ ‘డిజిటల్ దాడి‌’గా అభివర్ణించారు. భారత్‌-చైనా సరిహద్దులోని తూర్పు లద్దాఖ్ వద్ద ఇరు దేశాల సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలో మన దేశానికి చెందిన 21 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత్..చైనాకు చెక్‌ పెట్టేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. దానిలో భాగంగానే యాప్‌లపై నిషేధం విధిస్తూ ప్రకటన చేసింది.

* త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన ఫీచర్లను తీసుకొస్తున్నట్లు వాట్సాప్‌ ప్రకటించింది. ఆండ్రాయిడ్‌, డెస్క్‌టాప్‌, వెబ్‌ మోడ్‌లలో ఇవి రానున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఈ మెసేజింగ్‌ దిగ్గజం యానిమేటెడ్‌ స్టిక్కర్లను, వాట్సాప్‌లో క్యూఆర్‌ కోడ్స్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు గ్రూప్‌ వీడియో కాల్స్‌ సౌకర్యానికి మెరుగులు దిద్దింది. వాట్సాప్‌ వెబ్‌, డెస్క్‌టాప్‌ క్లైంట్లకు డార్క్‌మోడ్‌ను అందుబాటులోకి తెచ్చింది.

* భీమా కోరేగావ్‌ కేసులో అరెస్టయి తలోజా జైలులో ఉన్న విరసం నేత వరవరరావు ఆరోగ్యంపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. జైలులో ఉన్న వరవరరావు ఈ రోజు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశారని వరవరరావు అల్లుడు వేణుగోపాల్‌ మీడియాకు వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వరవరరావు ఆరోగ్యంపై జైలు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. జైలు అధికారుల నుంచి సమాచారం వచ్చినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం’’ అని వేణుగోపాల్ తెలిపారు.

* రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌ను ఏపీ ప్రభుత్వం నియమించింది. గత కొన్నాళ్లుగా ఖాళీగా ఉన్న ఈ పదవిలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పి.రమేశ్‌కుమార్‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ఉత్తర్వులు జారీచేశారు. పి.రమేశ్‌కుమార్‌ 1986 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. అలాగే, సమాచార కమిషనర్‌గా రేపాల శ్రీనివాసరావును నియమించారు.