Business

నీరవ్ సోదరుడు కూడా వజ్రాల మోసగాడే-వాణిజ్యం

Business News - NewYork Attorney Files Case Against Nirav Modi Brother

* భారత్‌లో బ్యాంకులను మోసం చేసి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ సోదరుడిపై న్యూయార్క్‌లో కేసు నమోదైంది. నీరవ్‌ సోదరుడు నిహాల్‌ తప్పుడు పత్రాలను చూపి ఎల్‌ఎల్‌డీ డైమండ్స్‌ యూఎస్‌ఏ నుంచి 2.6 మిలియన్‌ డాలర్ల విలువైన వజ్రాలను అరువుపై తీసుకొన్నారు. తర్వాత వాటిని వ్యక్తిగత అవసరాల కోసం విక్రయించాడని మాన్‌హట్టన్‌ డిస్ట్రిక్‌ అటార్ని సీవై వాన్స్‌ జూనియర్‌ డిసెంబర్‌ 18న ప్రకటించారు.

* మన దేశంలో పండగొచ్చినా, శుభకార్యమైనా ముందుగా గుర్తొచ్చేది బంగారమే. ధర మాట ఎలా ఉన్నా బంగారం కొనుగోలుకు ప్రజలు మొగ్గు చూపుతుంటారు. అయితే, పసిడి అధికంగా దిగుమతి చేసుకోవడం వల్ల దేశ వాణిజ్య లోటుపై ప్రభావం చూపుతోంది. కరోనా పుణ్యమాని ఈ ఏడాది బంగారం దిగుమతుల భారీగా తగ్గాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- నవంబర్‌ మధ్య 40 శాతం మేర దిగుమతులు తగ్గినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది ఇదే సమయానికి మొత్తం బంగారం దిగుమతుల విలువ 20.6 బిలియయన్‌ డాలర్లు కాగా.. ఈ ఏడాది అది 12.3 బిలియన్‌ డాలర్లు మాత్రమే కావడం గమనార్హం. ఒక్క నవంబర్‌ విషయానికొస్తే ఈ నెలలో 3 బిలియన్‌ డాలర్ల విలువైన బంగారం దిగుమతి అయ్యింది. గతేడాదితో పోల్చినప్పుడు ఇది 2.65 శాతం అధికం.

* ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన భారీ రుణ ఖాతాలను ‘మోసపూరిత’ ఖాతాలుగా బ్యాంకులు గుర్తించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందుకు డిసెంబరు 31ని గడువుగా పెట్టినట్లు ఈ విషయాలతో సంబంధమున్న ఇద్దరు వ్యక్తులు తెలిపినట్లు వార్తా సంస్థ కోజెన్సిస్‌ వెల్లడించింది. ‘హెచ్చరికలు జారీ చేసిన ఆయా ఖాతాల పరిస్థితిపై నివేదిక పంపడంతో పాటు, వాటిని సరిగ్గా వర్గీకరించడానికి ఆర్‌బీఐ ఈ గడువు నిర్ణయించింది. కొన్ని బ్యాంకుల్లో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు బలంగా లేకపోవడం వల్లే ఆర్‌బీఐ ఈ ఆదేశాలు జారీ చేసింద’ని బ్యాంకింగ్‌ అధికారి ఒకరు తెలిపారు. అటువంటి ఖాతాలను మోసపూరిత ఖాతాలుగా గుర్తించడం, లేదంటే క్రమబద్ధీకరించిన పక్షంలో ఖాతాను నవీకరించడం వంటి విషయాల్లో బ్యాంకులు వేగం కనబరచడం లేదని.. అందుకే ఆర్‌బీఐ ఈ అడుగులు వేస్తోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. చాలా వరకు బ్యాంకులు కొన్ని ఖాతాలను ‘మోసపూరితమైనవి’గా గుర్తించాయి. అయితే అన్ని బ్యాంకులూ ఈ విషయంలో ముందుకు రావాల్సి ఉందని ఆర్‌బీఐ భావిస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

* అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం నానాటికీ ముదురుతున్నట్లు కన్పిస్తోంది. ఇప్పటికే చైనాకు చెందిన పలు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించగా.. తాజాగా అగ్రదేశ స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి చైనా కంపెనీలను డీలిస్ట్‌ చేసే చట్టంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. హోల్డింగ్‌ ఫారిన్‌ కంపెనీస్‌ అకౌంటబుల్‌ యాక్ట్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టంతో.. చైనా కంపెనీలు అమెరికా అమెరికా సెక్యూరిటీస్‌ చట్టాలను పాటించడంలో విఫలమైతే గనుక వాటిని స్టాక్‌ మార్కెట్ల నుంచి డీలిస్ట్‌ చేయొచ్చు.

* హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల సంస్థ ఎంటార్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు రానుంది. ఈ సంస్థ న్యూక్లియర్‌, రక్షణ, అంతరిక్ష పరిశోధనల్లో ఉపయోగించే 14 రకాలైన యంత్ర విడిభాగాలను తయారు చేస్తోంది. ఈ విడిభాగాలను పీఎస్‌ఎల్‌వీ-సీ25, జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-7, మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌, మంగళ్‌యాన్‌, చంద్రయాన్‌ తదితర ప్రాజెక్టులకు అందిస్తోంది. విస్తరణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూ.600 కోట్ల నుంచి రూ.650 కోట్లు సమీకరించాలనే ఉద్దేశంతో ఎంటార్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూ ప్రాస్పెక్టస్‌ను సెబీ వద్ద దాఖలు చేసింది. దీని ప్రకారం ఈ కంపెనీ కొత్తగా ఒక్కొక్కటీ రూ.10 ముఖ విలువున్న 40 లక్షల ఈక్విటీ షేర్లు జారీ చేస్తుంది. అంతేగాక ‘ఆఫర్‌ ఫర్‌ సేల్‌’ కింద ప్రమోటర్లు, కొందరు ఇన్వెస్టర్లు 82,24,270 లక్షల షేర్లు విక్రయిస్తారు. అంటే మొత్తం 1,22,24,270 షేర్లు ఐపీఓ ద్వారా మదుపరులకు అందుబాటులోకి వస్తాయని స్పష్టం అవుతోంది. ఈ కంపెనీ చేతిలో ప్రస్తుతం రూ.356 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగం టర్నోవర్‌లో దేశీయ అమ్మకాల ఆదాయం 47.29 శాతం కాగా ఎగుమతులు 52.71 శాతంగా ఉన్నాయి. ఈ సంస్థ హైదరాబాద్‌ శివార్లలోని ఆదిభట్లలో కొత్తగా షీట్‌ మెటల్‌ యూనిట్‌ను నెలకొల్పే సన్నాహాల్లో ఉంది. ఐపీఓ ద్వారా లభించిన సొమ్ము నుంచి రూ.55 కోట్ల అప్పు తీర్చాలని, రూ.95 కోట్లను దీర్ఘకాలిక/ స్వల్పకాలిక అవసరాలకు కేటాయించాలని కంపెనీ భావిస్తోంది.