Politics

GHMC ఓటర్ల అనాసక్తి-తాజావార్తలు

GHMC Elections 2020 Witnesses Hardly 40% Voter Turnout

* జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మళ్లీ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. ఎప్పటిలాగే గ్రేటర్‌ ఎన్నికల్లో పోలింగ్‌ ప్రక్రియ మందకొడిగానే సాగింది. గతంతో పోల్చినా మరీ తక్కువగా పోలింగ్‌ శాతం నమోదైంది. సాయంత్రం 5గంటల వరకు కేవలం 36.73 శాతం ఓటర్లు మాత్రమే ఓటువేశారు. సాయంత్రం 6గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం ఇవ్వడంతో ఈ శాతం మరికాస్త పెరిగే అవకాశం ఉంది. ఈ మధ్యాహ్నం 1గంట వరకు ఒక్కశాతం కూడా పోలింగ్‌ నమోదు కాని డివిజన్లు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

* రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వ్యవసాయ చట్టాలపై అన్నదాతల ఆందోళన నేపథ్యంలో చట్టాలపై చర్చించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనికి రైతు సంఘాల ప్రతినిధులు ససేమిరా అన్నారు. కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని స్పష్టంచేశారు. కమిటీ ఏర్పాటు నిర్ణయాన్ని తోసిపుచ్చారు.

* గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్లకి డబ్బులు ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వం హింసిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. అసెంబ్లీ ముగిసిన అనంతరం వెలుపల మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. అధికార పార్టీ మాయమాటలు చెబుతోందన్నారు. ఎదురుదాడి చేస్తూ తమ నోరు మూయించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి తాము అడ్డుపడ్డామంటూ వైకాపా నేతలు ఆరోపిస్తున్నారని.. ఎక్కడ అడ్డుపడ్డామో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు.

* దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ వేయాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. మంగళవారం జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా టీకా వేయాల్సిన అవసరముందని ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి సాంకేతికపరమైన విషయాలు మాట్లాడేటపుడు సరైన సమాచారం ఉంటేనే మాట్లాడాలి అని ఆయన ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. వ్యాక్సిన్‌ ఇవ్వడం అనేది దాని సమర్థతపై ఆధారపడి ఉంటుందన్నారు.

* ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని భాజపా మొదటి నుంచీ కోరుకుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి అన్ని విధాలా సహకరించామన్నారు. ఓటింగ్‌ శాతం తగ్గించే ప్రక్రియలో రాష్ట్ర ఎన్నికల సంఘం తెరాసకు సహకరించడం సిగ్గుచేటన్నారు. పోలింగ్‌ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో అనేక చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయని.. అయితే ఎక్కడ కూడా భాజపా కార్యకర్తలు గొడవలకు దిగలేదని ఆయన స్పష్టం చేశారు. పథకం ప్రకారమే పోలీసు, ఎన్నికల సంఘం సమన్వయంతో నాలుగు రోజులు సెలవు వచ్చేలా చేశారని సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

* ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఇళ్ల స్థలాల అంశంపై జరిగిన చర్చ సందర్భంగా తెదేపా సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేదలు నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు చెల్లించాలంటూ తెదేపా ఆందోళన కొనసాగించింది. ఈ క్రమంలో సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారనే కారణంతో తెదేపా సభ్యులను సస్పెండ్‌ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ను కోరారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మినహా 14 మంది తెదేపా సభ్యులను స్పీకర్‌ ఒక రోజు పాటు సభ నుంచి సస్పెండ్‌ చేశారు.

* దురాక్రమణ బుద్ధిగల చైనా ఎత్తుగడలకు విరుగుడుగా భారత్‌ మరో సంచలన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో బ్రహ్మపుత్ర నదిపై 10 గిగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మించే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని తెలిసింది. కేంద్ర ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయికి సంబంధిత దస్త్రం చేరినట్టు అధికారులు చెబుతున్నారు.

* ప్రముఖ చెల్లింపుల సంస్థ పేటీఎం.. వ్యాపారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వ్యాపారులు చేసే లావాదేవీలపై అన్ని రకాల ఛార్జీలను రద్దు చేసింది. ఇకపై పేటీఎం వ్యాలెట్‌, యూపీఐ యాప్స్‌, రూపే కార్డుల ద్వారా చేసే పేమెంట్స్‌పై ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయబోమని పేర్కొంది. ఇది వ్యాపారులకు లాభం చేకూర్చి వారి వ్యాపారాభివృద్ధికి తోడ్పడుతుందని పేటీఎం ఓ ప్రకటనలో పేర్కొంది.

* షార్ట్‌ బాల్స్‌తో ఔట్‌ చేయాలని భావిస్తున్న ఆస్ట్రేలియా ప్రణాళిక తనకి లాభమని టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అన్నాడు. ఫీల్డర్లను దగ్గరగా ఉంచి సంధించే బౌన్సర్లకు ఎదురుదాడికి దిగితే పరుగులు సాధించవచ్చని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో శ్రేయస్‌ 40 పరుగులే చేశాడు. తొలి వన్డేలో పేలవమైన షాట్ ఆడి రెండు పరుగులకే పెవిలియన్‌ చేరగా, రెండో మ్యాచ్‌లో స్మిత్ అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో వెనుదిరిగాడు.

* భారత్‌లో రష్యా టీకా ప్రయోగాలు ప్రారంభిస్తున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌, రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్టిమెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) సంయుక్తంగా ప్రకటించాయి. స్పుత్నిక్‌-వి టీకా రెండు, మూడో దశ పయోగాల కోసం కావాల్సిన అనుమతులను సెంట్రల్‌ డ్రగ్స్‌ లేబొరేటరీ నుంచి పొందినట్లు వెల్లడించాయి. జేఎస్‌ఎస్‌ మెడికల్‌ రీసెర్చ్‌ భాగస్వామ్యంతో ఈ ప్రయోగాలను నిర్వహిస్తున్నామని తెలిపాయి. అయితే, ప్రయోగాల సలహా కోసం భారత బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టాన్స్‌ కౌన్సిల్‌(భీఋఆఛ్)తో కలిసి పనిచేస్తున్నామని డాక్టర్‌ రెడ్డీస్‌ పేర్కొంది.