Devotional

తుంగభద్ర పుష్కరాల్లో ప్రతిరోజు పూజలు ఇవి

తుంగభద్ర పుష్కరాల్లో ప్రతిరోజు పూజలు ఇవి

తుంగభద్ర జీవనదికి పుష్కర ఘడియలు సమీపించాయి. తిరుమల తిరుపతి దేవస్థాన పంచాంగాన్ని అనుసరించి నేటి మధ్యాహ్నం 1.21 గంటలకు బృహస్పతి(గురు) గ్రహం మకర రాశిలోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పన్నెండు రోజులూ పూజలు, దానాలు నిర్వహించాలన్నది శాస్త్ర వచనం. ఒక్కోరోజు…..ఒక్కో దేవతను పూజించడంతోపాటు దానాలు చేయాలని వేద పండితులు చెబుతున్నారు.
*మొదటి రోజు
పుష్కరాల్లో తొలి రోజు మహావిష్ణువును పూజించాలి. గురు జప మంత్రాన్ని పఠిస్తూ ఉండటం మంచిది. బంగారం, వెండి, భూమి, ధాన్యం వంటివి దానం చేయాలి.
*రెండో రోజు
ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుడిని పూజించాలి. చటక శ్రాద్ధాన్ని ఆచరించడం శ్రేష్ఠం. గోవు, వస్త్రం, రత్నాలు, ఉప్పు వంటివి దానమివ్వాలి.
*3వ రోజు
లక్ష్మీదేవిని పూజించి పితృ దేవతలకు తర్పణాలు వదలాలి. నగదు, కూరగాయలు, పండ్లు, బెల్లం, గుర్రాన్ని దానం చేయాలి.
*4వ రోజు
వినాయకుడిని పూజించడంతోపాటు, ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఈ రోజంతా పఠిస్తూ ఉండటం మంచిది. నెయ్యి, నూనె, పాలు, తేనె, పానకం దానం చేయాలి.
*5వ రోజు
శ్రీకృష్ణ పరమాత్మను పూజించాలి. ‘‘ఓం సూర్యాయ నమః’’ లేదా ‘‘ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః’’ అనే మంత్రాన్ని రోజంతా పఠిస్తూ ఉండటం మంచిది. ఈరోజు స్వయంపాకం భుజించడం మంచిది. అంటే ఎవరి వంట వారే వండుకుని తినాలని శాస్త్ర వచనం. ఈ రోజు ధాన్యం, దున్నపోతు, ఎద్దు, గేదె, బండి, నాగలి వంటివి దానం చేయాలి.
*6వ రోజు
చదువుల తల్లి సరస్వతిని పూజించాలి. ప్రధానంగా విద్యార్థులు పుష్కర స్నానమాచరించి సరస్వతీ పూజ చేయడం వల్ల విద్యాభివృద్ధి జరుగుతుంది. ఆరో రోజు లక్ష్మీ మంత్రాన్ని పఠించాలి. ఔషధ దానం చేయాలి. అంటే అనారోగ్యంతో ఉన్న రోగులకు ఔషధాలు ఇవ్వాలి. దీంతోపాటు గంధం, కస్తూరి, కర్పూరం వంటివి దానం చేయాలి.
*7వ రోజు
గౌరీ పూజను నిర్వహించడంతోపాటు గణేశ మంత్రాన్ని జపించాలి. ఈ రోజు ఒక్కరికైనా అన్నదానం చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రయాగ-త్రివేణి సంగమంలో లక్ష మందికి దానం చేసిన ఫలం వస్తుంది. ఈ రోజున మంచం, పల్లకి, ఊయల, ఇల్లు వంటివి దానం చేయాలి.
*8వ రోజు
మంగళకరుడైన పరమేశ్వరుడిని పూజించడంతోపాటు, శ్రీకృష్ణ మంత్రాన్ని జపించాలి. 8వ రోజు బ్రాహ్మణుడికి అంగ వస్త్రాన్ని దానం చేయాలి. దీంతో పాటు పూలదండ, గంధపు చెక్క, అల్లం వంటివి దానం చేయవచ్ఛు.
*9వ రోజు
తొమ్మిదో రోజు అనంతుడిని పూజించాలి. పితృ దేవతలకు పిండ ప్రదానానికి విశేషమైన రోజుగా చెప్పబడుతోంది. దుప్పట్లు, కంబళి వంటి వాటిని దానమివ్వాలి.
*10వ రోజు
నృశింహ స్వామిని పూజించడంతోపాటు పార్వతీ మంత్రాన్ని పఠించాలి. ఈ రోజు రాగి చెంబు, గ్లాసు, తువ్వాలు, పుస్తకం వంటివి దానం చేయవచ్ఛు.
*11వ రోజు
వామనుడిని పూజించాలి. ‘‘ఓం నమః శివాయ’’ అనే పంచాక్షరీ మంత్రాన్ని పఠించాలి. అన్నదానం చేయాలి. గంధం, యజ్ఞోపవీతం, వస్త్రం దానం చేయాలి.
*12వ రోజ
పుష్కరాల్లో చివరి రోజు శ్రీరాముడిని పూజించడంతోపాటు, రామనామాన్ని జపించాలి. ఈరోజు నువ్వులు దానం చేయడం పుణ్య కార్యంగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. పుష్కరాల చివరిరోజు షోడశ దానాలు, దశ దానాలు చేయాలని వేద పండితులు చెబుతున్నారు.