ScienceAndTech

ఇండియాలో శామ్‌సంగ్ తయారీ

ఇండియాలో శామ్‌సంగ్ తయారీ

శాంసంగ్ మొబైల్ తయారీ విభాగం భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వియత్నాంలో కొనసాగిన ఈ యూనిట్ భారత్‌కు తరలించేందుకు శాంసంగ్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓ ప్రముఖ పత్రిక ఓ కథనం ప్రచురించింది. ఒకవేళ ఇదే జరిగితే శాంసంగ్ మొబైల్స్‌లో అత్యధిక భాగం భారత్‌లోనే తయారుకానున్నాయి. ఏడాదికి 40 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.3 లక్షల కోట్లు) విలువైన మొబైల్స్ భారత్‌లో తయారయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు మొబైల్ తయారీలో ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత వియత్నాం రెండో స్థానంలో ఉంది. అంతేకాకుండా శాంసంగ్ తన మొత్తం మొబైల్స్ తయారీలో సగానికి పైగా వియత్నాంలోనే తయారు చేస్తుంది. ఈ నేపథ్యంలో శాంసంగ్ భారత్‌ వైపు చూడడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉంటే యాపిల్ మొబైల్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ ఇప్పటికే భారత్‌‌లో తయారీకి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పుడు శాంసంగ్ కూడా ఆ జాబితాలో చేరనుండడంతో భారత్‌లో మొబైల్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందనుందని నిపుణుల అంచనా.