ScienceAndTech

ఆన్‌లైన్ జూదంతో భారత యువతకు చైనా ఎర

ఆన్‌లైన్ జూదంతో భారత యువతకు చైనా ఎర

సరిహద్దుల వద్ద వాస్తవాధీన రేఖ అతిక్రమణకు విశ్వప్రయత్నాలు చేస్తున్న చైనా… భారత్‌లో యువతను జూదంలో దింపి కోట్లు కొల్లగొట్టే కుట్రలను పోలీసులు భగ్నం చేశారు. ఆన్‌లైన్ జూదం నిర్వహిస్తున్న చైనాకు చెందిన కంపెనీలపై కేసులు నమోదు చేసి… నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చైనా కంపెనీల మోసం గురించి తెలుసుకొని బాధితులు పలు పీఎస్​లలో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ప్రస్తుతం ముగ్గురు నిందితులు హైదరాబాద్​లోని చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆన్‌లైన్ జూదం నిర్వహించిన చైనా కంపెనీలు డాకీ పే, లింక్ యున్ సంస్థలపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆన్‌లైన్ జూదం నిర్వహించి నిర్వాహకులు మోసాలకు పాల్పడ్డారని తెలుసుకున్న పలువురు బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. చైనాకు చెందిన పలు కంపెనీలు ఈ- కామర్స్ పేరుతో సంస్థలు స్థాపించి తెరవెనుక ఆన్‌లైన్ జూదం నిర్వహించాయి. వందల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డాయి.

*** టెలిగ్రామ్ ద్వారా..
టెలిగ్రామ్ యాప్ ద్వారా యువకులను ఆకర్షించి నిర్వాహకులు ఆన్‌లైన్ జూదం నిర్వహించారు. యువతకు మొదట జూదంలో డబ్బులు వచ్చేలా చేసి ఆ తర్వాత డబ్బులు క్రమంగా పోయేలా సాఫ్ట్‌వేర్ రూపొందించి వేల మందిని మోసం చేశారు. సుమారు 30కి పైగా ఈ- కామర్స్ సంస్థలు స్థాపించి వాటి ద్వారా యువకులను, జూదం ఆడేవారిని ఆకర్షించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

*** హవాలా ద్వారా…
ఈ కేసులో చైనాకు చెందిన యాన్‌హావ్‌తో పాటు దిల్లీకి చెందిన ధీరజ్, నీరజ్‌లను పోలీసులు నెల క్రితం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆన్‌లైన్ ద్వారా సంపాదించిన రూ. 1,500 కోట్లను… చైనాలోని ప్రధాన కంపెనీ టీ పవర్‌కు హవాలా మార్గం ద్వారా డబ్బులు తరలించినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. 30కిపైగా స్థాపించిన ఈ- కామర్స్ సంస్థల్లో డైరెక్టర్లుగా చాలా మందిని చేర్చుకున్నారు.

*** కేసు నమోదు..
వీరిలో అత్యధికంగా దిల్లీలోని ప్రధాన రహదారుల పక్కన చిరు వ్యాపారం నిర్వహించే వాళ్లున్నారు. అయితే వారు ఆ సంస్థ డైరెక్టర్లు అన్న విషయం వారికి తెలియకుండా నిందితులు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న చైనాకు చెందిన కొంతమంది వ్యక్తులతో పాటు దిల్లీకి చెందిన మరికొంత మంది పరారీలో ఉన్నారు. వీళ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. హవాలా మార్గం ద్వారా డబ్బు వెళ్లినట్లు తేలడంతో… ఈడీ, ఆదాయపుపన్ను శాఖ అధికారులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆన్‌లైన్ జూదాన్ని ప్రభుత్వం నిషేధించిందని… దీనికి సంబంధించిన బాధితులెవరైనా ఉంటే ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచిస్తున్నారు.